త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | ‘బేర్’మ‌న్న స్టాక్ మార్కెట్లు

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. గ్లోబ‌ల్ మార్కెట్‌లో అనిశ్చిత ప‌రిస్థితి, విదేశీ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణతో వ‌రుస‌గా రెండోరోజూ అమ్మ‌కాల‌తో ఒత్తిడికి గుర‌య్యారు. ఓ ద‌శ‌లో సెన్సెక్స్ 1200 పాయింట్ల వ‌ర‌కు ప‌త‌న‌మైంది.

P

Business | Published On Jan 20, 2026, 5.52 pm IST

Stock Market | ‘బేర్’మ‌న్న స్టాక్ మార్కెట్లు
Advertisement
  • ఒకే రోజు రూ.9ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
  • 1,065.71 పాయింట్లు త‌గ్గిన సెన్సెక్స్‌
  • 353 పాయింట్లు న‌ష్ట‌పోయిన నిఫ్టీ
  • అమ్మ‌కాల‌తో ఒత్తిడికి స్టాక్స్‌

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. గ్లోబ‌ల్ మార్కెట్‌లో అనిశ్చిత ప‌రిస్థితి, విదేశీ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణతో వ‌రుస‌గా రెండోరోజూ అమ్మ‌కాల‌తో ఒత్తిడికి గుర‌య్యారు. ఓ ద‌శ‌లో సెన్సెక్స్ 1200 పాయింట్ల వ‌ర‌కు ప‌త‌న‌మైంది. నిఫ్టీ సైతం 25,200 దిగువ‌కు చేరింది. ఆ త‌ర్వాత స్వ‌ల్పంగా కోలుకున్నా.. రెండునెల‌ల కనిష్టానికి ప‌డిపోయాయి. మార్కెట్ల ప‌త‌నంతో ఒకేరోజు దాదాపుగా రూ.9ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌రుల సంప‌ద ఆవిరైంది. ఈ నేప‌థ్యంలో బీఎస్ఈలో న‌మోదైన కంపెనీల మొత్తం విలువ రూ.9.46 లక్షల కోట్లు త‌గ్గి రూ.455.7 లక్షల కోట్లకు చేరింది. ఉద‌యం సెన్సెక్స్ 83,207.38 పాయింట్ల వద్ద న‌ష్టాల్లో మొద‌లైంది. ఏ ద‌శ‌లోనూ మ‌ళ్లీ కోలుకోలేదు. ఇంట్రాడేలో 82,010.58 పాయింట్ల క‌నిష్టానికి చేరిన సెన్సెక్స్.. చివ‌ర‌కు 1,065.71 పాయింట్లు త‌గ్గి 82,180.47 వ‌ద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 353 పాయింట్లు ప‌త‌న‌మై 25,232.50 వద్ద ముగిసింది.

వాణిజ్య యుద్ధ భ‌యాలు, నిరాశాజ‌న‌క‌మైన మూడో త్రైమాసికం ఫ‌లితాల మ‌ధ్య గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప్ర‌తికూల ప‌వ‌నాల కార‌ణంగా మార్కెట్లు అమ్మ‌కాల ఒత్తిడికి గురైన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గ్రీన్‌లాండ్ విష‌యంలో త‌న‌కు స‌హ‌కారం అందించ‌క‌పోతే టారిఫ్‌లు విధిస్తామంటూ ఈయూ దేశాల‌ను ట్రంప్ హెచ్చ‌రిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి టారిఫ్ వార్ త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 1న ఈయూ దేశాల‌పై 10శాతం లెవీ విధించ‌నున్న‌ట్లు ట్రంప్ హెచ్చ‌రించారు. అలాగే, ఈయూ 108 బిలియ‌న్ల అమెరిక‌న్ వ‌స్తువుల‌పై సుంకాలు విధించే అవ‌కాశాల‌న్ని ప‌రిశీలిస్తున్న‌ది. ఈ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై సైతం ప‌డింది. అదే స‌మ‌యంలో విదేశీ పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో సెంటిమెంట్‌ను దెబ్బ‌తీసింది. రూ.3263 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్ర‌యించారు. ఇక సోమ‌వారం మార్కెట్లు 0.40శాతం ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. రెండోరోజు 1.5శాతం మేర త‌గ్గాయి.

ఐటీ కంపెనీల లాభాలపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఐటీ స్టాక్స్‌ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.1 శాతం, విప్రో 3 శాతం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు 7 శాతం ప‌త‌న‌మ‌య్యాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌ల కారణంగా ఆయా కంపెనీలు బలహీన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియ‌ల్టీ 5శాతం కుప్ప‌కూల‌గా.. కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3శాతం పడిపోయాయి. ఆటో, ఐటీ, మెటల్‌, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 2శాతం చొప్పున పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 0.81శాతం త‌గ్గ‌గా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 1.16శాతం ప‌త‌న‌మైంది. ఇక నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ ఉన్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభ‌ప‌డ్డాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement