త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Two Wheelers | దేశంలో రికార్డు స్థాయిలో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల అమ్మ‌కాలు.. టాప్ కంపెనీలు ఇవే..

Electric Two Wheelers | గ‌త కొన్నేళ్లుగా దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ అధికంగా పెరుగుతోంది. కార్ల‌తోపాటు టూవీల‌ర్ల‌ను కూడా వినియోగ‌దారులు ఎక్కువ సంఖ్య‌లో కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారి అవ‌స‌రాల‌కు, ఆఫీసుల‌కు వెళ్లేవారు పెట్రోల్‌తో న‌డిచే టూవీల‌ర్ల‌ను కాకుండా ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

S

Business | Published On Apr 4, 2026, 3.30 pm IST

Electric Two Wheelers | దేశంలో రికార్డు స్థాయిలో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల అమ్మ‌కాలు.. టాప్ కంపెనీలు ఇవే..
Advertisement

Electric Two Wheelers | గ‌త కొన్నేళ్లుగా దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ అధికంగా పెరుగుతోంది. కార్ల‌తోపాటు టూవీల‌ర్ల‌ను కూడా వినియోగ‌దారులు ఎక్కువ సంఖ్య‌లో కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారి అవ‌స‌రాల‌కు, ఆఫీసుల‌కు వెళ్లేవారు పెట్రోల్‌తో న‌డిచే టూవీల‌ర్ల‌ను కాకుండా ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీంతో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల అమ్మ‌కాలు రికార్డు స్థాయిలో పెరిగాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా బ‌జాజ్ ఆటో, టీవీఎస్‌, హీరో మోటోల‌కు తోడు, ఏథ‌ర్ ఎన‌ర్జీ, ఓలా ఎలక్ట్రిక్ త‌దిత‌ర కంపెనీలు కొత్త ఈవీ మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తుండ‌డంతో ఈ ప‌రిశ్ర‌మ‌కు జోష్ వ‌చ్చింది. పైగా ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌లో అనేక ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. పెట్రోల్ వాహ‌నంతో పోలిస్తే మైలేజీకి చాలా త‌క్కువ ఖ‌ర్చ‌వుతోంది. ఈ కార‌ణాల వ‌ల్లే ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లకు విశేష రీతిలో స్పంద‌న లభిస్తోంది.

మొద‌టి స్థానంలో టీవీఎస్ మోటార్స్‌..

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వ‌ర‌కు ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను త‌యారు చేసే కంపెనీలు అన్నీ క‌లిసి ఏకంగా 13.5 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను విక్ర‌యించిన‌ట్లు గ‌ణాంకాల ద్వారా స్ప‌ష్ట‌మైంది. అంత‌కు ముందు ఏడాది (2024-25)తో పోలిస్తే ఈ అమ్మ‌కాల సంఖ్య 17.3 శాతం పెరిగింది. అయితే ఈ ఏడాదిలో కంపెనీలు 15 ల‌క్ష‌ల మేర ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను విక్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను విక్ర‌యించిన కంపెనీగా టీవీఎస్ మోటార్స్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 3,41,647 వాహ‌నాల‌ను విక్ర‌యించి 44 శాతం వృద్ధిని సాధించింది. త‌రువాతి జాబితాలో బ‌జాజ్ ఆటో నిలిచింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవ‌త్స‌రంలో 2,89,325 ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను విక్ర‌యించి 25 శాతం వృద్ధిని న‌మోదు చేసింది.

క్షీణించిన ఓలా ఎల‌క్ట్రిక్ అమ్మ‌కాలు..

తొలి రెండు స్థానాల్లో నిలిచిన కంపెనీల‌తో పోటీ ప‌డుతూ ఏథ‌ర్ ఎన‌ర్జీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ సంస్థ 2,39,129 ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను విక్ర‌యించి 82 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే ఓలా ఎల‌క్ట్రిక్ మాత్రం గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీగా న‌ష్ట‌పోయింది. ఆ సంస్థ అమ్మ‌కాలు చాలా క్షీణించాయి. ఏకంగా సగానికి పైగా ప‌డిపోయాయి. కేవ‌లం 1,64,294 ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్లను మాత్ర‌మే ఓలా ఎల‌క్ట్రిక్ విక్ర‌యించి 52 శాతం క్షీణ‌త‌ను న‌మోదు చేసింది. ఇక మార్చి నెలలో ప్ర‌ధాన‌మంత్రి ఎల‌క్ట్రిక్ డ్రైవ్ రివల్యూష‌న్ ఇన్ ఇన్నొవేష‌న్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకంలో డిమాండ్ ఇన్సెంటివ్స్ ముగియనున్న నేపథ్యంలో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల తయారీ సంస్థలు గణనీయమైన అమ్మకాలను నమోదు చేశాయి. ఈ పథకాన్ని ఇప్పుడు జూలై వరకు పొడిగించారు.

క‌స్ట‌మ‌ర్ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నాం: ఓలా ఎల‌క్ట్రిక్

మార్చి నెల‌లో టీవీఎస్‌ మోటార్ కంపెనీ 49,453 ఈవీ రిజిస్ట్రేషన్లు నమోదు చేయగా, బ‌జాజ్ ఆటో 46,246 రిజిస్ట్రేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏథ‌ర్ ఎన‌ర్జీ 35,688 యూనిట్లను రిజిస్ట‌ర్ చేసింది. దేశంలో అతిపెద్ద టూవీల‌ర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 21,434 ఈవీ రిజిస్ట్రేష‌న్లు చేసింది. వరుసగా నాలుగు నెలలుగా అమ్మకాలు పడిపోతున్న ఓలా ఎల‌క్ట్రిక్ మాత్రం మార్చిలో 10వేల‌ యూనిట్లను రిజిస్ట్రేషన్ చేసింది. కాగా ఓలా ఎల‌క్ట్రిక్ కు చెందిన ఈవీల‌లో పెద్ద ఎత్తున సాంకేతిక లోపాలు ఉండ‌డంతోపాటు కంపెనీ స‌ర్వీస్ ప‌ర‌మ చెత్త‌గా ఉంద‌ని ఇప్పటికే చాలా మంది క‌స్ట‌మ‌ర్లు చెప్పారు. అందువ‌ల్లే ఆ సంస్థ ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఓలా ఎల‌క్ట్రిక్ ఇటీవ‌లి కాలంలో తమ‌ అమ్మకాలు కాస్త పెరిగాయ‌ని, సేవల వ్యవస్థలో చేప‌ట్టిన నిర్మాణాత్మక మార్పులే ఇందుకు కారణమని పేర్కొంది. సంస్థ ప్రకటన ప్రకారం ఇప్పుడు 80 శాతం కంటే ఎక్కువ వాహనాలకు క‌స్ట‌మ‌ర్ వాహ‌నాన్ని ఇచ్చిన రోజునే స‌ర్వీస్ చేసి అందిస్తున్నార‌ని, మెరుగైన స్పేర్ పార్ట్స్ అందుబాటు, వేగవంతమైన డయాగ్నోస్టిక్స్, నెట్‌వర్క్‌లో కఠినమైన ఆపరేషనల్ నియంత్రణ వల్ల ఇది సాధ్యమైంద‌ని తెలిపింది. ఇటీవల నెలల్లో ఎదురైన సేవా సమస్యల తరువాత సంస్థ లోతైన మార్పులు చేపట్టింద‌ని, టర్న్‌రౌండ్ టైమ్, కస్టమర్ అనుభవాన్ని గణనీయంగా పెంచామ‌ని తెలిపింది.

Advertisement
Advertisement