త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్దానికి బ్రేక్‌.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ కొనుగోళ్లతో దూసుకెళ్లాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 4 శాతం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు (3.95 శాతం) పెరిగి 77,562.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 873.7 పాయింట్లు (3.78 శాతం) పెరిగి 23,997.35 వద్ద స్థిర‌ప‌డింది.

S

Business | Published On Apr 8, 2026, 3.58 pm IST

Stock Markets | యుద్దానికి బ్రేక్‌.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ కొనుగోళ్లతో దూసుకెళ్లాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 4 శాతం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు (3.95 శాతం) పెరిగి 77,562.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 873.7 పాయింట్లు (3.78 శాతం) పెరిగి 23,997.35 వద్ద స్థిర‌ప‌డింది. ఈ ర్యాలీ విస్తృతంగా సాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు రెండూ 4 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. మార్కెట్‌లో ఒత్తిడిని సూచించే ఇండియా విక్స్ సూచీ 20 శాతం కంటే ఎక్కువగా పడిపోయి 20 స్థాయి కంటే దిగువకు చేరింది. ఇది మార్కెట్ భయాందోళనలు తగ్గుతున్నాయని సూచిస్తోంది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు దాదాపు 6 శాతం పెరిగాయి. రియాల్టీ, ఆటో రంగ సూచీలు 7 శాతం వరకు ఎగ‌బాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.429 లక్షల కోట్ల నుంచి రూ.446 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.17 లక్షల కోట్ల మేర పెరిగింది.

చ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చోటు చేసుకోవ‌డంతోనే మార్కెట్ల‌లో ఈ ర్యాలీ వ‌చ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాలపాటు ఇరాన్‌పై సైనిక చర్యలను నిలిపివేస్తామని ప్రకటించారు. ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకరించింది. అంతేకాకుండా ఇరువైపుల చర్చలు శుక్రవారం ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. దీంతో పశ్చిమ ఆసియా యుద్ధం ముగియబోతుందన్న ఆశతో మార్కెట్లు ఉత్సాహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 95 డాల‌ర్ల కింద‌కు పడిపోవడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చింది. హార్ముజ్ జలసంధి మళ్లీ తెరిచే అవకాశం బ‌ల‌ప‌డ‌డంతో మార్కెట్‌లో బుల్ ట్రెండ్‌కు దోహదపడింది. ముడి చమురు ధరల పతనం కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 14 శాతం పడిపోయి బ్యారెల్‌కు 95 డాల‌ర్ల‌ కంటే దిగువకు చేరాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుతుందన్న ఆశలు మార్కెట్‌లో సానుకూల భావనను పెంచాయి. చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనంగా మారింది. దీని వల్ల వృద్ధి అంచనాలు మెరుగుపడటంతోపాటు రూపాయి బలపడే అవకాశం ఉంటుంది.

బ‌ల‌ప‌డ్డ రూపాయి..

డాలర్ బలహీనత, రూపాయి బలపడటం కూడా దేశీయ మార్కెట్ల‌కు క‌ల‌సి వ‌చ్చింది. డాలర్ సూచీ 1 శాతం కంటే ఎక్కువగా తగ్గి 98.69కు చేరింది. అదే సమయంలో భారత రూపాయి బలపడింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో రూపాయి ప్రారంభ ట్రేడింగ్‌లో 50 పైసలు పెరిగి డాలర్‌కు 92.56 వద్ద ట్రేడ్ అయింది. బలహీనమైన డాలర్, బలమైన రూపాయి విదేశీ పెట్టుబడిదారుల ధోరణిలో మార్పుకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడటం వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మళ్లే అవకాశం ఉంది. కనీసం వారు కొనసాగిస్తున్న విక్రయాలను ఆపాల్సి వస్తుంద‌ని నిపుణులు తెలిపారు.

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో సానుకూల సంకేతాలు..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల కార‌ణంగా కూడా స్టాక్ మార్కెట్ల‌లో ఉత్సాహం క‌నిపించింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ సూచీలు 6 శాతం వరకు పెరిగాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఈ ఒప్పందం ఆసియా మార్కెట్లకు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఒప్పంద వివరాలపై స్పష్టత లేకపోవడం వల్ల అస్థిరత కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ద్రవ్య విధాన నిర్ణయం కూడా మార్కెట్లపై పాజిటివ్ ప్ర‌భావాన్ని చూపించింది. ఆర్‌బీఐ ఎలాంటి ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోకుండా రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. అలాగే విధాన వైఖరిని న్యూట్రల్ గా కొనసాగించింది. మార్కెట్ అంచనాల ప్రకారమే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో భవిష్యత్తులో డేటా ఆధారిత విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. లిక్విడిటీకి మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ విధానం వృద్ధికి, ఈక్విటీ, బాండ్ మార్కెట్లకు అనుకూలంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement