త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మార్కెట్లలో ముగిసిన జోరు.. స్వల్ప నష్టాల్లో స్థిర‌ప‌డ్డ సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌కు శుక్రవారం భారీ దెబ్బ తగిలింది. రెండు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్ పడగా, గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల భారీ పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి కొత్త కనిష్ట స్థాయికి పడిపోవడం కారణంగా మార్కెట్‌లో భారీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్లు (0.21 శాతం) పడిపోయి 75,237.99 వద్ద ముగిసింది.

S

Business | Published On May 15, 2026, 4.04 pm IST

Stock Markets | మార్కెట్లలో ముగిసిన జోరు.. స్వల్ప నష్టాల్లో స్థిర‌ప‌డ్డ సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌కు శుక్రవారం భారీ దెబ్బ తగిలింది. రెండు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్ పడగా, గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల భారీ పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి కొత్త కనిష్ట స్థాయికి పడిపోవడం కారణంగా మార్కెట్‌లో భారీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్లు (0.21 శాతం) పడిపోయి 75,237.99 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 కూడా 46 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి 23,643.50 వద్ద సెటిల్ అయింది. మార్కెట్ పతనం కేవలం లార్జ్ క్యాప్‌లకే పరిమితం కాలేదు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కూడా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం పడిపోగా, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం నష్టపోయింది. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపదలో రూ.2 లక్షల కోట్లకు పైగా సంప‌ద‌ ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని దాదాపు రూ.463 లక్షల కోట్ల నుంచి రూ.460.5 లక్షల కోట్లకు తగ్గిపోయింది.

బ‌ల‌హీనంగానే మార్కెట్లు..

వారాంతం పరంగా చూస్తే కూడా మార్కెట్‌కు ఇది బలహీన వారం అయ్యింది. సెన్సెక్స్ ఈ వారం మొత్తం 2.7 శాతం పడిపోగా, నిఫ్టీ 50 సూచీ 2.2 శాతం క్షీణించింది. దీంతో గత రెండు వారాలుగా కొనసాగిన లాభాల పరంపరకు ముగింపు పలికింది. భారత స్టాక్ మార్కెట్ల‌ పతనానికి ప్రధాన కారణాల్లో రూపాయి బలహీనత ఒకటిగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 96 మార్క్ కంటే దిగువకు వెళ్లింది. చివరకు 30 పైసలు నష్టపోయి ఒక్క డాలర్‌కు రూ.95.94 వద్ద కొత్త రికార్డు కనిష్ట స్థాయిలో ముగిసింది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కరోజులోనే 3 శాతం ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశముందని మార్కెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగిసినా, ట్రేడ్ ఒప్పందాలపై గానీ, వెస్ట్ ఆసియా సంక్షోభం ముగింపుపై చైనా నుంచి గానీ స్పష్టమైన హామీలు రాకపోవడం కూడా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది.

వేచి చూస్తున్న పెట్టుబ‌డిదారులు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన రిలీఫ్ ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న బాండ్ యీల్డ్స్, బలహీన రూపాయి, ఇంధన ధరల పెరుగుదల మళ్లీ ద్ర‌వ్యోల్బ‌ణ‌ భయాలను పెంచుతున్నాయని తెలిపారు. అయితే ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్, బలమైన క్యూ4 ఫలితాలు మార్కెట్‌కు కొంత మద్దతు ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి వచ్చే ఫిస్కల్, మానిటరీ చర్యలపై ఇప్పుడు మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement