త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guvvala Balaraju | ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్‌కు గువ్వల బాలరాజు లేఖ

Guvvala Balaraju | గురుకుల విద్యాల‌యాల (Gurukula Schools) కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఆయ‌న‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వ‌ల బాల‌రాజు (Guvvala Balaraju) డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Jul 15, 2026, 11.51 am IST

Guvvala Balaraju | ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్‌కు గువ్వల బాలరాజు లేఖ
Advertisement

Guvvala Balaraju | త్రినేత్ర‌.న్యూస్‌: గురుకుల విద్యాల‌యాల (Gurukula Schools) కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఆయ‌న‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వ‌ల బాల‌రాజు (Guvvala Balaraju) డిమాండ్ చేశారు. 2013-2021 మధ్య రూ.10 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని, టెండర్లు లేకుండా ఏకపక్షంగా నిధులు ఖర్చు చేశారన్నారు. నియామకాలు, క్రమబద్ధీకరణలో డబ్బు దండుకున్నారని ఆరోపించారు. ఐఐటీ, జేఈఈ కోచింగ్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటిన్నిటిపై సమగ్ర విచారణ జరిపి ఆయ‌న ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ప్ర‌భుత్వాన్ని కోరారు. నాటి సీఎం కేసీఆర్ (KCR) అండ‌తోనే ప్ర‌వీణ్ కుమార్ అవినీతికి పాల్ప‌డ్డార‌ని, ఐఏఎస్ విధులను ఐపీఎస్‌కు పదేళ్లపాటు అప్పగించడం వెనుక కుట్ర దాగి ఉంద‌న్నారు. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) గువ్వ‌ల బాల‌రాజు లేఖ రాశారు.

లేఖ‌లో ఏముందంటే..

`తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 2023లో వీఆర్ఎస్ తీసుకునేంత వరకు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవీకాలంలో అనేక ఆర్థిక అవతవకలకు, పరిపాలనా పరమైన అక్రమాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు బహిర్గతమయ్యాయి. ప్రత్యేకంగా గురుకుల విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన ప్రజాధనం వినియోగం, ప్రైవేట్ సంస్థలకు పనుల అప్పగింత, టెండర్ విధానాలు, ముందస్తు చెల్లింపులు, నాణ్యత లేని వస్తువుల స్వీకరణ, డబ్బులు తీసుకుని గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను కట్టబెట్టడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌లోనూ అక్రమాలకు పాల్పడ్డారు.

కోచింగ్ పేరుతో 20 కోట్లు దుర్వినియోగం

ఐఐటీ, జేఈఈ (IIT/JEE) కోచింగ్ పేరుతో దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. వీటికి సంబంధించిన పనులకు టెండర్ లేదు. ఆర్ధిక శాఖ అనుమతి లేదు. సమ్మర్ క్యాంపులు, యూనిఫాం, బ్లాంకెట్ల పంపిణీకి సంబంధించిన నిధుల విషయంలోనూ పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని కాగ్ నివేదిక (2025)లో పేర్కొన్నారు. అట్లాగే కాగ్ నివేదిక, మీడియా కథనాల ప్రకారం.. గురుకుల విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కోడింగ్ (software coding) శిక్షణ పేరుతో ఏటా సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు వ్యయం చేశారు. ఇంత ఖర్చు చేసినా కేవలం సుమారు 240 మంది విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.92 లక్షల నుంచి రూ.97.20 లక్షల వరకు అధిక చెల్లింపులు జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. మీడియాలోనూ కథనాలు వచ్చాయి. గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఇప్పటివరకు విచారణ జరపలేదు.

అలాగే 2021 జూలైలో రూ.3.07 కోట్ల చెల్లింపులు అందుకున్న ప్రైవేట్ సంస్థకు బ్యాంక్ గ్యారంటీ లేకుండానే 90 శాతం ముందస్తు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒప్పందం అనంతరం సెక్రెట‌రీ స్థాయిలో సెక్యూరిటీ డిపాజిట్ (security deposit)ను మాఫీ చేశారని, తద్వారా అసలు టెండ‌ర్ కండీష‌న్స్ (tender conditions)లో మార్పులు జరిగాయనే ఆరోపణ కూడా ఉంది. టెండర్ ఖరారైన తర్వాత నిబంధనలను మార్చే అధికారం ఎవరు ఇచ్చారు?. బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ (Board of Governors) ఉందా? దీనివల్ల ప్రైవేట్ సంస్థకు అనుచిత ఆర్థిక ప్రయోజనం కలిగిందా? అనే అంశాలపై విచారణ జరపాలి.

కోడింగ్ ప్రాజెక్టు..

కోడింగ్ ప్రాజెక్టుకు (coding project) సంబంధించిన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరుతున్నాం. అట్లాగే సాఫ్ట్ వేర్ లైసెన్స్ కు సంబంధించి లైసెన్స్ యుటిలైజేషన్ పూర్తి వివరాలు లేకుండానే రూ.2.03 కోట్లు ఏకపక్షంగా చెల్లించినట్లు తెలిసింది. రూ.9.33 కోట్లు వెచ్చించి యూనిఫాం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘించారని, తద్వారా రూ.76.89 లక్షలు అధిక చెల్లింపులు జరిగినట్లు కాగ్ పేర్కొంది. ఆ నిధులు ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేలాల్సి ఉంది.

2013 నుంచి 2021 వరకు TSWREIS, TTWREISకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు నిధుల దుర్వినియోగమైనట్లు తెలుస్తున్న‌ది. ఈ నేపథ్యంలో ఆయా సంవత్సరాల కాలంలో నిర్వహించిన అన్ని క్యాష్ బుక్స్‌, లెడ్జ‌ర్లు, పేమెంట్ ఓచ‌ర్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, PFMS లేదా ట్రెజ‌రీ రికార్డుల‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాల్సిన అవ‌సరం ఉది.

నియామ‌కాల్లో నిబంధనల ఉల్లంఘన..

2013–2021 మధ్య TSWREIS/TTWREISలో జరిగిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, కోఆర్డినేటర్ సహా నాన్ రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఉద్యోగ నియమాకాల్లో నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా తన అనుయాయులకు, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు 2013–2021 మధ్య కాలంలో డైట్, యూనిఫామ్స్, షూస్, సాక్స్, బెడ్డింగ్, కాస్మోటిక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్ కు సంబంధించి నిబంధనలకు భిన్నంగా తన అనుయాయకులకే కట్టబెట్టినట్లు తెలిసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకుల విద్యాలయాల్లో స్వచ్చంద సంస్థ పేరుతో ప్రైవేట్ నెట్‌వర్క్ జోక్యం ఎక్కువైందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ హింసాయుత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

సహకరించిన గత ప్రభుత్వం

మొత్తంగా 2014 నుంచి 2023 వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ విచారణ జరపకుండా గత ప్రభుత్వం ఆయనకు పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి అయిన‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఐఏఎస్ నిర్వహించాల్సిన విధులను అప్పగించడాన్ని చూస్తుంటే గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన అవినీతికి సహకరించినట్లు అర్ధమవుతున్న‌ది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అండ చూసుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని టెండర్లు నిర్వహించకుండా తన అనుయాయులకు అనేక పనులు అప్పగించారు. ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలుస్తున్న‌ది.

సవాల్ చేసినా..

బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో ప్రవీణ్ కుమార్ భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నప్పటికీ గత రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడం, కనీసం విచారణకు కూడా ఆదేశించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్న‌ది. నిస్పిగ్గుగా తన పదవిని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఆయ‌న తన పదవీకాలంలో జరిగిన అవతవకలపై విచారణకు సిద్ధమని బహిరంగంగా సవాల్ చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తున్న‌ద‌ని చెప్పారు. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలు అత్యంత తీవ్రమైన అంశాలు. ఇప్ప‌టికైనా ప్రవీణ్ కుమార్ TSWREIS/TTWREIS కార్యదర్శిగా పనిచేసిన మొత్తం పదవీకాలంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, టెండర్, కొనుగోలు నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రైవేట్ నెట్‌వర్క్ జోక్యం, గురుకుల నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాల‌ని, బాధ్యుల నుంచి ఆస్తులను స్వాధీనపర్చుకోవడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Advertisement
Advertisement