త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచిన ఆర్‌బీఐ.. ఎఫ్‌డీల‌పై ప్ర‌భావం ప‌డుతుందా..?

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) బుధవారం కీలక నిర్ణయం తీసుకుని వడ్డీ రేట్లను 5.25 శాతంగా యథాతథంగా ఉంచినట్లు ప్రకటించింది. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న యుద్ధం అనంత‌రం ఇరు దేశాలు తాజాగా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆర్‌బీఐ నుంచి వ‌చ్చిన ఈ నిర్ణ‌యాన్ని ముందుగానే ఊహించామ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On Apr 8, 2026, 5.10 pm IST

RBI | వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచిన ఆర్‌బీఐ.. ఎఫ్‌డీల‌పై ప్ర‌భావం ప‌డుతుందా..?
Advertisement

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) బుధవారం కీలక నిర్ణయం తీసుకుని వడ్డీ రేట్లను 5.25 శాతంగా యథాతథంగా ఉంచినట్లు ప్రకటించింది. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న యుద్ధం అనంత‌రం ఇరు దేశాలు తాజాగా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆర్‌బీఐ నుంచి వ‌చ్చిన ఈ నిర్ణ‌యాన్ని ముందుగానే ఊహించామ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గ్లోబ‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఆశ‌లు పెరుగుతున్న క్ర‌మంలో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భావించారు. కానీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచిన‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌త నెల‌లో ప్ర‌భుత్వం కొత్త ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యాన్ని నిర్ణయించిన అనంత‌రం నిర్వ‌హించిన తొలి ద్రవ్య విధాన స‌మీక్ష‌గా తాజా ఎంపీసీ నిలిచింది.

4 శాతం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించాలి..

కాగా 2031 మార్చి వ‌ర‌కు రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని 4 శాతం వ‌ద్ద (±2 శాతం మార్జిన్‌తో) నియంత్రించాల్సిన బాధ్య‌త ఆర్‌బీఐపై ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన తొలి ద్వైమాసిక ద్ర‌వ్య విధానాన్ని ప్ర‌క‌టిస్తూ ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా, ఎంపీసీ ఏక‌గ్రీవంగా న్యూట్ర‌ల్ విధాన వైఖ‌రిని స్వీక‌రించిన‌ట్లు తెలిపారు. ఆర్‌బీఐ నిర్ణ‌యించే రుణ వ‌డ్డీ రేట్లు ప్ర‌ధానంగా ఆర్థిక ల‌క్ష్యాల‌ను స‌మ‌తుల్యం చేయ‌డానికి దోహ‌దం చేస్తాయి. అయితే ఇవి బ్యాంకింగ్ ఉత్ప‌త్తుల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తాయి. ముఖ్యంగా రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) వంటి ఉత్ప‌త్తుల‌పై దీని ప్ర‌భావం ఉంటుంది. తాజాగా ఎంపీసీ నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రెపో రోటులో మార్పు లేక‌పోవ‌డంతో ఇది బ్యాంకుల ఎఫ్‌డీ రేట్ల‌పై ఎలా ప్ర‌భావం చూపిస్తుంద‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎఫ్‌డీ రేట్ల‌కు స్థిర‌త్వం..

రెపో రేటును య‌థాత‌థంగా ఉంచ‌డం ఎఫ్‌డీ రేట్ల‌కు స్థిర‌త్వాన్ని అందిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు రుణాలు, డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యించేట‌ప్పుడు ఆర్‌బీఐ విధాన రేటును ఆధారంగా తీసుకుంటాయి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఎఫ్‌డీ రేట్ల‌లో త‌క్ష‌ణ మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని వ‌ల్ల కొత్త‌గా డిపాజిట్లు చేసే వారికి అధిక రాబ‌డులు ల‌భించే అవ‌కాశాలు పరిమితంగా ఉంటాయ‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఎఫ్‌డీలు నిర్వ‌హిస్తున్న ఖాతాదారుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. ఎందుకంటే వారి వ‌డ్డీ రేట్లు ముందుగానే లాక్ అయి ఉంటాయి.

6.60 నుంచి 8.10 శాతం వ‌ర‌కు రేట్లు..

ప్రస్తుతం దేశంలో బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు వివిధ ర‌కాల ఎఫ్‌డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. గ‌ణాంకాల ప్ర‌కారం డిపాజిట్ వ్య‌వ‌ధి, బ్యాంకు విధానం, ఇత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఈ రేట్లు సుమారు 6.60 నుంచి 8.10 శాతం వ‌ర‌కు ఉన్నాయి. కొత్త‌గా ట‌ర్మ్ డిపాజిట్లు ప్రారంభించాల‌నుకునే వారు ప్ర‌స్తుత ఎఫ్‌డీ రేట్ల‌ను ప‌రిశీలించి, బ్యాంకుల మ‌ధ్య పోల్చి చూసి త‌మ‌కు గ‌రిష్ట లాభం వ‌చ్చే విధంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్‌డీ రేట్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌క‌పోయినా ఇవి గ్యారంటీడ్ రాబ‌డుల‌ను అందిస్తాయి. అలాగే లాక్‌-ఇన్ కాలంపై ఖాతాదారుల‌కు స్వేచ్ఛ‌ను కూడా ఇస్తాయి. మార్కెట్ అస్థిర‌త ఉన్న స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌ను విభ‌జించుకునేందుకు, రిస్క్‌ను త‌గ్గించుకునేందుకు ఎఫ్‌డీలు సుర‌క్షిత‌మైన‌వి, విశ్వ‌స‌నీయ‌మైన పెట్టుబ‌డి మార్గంగా ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచ‌డం వ‌ల్ల కొత్త‌గా ఎఫ్‌డీల‌ను వేసే వారికి భారీ లాభం క‌ల‌గ‌క‌పోయినా భ‌విష్య‌త్తులో ఈ రేట్ల‌ను పెంచే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఎఫ్‌డీలు స్థిర‌మైన రాబ‌డుల‌ను అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement
Advertisement