త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | క్రూడ్‌ ధరలు, గ్లోబల్‌ సంకేతాలతో లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Markets | భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ సడలడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది.

S

Business | Published On Aug 26, 2026, 10.48 am IST

Stock Markets | క్రూడ్‌ ధరలు, గ్లోబల్‌ సంకేతాలతో లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
Advertisement

Stock Markets | భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ సడలడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. తొలి గంట ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 330 పాయింట్లు పెరిగి 77,986.84 స్థాయిని తాకగా, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 24,378.60 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77,892.10 వద్ద ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,341.95 వద్ద దాదాపు స్థిరంగా ప్రారంభమైంది. విస్తృత మార్కెట్‌ల‌లోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.35 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.41 శాతం పెరిగాయి. మార్కెట్‌ అస్థిరతను సూచించే ఇండియా వీఐఎక్స్‌ 3.04 శాతం తగ్గి 10.74కి చేరింది. ఇది మార్కెట్‌లో స్థిరత్వం పెరిగినట్లు సూచించింది.

పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల ర్యాలీ..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ అత్యధికంగా 1.33 శాతం లాభపడింది. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 25/50 సూచీ 0.81 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ 0.90 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా 0.65 శాతం లాభపడగా, నిఫ్టీ ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఇవి వరుసగా 0.04 శాతం, 0.19 శాతం, 0.21 శాతం తగ్గాయి. సెన్సెక్స్‌ సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అత్యధికంగా 1.87 శాతం లాభపడింది. ఎటర్నల్‌ 1.57 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.43 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.37 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.26 శాతం చొప్పున పెరిగాయి. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అయితే ఇన్ఫోసిస్‌ 1.14 శాతం పడిపోవడంతో సెన్సెక్స్‌లో అత్యధిక నష్టపోయిన షేర్‌గా నిలిచింది. భారతి ఎయిర్‌టెల్‌ 0.73 శాతం, లార్సెన్‌ అండ్‌ టుబ్రో 0.67 శాతం నష్టపోయాయి. టాటా స్టీల్‌ 0.38 శాతం, బీఈఎల్‌ 0.44 శాతం చొప్పున తగ్గాయి. భారత ఈక్విటీలకు ప్రధాన సానుకూల సంకేతంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం నిలిచింది. హోర్ముజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు క్రమంగా పునరుద్ధరించవచ్చన్న ఆశావాదంతో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు సుమారు 86.3 డాలర్లకు తగ్గింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ జలమార్గంలో రాకపోకల నిర్వహణకు సంబంధించి ఇరాన్‌, ఒమన్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతో దీర్ఘకాలికంగా సరఫరా అంతరాయాలు ఏర్పడవచ్చన్న ఆందోళనలు కొంత తగ్గాయి.

స్థిరంగా రూపాయి విలువ‌..

ముడి చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్‌కు క్రూడ్‌ ధరలు తగ్గడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. తక్కువ చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు రూపాయికి మద్దతు ఇస్తాయి. అలాగే కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ తగ్గడం కూడా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు మరో సానుకూల సంకేతంగా మారింది. అమెరికా పదేళ్ల ట్రెజరీ ఈల్డ్‌ సుమారు 4.64 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు కూడా గత రాత్రి లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌ జోన్స్‌ సూచీలు చెరో 0.3 శాతం పెరగగా, నాస్‌డాక్‌ 0.7 శాతం లాభపడింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ దాదాపు స్థిరంగా కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement