త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాల పరంప‌ర కంటిన్యూ.. బ్యాంకింగ్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగ‌ళ‌వారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ50పై ప్రధానంగా బ్యాంకింగ్ హెవీవెయిట్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం పడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.

S

Business | Published On Apr 28, 2026, 4.04 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాల పరంప‌ర కంటిన్యూ.. బ్యాంకింగ్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగ‌ళ‌వారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ50పై ప్రధానంగా బ్యాంకింగ్ హెవీవెయిట్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం పడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. సెన్సెక్స్ 416.72 పాయింట్లు (0.54 శాతం) పడిపోయి 76,886.91 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీ 97 పాయింట్లు (0.40 శాతం) తగ్గి 23,995.70 వద్ద స్థిర ప‌డింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం ట్రెండ్‌కు వ్యతిరేకంగా లాభాల్లో నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌ 0.28 శాతం పెర‌గ్గా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.42 శాతం వృద్ధిని నమోదు చేసింది.

బ్యాంకింగ్ రంగంలో భారీ అమ్మ‌కాలు..

బ్యాంకింగ్ రంగంలో భారీ అమ్మకాలు మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.15 శాతం పడిపోయింది. ప్రైవేట్ బ్యాంక్ సూచీ 1.23 శాతం తగ్గగా, నిఫ్టీ బ్యాంక్ మొత్తం మీద 1.54 శాతం నష్టంతో ముగిసింది. అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోవడం, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి బలహీనత వంటి అంశాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 3 శాతం పెరిగి బ్యారెల్‌కు 111 డాల‌ర్ల‌కు పైగా చేరాయి. దీంతో భారత కరెన్సీపై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ‌ 41 పైసలు పడిపోయి డాలర్‌కు 94.56 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్, గ్లోబల్ అనిశ్చితులు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అయినప్పటికీ మిడ్, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లలో కొనుగోళ్లు కొనసాగడం మార్కెట్‌లో మిశ్రమ ధోరణిని సూచిస్తోంది.

ఫెడ్ నిర్ణ‌యం నేప‌థ్యంలోనే..

నిఫ్టీ50లో ఉన్న 30 స్టాక్స్ న‌ష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంకు, మారుతి సుజికి ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, శ్రీ‌రాం ఫైనాన్స్‌, ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ లు టాప్ లూజ‌ర్ల జాబితాలో నిల‌వ‌గా, ఓఎన్‌జీసీ, అదాని ఎంట‌ర్ ప్రైజెస్‌, కోల్ ఇండియా, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, నెస్లె ఇండియా కంపెనీలు టాప్ గెయిన‌ర్లుగా స్థిర‌ప‌డ్డాయి. అయితే అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ పాల‌సీ నిర్ణ‌యం నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించారు. అందువ‌ల్లే మార్కెట్ల సెంటిమెంట్ నెగెటివ్ గా మారింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే వ‌డ్డీ రేట్ల‌ను ఫెడ్ య‌థావిధిగా ఉంచుతుంద‌ని పెట్టుబ‌డిదారులు విశ్వసించారు. ఇది భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల‌కు ప్ర‌తికూలంగా మారుతుంది. అందువ‌ల్ల‌నే మార్కెట్లు న‌ష్టాల్లో ముగిశాయి. అయితే దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు భారీ ఎత్తున కొనుగోళ్లు చేప‌ట్ట‌డంతో ఎఫ్ఐఐల అమ్మ‌కాల‌కు కుష‌న్‌గా మారింది. దీంతో భారీ ప‌త‌నం త‌ప్పింది. కానీ రానున్న రోజుల్లో ఇంకా ప‌రిస్థితులు ఎలా మారుతాయోనని పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement