త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆల్ టైం క‌నిష్టానికి రూపాయి విలువ ప‌త‌నం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనలు కొనసాగడం, ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బీఎస్ఈ సెన్సెక్స్‌ 114 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 75,200.85 వద్ద ముగిసింది.

S

Business | Published On May 19, 2026, 4.00 pm IST

Stock Markets | స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆల్ టైం క‌నిష్టానికి రూపాయి విలువ ప‌త‌నం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనలు కొనసాగడం, ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బీఎస్ఈ సెన్సెక్స్‌ 114 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 75,200.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 32 పాయింట్లు (0.14 శాతం) తగ్గి 23,618 వద్ద క్లోజ్ అయింది. అయితే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు మాత్రం మార్కెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్‌ 0.73 శాతం పెరిగింది. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌ 1.17 శాతం ఎగ‌బాకింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్ వంటి హెవీవెయిట్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం వల్ల బెంచ్‌మార్క్ సూచీలపై ఒత్తిడి పెరిగింది.

మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ షేర్ల‌పై ఆస‌క్తి..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తుందన్న ఆశావాదంతో ప్రారంభంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ, చివరికి సూచీలు నష్టాల్లో ముగిశాయని తెలిపారు. పెద్ద షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మళ్లీ పెరిగాయని చెప్పారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయని వినోద్ నాయర్ పేర్కొన్నారు. అధిక డబ్ల్యూపీఐ గణాంకాలు, ఇంధన ధరల ప్రభావం, బాండ్ ఈల్డ్స్‌ పెరుగుదల కారణంగా క్యూ1ఎఫ్‌వై27 ఆదాయ అంచనాల్లో కోతలు వచ్చే అవకాశాలపై మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైందన్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.459 లక్షల కోట్లకు పైగా చేరింది. గత సెషన్‌లో ఇది రూ.458.4 లక్షల కోట్లుగా ఉంది.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, టైటాన్‌, భారతి ఎయిర్‌టెల్‌, సన్ ఫార్మా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, టెక్ మహీంద్రా, ఎటర్నల్‌, టీసీఎస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రూపాయి విలువ పడిపోవడం, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్ కారణంగా ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయని వినోద్ నాయర్ తెలిపారు. కాగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.77 శాతం పెరిగి బ్యారెల్‌కు 110 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.63 శాతం పెరిగి బ్యారెల్‌కు 102 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

భారీగా ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

ఫారెక్స్ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం రూపాయి విలువ మ‌ళ్లీ భారీగా ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే ఇప్ప‌టికే ఆల్ టైమ్ క‌నిష్టానికి దిగువ‌నే ట్రేడ్ అవుతున్న రూపాయి డాల‌ర్‌కు 96.53 వ‌ద్ద ఉంది. రోజు రోజుకీ రూపాయి విలువ కొత్త క‌నిష్ట స్థాయిని చేరుతోంది. దీని వ‌ల్ల విదేశీ పెట్టుబ‌డిదారులు పెద్ద ఎత్తున త‌మ నిధుల‌ను భార‌త మార్కెట్ల నుంచి ఉప‌సంహ‌రించుకుంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆర్‌బీఐ జోక్యం కార‌ణంగా రూపాయి విలువ కాస్త స్థిర‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ అమెరికా డాల‌ర్ రోజు రోజుకీ బ‌ల‌ప‌డుతుండ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. దీంతో వారు భార‌త మార్కెట్ల నుంచి నిధుల‌ను ఉప‌సంహ‌రించుకుని అమెరికాతోపాటు ఇత‌ర ఆసియా దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. అయితే ప్ర‌ధాని మోదీ విదేశీ మార‌క నిల్వ‌ల‌ను ఆదా చేయాల‌ని పిలుపు ఇచ్చాక రూపాయి విలువ మ‌రింత‌గా ప‌త‌న‌మ‌వ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement