త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Investments | బంగారంపై వ‌చ్చిన లాభాల‌ను బుక్ చేయాలా.. పెట్టుబడుల‌ను కొన‌సాగించాలా..?

Gold Investments | గతేడాది నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలు పెట్టుబ‌డిదారుల‌కు గణనీయమైన లాభాలను అందిస్తున్నాయి. భౌగోళిక ఉద్రిక్త‌త‌లు, అనిశ్చిత ప‌రిస్థితుల నేపథ్యంలో సేఫ్-హేవన్ డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దేశంలో రానున్న రోజుల్లో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

S

Business | Published On Apr 19, 2026, 10.03 am IST

Gold Investments | బంగారంపై వ‌చ్చిన లాభాల‌ను బుక్ చేయాలా.. పెట్టుబడుల‌ను కొన‌సాగించాలా..?
Advertisement

Gold Investments | గతేడాది నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలు పెట్టుబ‌డిదారుల‌కు గణనీయమైన లాభాలను అందిస్తున్నాయి. భౌగోళిక ఉద్రిక్త‌త‌లు, అనిశ్చిత ప‌రిస్థితుల నేపథ్యంలో సేఫ్-హేవన్ డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దేశంలో రానున్న రోజుల్లో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. గ‌తేడాది ఇదే స‌మ‌యం నుంచి బంగారం ధ‌ర‌లు దాదాపుగా 63 శాతం మేర పెరిగాయి. దీంతో పెట్టుబ‌డిదారుల‌కు భారీగా లాభాలు వ‌చ్చాయి. ఇక ఇదే కాలంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) కూడా గ‌ణ‌నీయ‌మైన లాభాల‌ను అందించాయి. ఈ ఫండ్స్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచాయి. అయితే ఇప్పుడు బంగారం ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఈటీఎఫ్‌ల‌లో పెట్టిన పెట్టుబ‌డుల‌ను విత్ డ్రా చేయాలా, లేక కొన‌సాగించాలా.. అని చాలా మంది పెట్టుబ‌డిదారులు ఆలోచిస్తున్నారు. ఇందుకు నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు.

స‌గ‌టున 60 శాతం మేర లాభం..

సగటుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు గత ఏడాది ఇదే స‌మ‌యం నుంచి మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 59-60 శాతం వరకు రాబడులను ఇచ్చాయి. కొన్ని ఫండ్లు 60 శాతం మార్క్‌ను కూడా అధిగమించాయి. టాప్ ప్రదర్శన చేసిన ఫండ్లలో క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్, టాటా గోల్డ్ ఈటీఎఫ్ సుమారు 60 శాతం రాబడుల‌తో నిలిచాయి. అదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ 58.73 శాతం రాబడిని అందించగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 58.69 శాతం, జీరోధా గోల్డ్ ఈటీఎఫ్ 58.60 శాతంవృద్ధిని సాధించాయి. కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ 58.51 శాతం పెరిగింది. డీఎస్‌పీ గోల్డ్ ఈటీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ లు వరుసగా 58.49 శాతం, 58.48 శాతం లాభాలను నమోదు చేశాయి. చాయిస్ వెల్త్ సంస్థలో రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ హెడ్ అక్షత్ గార్గ్ ప్రకారం ఈ పెరుగుదల గ్లోబల్ సేఫ్-హేవన్ డిమాండ్, జియోపొలిటికల్ అనిశ్చితులు, అలాగే దేశీయంగా ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్‌లపై పెరిగిన ఆసక్తి కారణంగా సాధ్యమైంద‌ని తెలిపారు.

గోల్డ్ అవుట్ లుక్ పాజిటివ్‌గానే..

గోల్డ్ ఈటీఎఫ్‌లలో నిరంతర ఇన్‌ఫ్లోలు పెరగడం ధరలను మరింత ఎగబాకేలా చేసి, పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందించాయ‌ని గార్గ్ తెలిపారు. చాలా మంది పెట్టుబడిదారులకు మొదట చిన్న భాగంగా పెట్టిన గోల్డ్ పెట్టుబడి, ఈ భారీ ర్యాలీ కారణంగా ఇప్పుడు పోర్ట్‌ఫోలియోలో పెద్ద వాటాగా మారింద‌న్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్‌ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీస్) దేవేయా గాగ్లాని మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలో సుమారు రూ.78 వద్ద ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ ధరలు ఇప్పుడు రూ.125 వరకు పెరిగాయ‌ని, దాదాపు 60 శాతం రాబడిని అందించాయ‌ని తెలిపారు. తదుపరి ఏడాదికి గోల్డ్ అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంద‌ని, క్రూడ్ ఆయిల్ ధరలు 119 నుంచి 84 డాల‌ర్ల వరకు పడిపోవడం, యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందంపై అంచనాలు పెరగడం వల్ల ద్ర‌వ్యోల్బ‌ణం ఒత్తిడి తగ్గే అవకాశం ఉంద‌ని అన్నారు. అయినప్పటికీ గోల్డ్ బలంగా నిలిచి కోమెక్స్ గోల్డ్ ధరలు 4,800 డాల‌ర్ల‌ పైకి రావడం ధరలకు అనుకూల సంకేతమ‌ని ఆమె పేర్కొన్నారు. ఆమె అంచనా ప్రకారం 2026 రెండో అర్ధ భాగంలో గోల్డ్ ధరలు 10-15 శాతం వరకు రాబడులను ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయని అంచ‌నా వేశారు.

పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలి..

గాగ్లాని సూచన మేరకు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనసాగించడం మంచిదని, కొత్త పెట్టుబడిదారులు స్టాగర్డ్ విధానంలో నెమ్మదిగా పెట్టుబడులు పెట్టాలని అన్నారు. అక్షత్ గార్గ్ మాత్రం లాభాలను బుక్ చేయాలా లేదా కొనసాగించాలా అన్న నిర్ణయం పెట్టుబడిదారుల అసెట్ అలొకేషన్ వ్యూహంపై ఆధారపడి ఉండాలని చెప్పారు. గోల్డ్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో అనుకున్న దానికంటే ఎక్కువ శాతానికి పెరిగితే, కొంత లాభాన్ని బుక్ చేసి రీబ్యాలెన్స్ చేయడం మంచిద‌ని, పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం లేద‌ని, కొంత లాభాన్ని లాక్ చేసుకుని మునుపటి అలొకేషన్ స్థాయిని తిరిగి సాధించాల‌ని అన్నారు. గోల్డ్ వాటా లక్ష్యానికి తగ్గట్టే లేదా తక్కువగా ఉంటే పెట్టుబడిదారులు దానిని కొనసాగించడం లేదా క్రమంగా పెంచడం కూడా సరైన నిర్ణయం అవుతుంద‌ని తెలిపారు. గోల్డ్ ఇప్పటికీ మంచి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైయర్‌గా, మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణగా పనిచేస్తుంద‌ని గార్గ్ పేర్కొన్నారు. అయితే స్వ‌ల్ప‌కాలంలో ధ‌ర‌లు అస్థిరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల అవ‌కాశం వ‌చ్చినప్పుడు, అంటే.. బంగారం ధ‌ర త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మ‌మ‌ని సూచించారు. ఇప్ప‌టికే పెట్టుబ‌డి పెట్టి ఉన్న‌వారు కొద్దిగా లాభాన్ని బుక్ చేసుకుని మ‌ళ్లీ పోర్ట్ ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాల‌ని తెలిపారు.

Advertisement
Advertisement