త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వారంలో రూ.20 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డం, అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ ప‌డిపోతుండ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాల ప‌ర్వం కొన‌సాగుతోంది. శుక్ర‌వారం అన్ని సూచీలు భారీగా ప‌త‌నం అయ్యాయి.

S

Business | Published On Mar 13, 2026, 4.12 pm IST

Stock Markets | వారంలో రూ.20 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డం, అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ ప‌డిపోతుండ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాల ప‌ర్వం కొన‌సాగుతోంది. శుక్ర‌వారం అన్ని సూచీలు భారీగా ప‌త‌నం అయ్యాయి. వారాంతం కావ‌డంతో వ‌చ్చే ట్రేడింగ్ సెష‌న్‌కు మ‌రో 2 రోజుల గ‌డువు ఉన్నందున ఈ 48 గంట‌ల్లో ఏదైనా జ‌రుగుతుందేమోన‌న్న ఆందోళన‌తోనూ పెట్టుబ‌డిదారులు భారీగా అమ్మ‌కాలు సాగించిన‌ట్లు మార్కెట్ల ప‌త‌నాన్ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక క్రితం సెష‌న్‌తో పోలిస్తే బీఎస్ఈ సెన్సెక్స్ 1471 పాయింట్లు (1.93 శాతం) న‌ష్ట‌పోయి 74,563.92 వ‌ద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సైతం 488 పాయింట్లు (2.06 శాతం) ప‌త‌నం అయి 23,151.10 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ ఏకంగా 2.61 శాతం ప‌త‌నం అవ్వ‌గా, బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ సూచీ 2.67 శాతం మేర న‌ష్టాన్ని న‌మోదు చేసింది.

వారం రోజుల్లో రూ.20 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి..

యుద్ధం కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గ‌త కొంత కాలంగా న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. వ‌రుస‌గా మూడో వారం కూడా భారీ న‌ష్టాల‌తోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 4355 పాయింట్లు (5.5 శాతం) ప‌త‌నం అవ‌గా, నిఫ్టీ 50 కూడా 1300 పాయింట్లు (5.3 శాతం) ప‌డిపోయింది. ఈ వారంలో పెట్టుబ‌డిదారులు మొత్తం రూ.20 ల‌క్ష‌ల కోట్ల విలువైన సంప‌ద‌ను కోల్పోయారు. మార్చి 6న రూ.450 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ మూల‌ధ‌నం శుక్ర‌వారం సెషన్ ముగిసే స‌మయానికి భారీగా న‌ష్ట‌పోయి రూ.430 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌ని అయోమ‌య గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో పెట్టుబ‌డిదారులు తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యారు. ఇప్ప‌టికి యుద్ధం 14వ రోజు చేర‌డంతోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల మార్కెట్‌ల‌లోనూ భయాందోళ‌న‌లు, అనిశ్చితి నెల‌కొన్నాయి. ఇది దేశీయ మార్కెట్ల‌పై కూడా ప్ర‌భావం చూపించింది.

100 డాల‌ర్ల‌కు పైన చ‌మురు ధ‌ర‌లు..

శుక్ర‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర‌లు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు పైగా గ‌రిష్ట స్థాయిని తాకాయి. చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం కూడా మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. అలాగే అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ కూడా గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. శుక్ర‌వారం నాటి సెష‌న్‌లో డాల‌ర్‌తో రూపాయి విలువ 17 పైస‌లు న‌ష్ట‌పోయి 92.3663 కొత్త రికార్డు స్థాయిని తాకింది. రూపాయి విలువ ప‌త‌నం అవుతుండ‌డం కూడా మార్కెట్ల‌ను కింద‌కు తెచ్చింది. ఆర్‌బీఐ ప్ర‌కారం రూపాయి విలువ‌ను స్థిరీక‌రించేందుకు అమెరికా డాల‌ర్ల‌ను విక్ర‌యిస్తున్న‌ప్ప‌టికీ ఆ చ‌ర్య పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు (ఎఫ్ఐఐ) నిరంత‌రాయంగా షేర్ల‌ను విక్ర‌యిస్తుండ‌డం కూడా మార్కెట్‌లో ఆందోళ‌న‌ల‌ను పెంచింది. వారు గతేడాది జూలై నుంచి ఇప్పటి వ‌ర‌కు రూ.46వేల కోట్ల మేర షేర్ల‌ను విక్ర‌యించారు. ఇది ఇత‌ర పెట్టుబ‌డిదారుల‌పై ప్ర‌భావం చూపిస్తోంది.

ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రింత పెరిగే ప్ర‌మాదం..

యాక్సిస్ సెక్యూరిటీస్ సంస్థ తెలిపిన ప్ర‌కారం క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు 10 డాల‌ర్ల మేర పెరిగితే భారత జీడీపీ లోటు 0.35 నుంచి 0.5 శాతం మేర ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు 10 శాతం పెరిగితే ద్ర‌వ్యోల్బ‌ణం 20 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌జేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం కూడా పెరుగుతుండ‌డంతో అది మార్కెట్ల‌పైనా ప్ర‌భావం చూపిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌ అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ డాల‌ర్‌ను బ‌ల‌ప‌రిచేందుకు క‌ఠిన‌మైన పాల‌సీల‌ను అమ‌లు చేస్తే మాత్రం భార‌త స్టాక్ మార్కెట్ల‌కు గ‌డ్డుకాల‌మే ఉంటుంద‌ని, మ‌రిన్ని విదేశీ పెట్టుబ‌డులు బ‌య‌ట‌కు వెళ్లిపోయే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంచ‌నా వేసింది.

Advertisement
Advertisement