త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల దిశ ఎటువైపు..?

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం విలువ ఆధారిత కొనుగోళ్లతో ఊపందుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ బెంచ్‌మార్క్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలపై వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి.

S

Business | Published On Apr 27, 2026, 4.13 pm IST

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల దిశ ఎటువైపు..?
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం విలువ ఆధారిత కొనుగోళ్లతో ఊపందుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ బెంచ్‌మార్క్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలపై వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 639.42 పాయింట్లు (0.83 శాతం) పెరిగి77,303.63 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 194.75 పాయింట్లు (0.81 శాతం) పెరిగి 24,092.7 వద్ద స్థిర‌ప‌డింది. మార్కెట్ రికవరీకి ప్రధానంగా స‌న్ ఫార్మా, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్‌లో కొనుగోళ్లు దోహదపడ్డాయి. అలాగే బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో కూడా కొనుగోళ్లు కనిపించాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాల‌ర్ల‌కు పైగా ఉండటం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ తిరిగి కోలుకుంది.

ఐటీ బ‌ల‌హీనంగా ఉన్నా..

జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయ‌ర్ తెలిపిన ప్రకారం అమెరికా-ఇరాన్ చర్చల పునఃప్రారంభం అవకాశాలు, అలాగే అంచనాలకంటే మెరుగైన నాలుగో త్రైమాసిక‌ ఫలితాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను బలపరిచాయ‌ని అన్నారు. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, మాన్యుఫాక్చరింగ్ రంగాలు మార్కెట్ రికవరీకి మద్దతుగా నిలిచాయ‌ని, ఐటీ రంగం ఫలితాలు బలహీనంగా ఉన్నప్పటికీ, విలువలు ఆకర్షణీయంగా ఉండటంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపార‌ని నాయర్ తెలిపారు. అయితే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

టాప్ గెయినర్లు, లూజ‌ర్లు..

నిఫ్టీ 50లో 39 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా సన్ ఫార్మా దాదాపు 7 శాతం పెరిగింది. ఆ కంపెనీ అమెరికాకు చెందిన ఓర్గాన‌న్ అనే సంస్థ‌ను సుమారు 11.8 బిలియన్ డాల‌ర్ల డీల్‌తో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అందుక‌నే స‌న్ ఫార్మా షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. ఇక జియో ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సంస్థ‌ల షేర్లు ఒక్కోటి 3 శాతానికి పైగా పెరిగాయి. రిల‌య‌న్స్ ఫలితాలు అంచనాల క‌న్నా తక్కువగా ఉన్నప్పటికీ, బ్రోకరేజీలు బుల్లిష్ అభిప్రాయాన్ని కొనసాగించాయి. గత వారం భారీగా పడిపోయిన ఐటీ స్టాక్స్‌లో కూడా కొనుగోళ్లు కనిపించాయి. టెక్ మ‌హీంద్రా, విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో నిలిచాయి. ఇక న‌ష్ట‌పోయిన షేర్ల‌లో శ్రీ‌రాం ఫైనాన్స్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ షేర్లు 4 శాతం మేర క్షీణించాయి. యాక్సిస్ బ్యాంకు కూడా నాలుగో త్రైమాసిక‌ ఫలితాల ప్రభావంతో 3 శాతం క్షీణించింది. అలాగే భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌, టాటా క‌న్‌జ్యూమ‌ర్‌, ట్రెంట్ స్టాక్స్ కూడా నష్టాల్లో ముగిశాయి.

ప్ర‌భావం చూప‌నున్న అంశాలు..

మూడు రోజుల నష్టాల తర్వాత మార్కెట్ తిరిగి కోలుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. అయితే భౌగోళిక పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, ఫెడ్ విధానాలు వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయ‌ని, క‌నుక ఈ స‌మ‌యంలో పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.23 డాల‌ర్ల మేర పెరిగి బ్యారెల్‌కు 101 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.97 డాల‌ర్లు పెరిగి 94 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. 0.030 పైస‌లు పెరిగిన రూపాయి డాల‌ర్ విలువ‌కు 94.19 వ‌ద్ద ఉంది.

Advertisement
Advertisement