త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

SBI Funds Management IPO | దేశంలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తన రూ.11,692.91 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు షేర్ ధరల శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.545 నుంచి రూ.574 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది.

S

Business | Published On Jul 10, 2026, 12.40 pm IST

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?
Advertisement

SBI Funds Management IPO | దేశంలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తన రూ.11,692.91 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు షేర్ ధరల శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.545 నుంచి రూ.574 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ జూలై 14న సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానుంది. ప్రైస్ బ్యాండ్ ఎగువ స్థాయి అయిన రూ.574 వద్ద కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.1.17 లక్షల కోట్లకు చేరుకోనుంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం లాట్ సైజును 26 షేర్లుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర రూ.574 ప్రకారం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాలంటే కనీసం రూ.14,924 పెట్టుబడి అవసరం. అనంతరం 26 షేర్ల చొప్పున మల్టిపుల్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

35 శాతం రిటెయిల‌ర్ పెట్టుబ‌డిదారుల‌కు..

ఈ ఐపీఓను పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలోనే నిర్వహిస్తున్నారు. ఇందులో 20 కోట్లకు పైగా షేర్లను విక్రయించనున్నారు. కొత్తగా షేర్ల జారీ (ఫ్రెష్ ఇష్యూ) ఉండదు. అందువల్ల ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు సమకూరవు. మొత్తం ఇష్యూలో 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు. చిన్న హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లకు 5 శాతం, పెద్ద హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లకు 10 శాతం కేటాయించారు. మిగిలిన 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు (క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్) రిజర్వ్ చేశారు. ఎస్‌బీఐ షేర్‌హోల్డర్లకు ఈ ఐపీఓలో ప్రత్యేక కోటా కల్పించారు. వారి కోసం సుమారు 1.3 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ.750 కోట్లుగా ఉంటుంది. అయితే ఎస్‌బీఐ షేర్‌హోల్డర్లకు షేర్ ధరలో ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు.

ఉద్యోగుల‌కు రూ.170 కోట్ల విలువైన షేర్లు..

అర్హత కలిగిన ఉద్యోగుల కోసం రూ.170 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. వారికి బిడ్డింగ్ సమయంలో ఒక్కో షేర్‌పై రూ.54 డిస్కౌంట్ లభించనుంది. ఐపీఓ అనంతరం ఎస్‌బీఐకి ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న వాటా 98.19 శాతం నుంచి 88.19 శాతానికి తగ్గనుంది. ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్ల బుకింగ్ జూలై 13న ప్రారంభమవుతుంది. సాధారణ పెట్టుబడిదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ జూలై 14 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుంది. షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 17న పూర్తయ్యే అవకాశం ఉంది. షేర్లు రాని పెట్టుబడిదారులకు రీఫండ్‌లు, బ్లాక్ అయిన నిధుల విడుదల జూలై 20న జరగనుంది. అదే రోజు విజయవంతమైన దరఖాస్తుదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ కానున్నాయి. దాదాపు రూ.11,693 కోట్ల ఇష్యూ పరిమాణం, రూ.1.17 లక్షల కోట్ల సంభావ్య మార్కెట్ విలువతో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్‌లో అత్యంత కీలకమైన ఈవెంట్లలో ఒకటిగా నిలవనుంది.

Advertisement
Advertisement