త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bear Market | 5 రోజుల్లో రూ.19 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. బేర్ మార్కెట్ ప్రారంభ‌మైందా..?

Bear Market | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. అమెరికా-ఇరాన్ ఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం కారణంగా పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల్లోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.19 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.

S

Business | Published On Mar 7, 2026, 10.27 am IST

Bear Market | 5 రోజుల్లో రూ.19 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. బేర్ మార్కెట్ ప్రారంభ‌మైందా..?
Advertisement

Bear Market | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. అమెరికా-ఇరాన్ ఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం కారణంగా పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల్లోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.19 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. ద‌లాల్ స్ట్రీట్‌లో జరిగిన ఈ భారీ అమ్మకాల నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 3,330 పాయింట్లు క్షీణించింది. ఈ పతనం సాధారణ మార్కెట్ సవరణ మాత్రమేనా, లేక పూర్తి స్థాయి బేర్ మార్కెట్ ప్రారంభమా అన్న ప్రశ్నలు పెట్టుబడిదారుల్లో ఆందోళ‌న‌ను కలిగిస్తున్నాయి. ఈ అమ్మకాల ఒత్తిడి దాదాపు అన్ని రంగాల్లో కనిపించింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులు, టూరిజం, ఎయిర్‌లైన్ స్టాక్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఆటో రంగం కూడా నష్ట‌పోయాయి.

ఎఫ్ఐఐలు రూ.23వేల కోట్ల‌కు పైగా విక్ర‌యాలు..

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా మార్గాల్లో అంతరాయం ఏర్పడ‌డంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న ట్విన్ డెఫిసిట్ (ఆర్థిక‌ లోటు, ప్రస్తుత ఖాతా లోటు)పై ఒత్తిడి పెంచుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిలో రక్షణ రంగం స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. మ‌జ‌గాన్ డాక్‌, సోలార్ ఇండ‌స్ట్రీస్‌, ప‌రాస్ డిఫెన్స్ వంటి కంపెనీల షేర్లు యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుదలను నమోదు చేశాయి. వెంచురా సెక్యూరిటీస్ పరిశోధన విభాగం అధిపతి వినీత్ బోలింజ్కర్ ప్రకారం ఈ వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) రూ.23వేల కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతలు, బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 86 డాలర్ల‌ వద్దకు చేరడం పెట్టుబడిదారుల్లో రిస్క్ తగ్గించే ధోరణిని పెంచిందని ఆయన తెలిపారు.

ఇది బేర్ మార్కెట్ ల‌క్ష‌ణ‌మే..?

ప్రధాన సూచీలు మాత్రమే కాకుండా విస్తృత మార్కెట్లో పరిస్థితి మరింత దిగజారింది. రూ.1వేయి కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్‌లో దాదాపు 80 శాతం ఇప్పటికే తమ ఆల్‌టైమ్ హై నుండి 20 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఇది సాంకేతికంగా బేర్ మార్కెట్ లక్షణంగా పరిగణించబడుతుంది. అయితే నిఫ్టీ మాత్రం తన గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 7 శాతం మాత్రమే పడిపోయింది. టెక్నికల్ చార్టుల ప్రకారం మార్కెట్ తక్కువ గరిష్ఠ స్థాయిలను (లోయ‌ర్ టాప్స్‌) న‌మోదు చేస్తోంది. తక్కువకాల, మధ్యకాల మూవింగ్ యావ‌రేజ్‌ల కంటే దిగువన ట్రేడవుతోంది. వీక్లీ చార్ట్‌లో బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఇవి మరింత బలహీనతకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశీ పెట్టుబ‌డిదారులు దూరం..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ ప్రకారం ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరగవచ్చు. భారత ఆర్థిక లోటు పెరిగే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానంపై ప్రభావం పడవచ్చు. అదే సమయంలో అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి దూరంగా ఉండే అవకాశముందని తెలిపారు. పీజీఐఎం ఇండియా మ్యుచ‌వ‌ల్ ఫండ్ సీఐవో వినయ్ పహారియా ప్రకారం కొన్ని అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్‌కు అనుకూల అంశాలు కూడా ఉన్న‌ట్లు తెలిపారు. బలమైన జీడీపీ వృద్ధి, వాణిజ్య ఒప్పందాలు, తక్కువ వడ్డీ రేట్లు, పన్ను తగ్గింపులు భార‌త్ కు అనుకూలించే అంశాల‌ని అన్నారు. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం వ్యాపార నమూనాలను మార్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

లార్జ్ క్యాప్‌పై దృష్టి సారించాలి..

ట్ర‌స్ట్ లైన్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో అరుణగిరి అభిప్రాయం ప్రకారం ఇటువంటి పరిస్థితులు బాధాకరమైనప్పటికీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు అవకాశాలను సృష్టిస్తాయ‌ని తెలిపారు. తక్షణ పునరుద్ధరణ ఆశించడం సరైంది కాదని, అయితే విలువలు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచించారు. ఆస్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ‌ర్స్ సంస్థ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్‌పై దృష్టి పెట్టడం మంచిదని, 5-7 సంవత్సరాల దీర్ఘకాల వ్యూహం ఉన్నవారు మాత్రమే మైక్రో క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టాల‌ని అన్నారు. అధిక నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసి క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు, ముడి చమురు ధరలు, గ్లోబల్ పెట్టుబడిదారుల భావోద్వేగాలు వంటి అంశాలు మార్కెట్ దిశను వ‌చ్చే వారం నిర్ణయించనున్నాయి. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతు (డీఐఐ) కారణంగా భారీ పతనం ఇప్పటివరకు ఆగిపోయినప్పటికీ, సమీప భవిష్యత్తులో మార్కెట్‌లో అధిక వోలాటిలిటీ కొనసాగడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బుల్స్ గాయాల‌తో కోలుకుంటున్నార‌ని, బేర్‌లు అవ‌కాశం కోసం వేచి చూస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement