త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మ‌ళ్లీ పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌, నిఫ్టీ50 దాదాపు 1 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 702.68 పాయింట్లు (0.91 శాతం) పడిపోయి 76,847.57 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 207.95 పాయింట్లు (0.86 శాతం) పడిపోయి 23,842.65 వద్ద ముగిసింది.

S

Business | Published On Apr 13, 2026, 4.04 pm IST

Stock Markets | భారీ న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మ‌ళ్లీ పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌, నిఫ్టీ50 దాదాపు 1 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 702.68 పాయింట్లు (0.91 శాతం) పడిపోయి 76,847.57 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 207.95 పాయింట్లు (0.86 శాతం) పడిపోయి 23,842.65 వద్ద ముగిసింది. మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు కూడా ప‌త‌న‌మ‌య్యాయి. అయితే అవి బెంచ్‌మార్క్‌ల కంటే మెరుగ్గా ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.57 శాతం పడిపోయింది, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.46 శాతం తగ్గింది. సోమ‌వారం ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు సుమారు రూ.2 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.451 లక్షల కోట్ల నుంచి రూ.449 లక్షల కోట్లకు పడిపోయింది.

మార్కెట్ల‌లో ఆందోళ‌న‌..

వారాంతంలో జరిగిన అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలో అత్యంత కీలకమైన సమస్యల్లో ఒకటైన అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతియుతంగా ముగుస్తుందనే ఆశలు చెదిరిపోయాయి. అలాగే హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయాలని అమెరికా ప్రకటించడం గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై భయాలను పెంచింది. పశ్చిమ ఆసియాలో పరిస్థితి ఎలా మారుతుందోన‌ని అంద‌రిలోనూ ఆందోళ‌న నెల‌కొంది. ప్ర‌స్తుతం యుద్ధం తీవ్ర‌త‌ర‌మ‌వుతుందా, ఆగుతుందా అనే అనిశ్చితి కొనసాగుతోంది. దీర్ఘకాలిక యుద్ధం జ‌రిగితే మాత్రం గ్లోబల్ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవ‌కాశాలు ఉంటాయ‌ని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. దీని ప్రభావం ఈ ఏడాది మొత్తం కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ప‌త‌న‌మైన ఆసియా మార్కెట్లు, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

మీడియా నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చైనాపై టారిఫ్‌ల గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ తెలిపారు. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌భావం ఆసియా మార్కెట్ల‌పై ప‌డింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.90 శాతం మేర ప‌త‌న‌మై 25,660 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, చైనా ఎస్ఎస్ఈ 100 సూచీ 1 శాతం ప‌త‌న‌మైంది. అలాగే జ‌పాన్ నిక్కీ225 ఇండెక్స్ 0.62 శాతం, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 0.86 శాతం మేర న‌ష్ట‌పోయాయి. ఇక బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 103 డాల‌ర్ల‌కు చేరాయి. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 8 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 105 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అయింది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడం, హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. క్రూడ్ ధరలు ఇప్పటికే నెల రోజుల నుంచి గ‌రిష్ట‌ స్థాయిలో కొన‌సాగుతున్నాయి. ఈ ధరలు రెండు నెలలకంటే ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

బ‌ల‌హీన ప‌డిన రూపాయి..

జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడం, హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ బ్లాకేడ్ ప్రకటించడం వల్ల అనిశ్చితి పెరిగింద‌ని అన్నారు. క్రూడ్ ధరలు కూడా పెరిగాయ‌ని, 103 డాల‌ర్ల‌ వద్ద బ్రెంట్ క్రూడ్‌ మరో పెద్ద ప్రమాదంగా మారుతోంద‌ని పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం భారత రూపాయి సోమవారం అమెరికా డాలర్ తో పోలిస్తే 65 పైసలు పడిపోయి 93.38 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇది 92.73 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు పెరగడంతో డాలర్ ఇండెక్స్ కూడా సుమారు అరశాతం పెరిగింది. రూపాయి బలహీనత, డాలర్ బలం కలిసి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రవాహాన్ని పెంచే అవకాశం ఉంది. దీంతో భారత మార్కెట్ పునరుద్ధరణ అవకాశాలు మరింత మందగిస్తాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement