త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కాస్త కోలుకున్న రూపాయి, తగ్గిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ కాస్త కోలుకోవడం వల్ల ప్రధాన సూచీలు ఒక్కొక్కటి 1 శాతం క‌న్నా ఎక్కువగా పెరిగాయి.

S

Business | Published On Apr 6, 2026, 4.14 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కాస్త కోలుకున్న రూపాయి, తగ్గిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ కాస్త కోలుకోవడం వల్ల ప్రధాన సూచీలు ఒక్కొక్కటి 1 శాతం క‌న్నా ఎక్కువగా పెరిగాయి. మూడో వరుస సెషన్‌లో లాభాలను కొనసాగిస్తూ సెన్సెక్స్ 787.30 పాయింట్లు (1.07 శాతం) పెరిగి 74,106.85 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 255.15 పాయింట్లు (1.12 శాతం) పెరిగి 22,968.25 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 1.30 శాతం లాభపడగా, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 1.10 శాతం పెరిగింది. ఒకే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.422 లక్షల కోట్ల నుంచి రూ.427 లక్షల కోట్లకు పైగా చేరుకుంది.

టాప్ గెయిన‌ర్లు, టాప్ లూజ‌ర్లు..

నిఫ్టీ50 సూచీలో హిందాల్కో ఇండ‌స్ట్రీస్ షేర్లు భారీగా పెరిగాయి. ఒక్క సెష‌న్‌లోనే ఏకంగా 2.05 శాతం మేర ఈ కంపెనీ షేర్లు లాభ‌ప‌డ్డాయి. దీంతో టాప్ గెయిన‌ర్ల జాబితాలో ఈ కంపెనీ మొద‌టి స్థానంలో నిలిచింది. అలాగే త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా కోల్ ఇండియా (1.21 శాతం), ఆయిల్ అండ్ నాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ (0.96 శాతం), ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (0.20 శాతం) నిలిచాయి. ఇక 5.01 శాతం ప‌త‌నంతో బ‌జాజ్ ఫైనాన్స్ కంపెనీ టాప్ లూజ‌ర్ల జాబితాలో తొలి స్థానంలో నిల‌వ‌గా, త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.93 శాతం), ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ లిమిటెడ్ (3.81 శాతం), బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ (3.71 శాతం), యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ (3.64 శాతం) నిలిచాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో క్రూడ్ ధ‌ర‌లు సోమ‌వారం నాటి సెష‌న్‌లో భారీగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 1.94 డాల‌ర్లు (1.81 శాతం) త‌గ్గి 105.80 వ‌ద్ద ఉండ‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 2 డాల‌ర్లు (1.94 శాతం) త‌గ్గి 101 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక బంగారం, వెండి ధ‌ర‌లు ఉద‌యం సెష‌న్‌లో త‌గ్గినా త‌రువాతి సెష‌న్‌లో పెరిగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే 1379 పాయింట్లు (0.92 శాతం) పెరిగి 1,51,059 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,469 పాయింట్లు (1.06 శాతం) పెరిగి 2,34,964 వ‌ద్ద ఉంది.

వార్త‌ల‌కు అనుగుణంగా స్పందిస్తున్న మార్కెట్లు..

అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు పాజిటివ్‌గా మార‌డంతోనే మార్కెట్లు ర్యాలీని కొన‌సాగించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరిచేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగుస్తుండ‌డంతో ఇరాన్‌-అమెరికా దేశాలు 45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇది మార్కెట్ల‌కు ఊతం ఇచ్చింది. అలాగే చ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం కావ‌డం, రూపాయి కాస్త కోలుకోవ‌డం వంటి అంశాలు కూడా మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావం చూపించాయి. వాస్త‌వానికి ఉద‌యం ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు కాసేపు న‌ష్టాల్లో కొన‌సాగాయి. కానీ త‌రువాత రిక‌వ‌ర్ అయి భారీగా పైకి ఎగ‌బాకాయి. అయితే ప్ర‌స్తుతం మార్కెట్లు వార్త‌ల‌కు అనుగుణంగా స్పందిస్తున్నందున పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement