త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరుగుతున్న ఆందోళ‌న‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. ఆరంభంలో పాజిటివ్‌గానే మొద‌లైనా మ‌ధ్యాహ్నం త‌రువాత సూచీలు మ‌ళ్లీ ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో క్రితం సెష‌న్‌తో పోలిస్తే చాలా త‌క్కువ పాయింట్ల లాభంతో సూచీలు స్థిర‌ప‌డ్డాయి.

S

Business | Published On Apr 20, 2026, 4.05 pm IST

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరుగుతున్న ఆందోళ‌న‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. ఆరంభంలో పాజిటివ్‌గానే మొద‌లైనా మ‌ధ్యాహ్నం త‌రువాత సూచీలు మ‌ళ్లీ ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో క్రితం సెష‌న్‌తో పోలిస్తే చాలా త‌క్కువ పాయింట్ల లాభంతో సూచీలు స్థిర‌ప‌డ్డాయి. సెన్సెక్స్ కేవ‌లం 26.76 పాయింట్లు (0.03 శాతం) లాభ‌ప‌డి 78,520.30 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 11.30 పాయింట్లు (0.05 శాతం) లాభ‌ప‌డి 24,364.85 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అంత‌ర్జాతీయంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్న నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందువ‌ల్ల‌నే సోమ‌వారం మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడ‌య్యాయి. అమెరికా-ఇరాన్ మ‌ధ్య రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం, హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద అమెరికా నౌకా నిర్బంధాన్ని తొల‌గిస్తేనే జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని, చ‌ర్చ‌ల్లో పాల్గొంటామ‌ని ఇరాన్ చెప్ప‌డం వంటి కార‌ణాల వ‌ల్ల మార్కెట్ల‌లో కాస్త ఆందోళ‌న క‌నిపించింది. దీంతో మ‌ధ్యాహ్నం త‌రువాతి సెష‌న్‌లో అమ్మ‌కాల ఒత్తిడి పెరిగి పెట్టుబ‌డిదారులు విక్ర‌యాలు కొన‌సాగించారు. అందువ‌ల్లే మ‌ధ్యాహ్నం త‌రువాత మార్కెట్ల‌లో ప‌త‌నం సంభవించింది.

టాప్ గెయిన‌ర్లు, లూజ‌ర్లు..

ఇక నిఫ్టీ విస్తృత సూచీలు మిడ్ క్యాప్‌, స్మాల్ కాప్ న‌ష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.18 శాతం న‌ష్ట‌పోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.45 శాతం మేర ప‌త‌నమైంది. నిఫ్టీ50 సూచీలో మొత్తం 31 స్టాక్స్ న‌ష్టాల‌ను కొన‌సాగించాయి. జియో ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌, టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహికల్స్ కంపెనీల షేర్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇక ట్రెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ లాభాల‌ను న‌మోదు చేసి టాప్ గెయిన‌ర్ల జాబితాలో నిలిచాయి. వొల‌టిలిటీ ఇండెక్స్ (ఇండియా విక్స్) 9 శాతం పెరిగి మ‌ళ్లీ 19కి చేరుకంది. దీంతో మార్కెట్ల‌లో మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లైంద‌ని అర్థ‌మ‌వుతోంది. కాగా సెక్టార్ల వారిగా చూస్తే నిఫ్టీ ఐటీ, రియాల్టీ రంగాలు ఒక్కొక్క‌టి 0.5 శాతం మేర న‌ష్ట‌పోయాయి. నిఫ్టీ మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు మాత్రం ఒక్కోటి 1 శాతం చొప్పున లాభ ప‌డ్డాయి.

రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌నం..

అమెరికా-ఇరాన్ మ‌ధ్య రెండో ద‌ఫాల చ‌ర్చ‌ల‌పై ఆందోళ‌న‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 2.67 డాల‌ర్లు పెరిగి 91.21 వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 3.36 డాల‌ర్లు పెరిగి 86.87 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ భారీగా ప‌త‌న‌మైంది. 53 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి డాల‌ర్ విలువకు 93.10 వ‌ద్ద నిలిచింది. అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాలు రాక‌పోవ‌డంతోనే మార్కెట్ల‌లో ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్‌ను పొడిగించే ప్ర‌స‌క్తే లేద‌ని, వ‌చ్చే బుధవారం వ‌ర‌కు తాడో పేడో తేల్చేస్తామ‌ని చెప్ప‌డం కూడా పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ను పెంచింది. దీంతో మార్కెట్లు ముందుకు వెళ్లే మార్గం క‌నిపించ‌డం లేదు. ఫ‌లితంగా అమ్మ‌కాల ఒత్తిడి సైతం పెరిగింది. అయితే ఈ వారం రోజులు మార్కెట్ దిశ‌కు కీల‌క‌మని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement