త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్‌ మార్కెట్ల‌లో జోష్.. లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు..

Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం సాధ్యమని సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందన్న ఆశలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి.

S

Business | Published On May 19, 2026, 10.45 am IST

Stock Markets | ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్‌ మార్కెట్ల‌లో జోష్.. లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు..
Advertisement

Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం సాధ్యమని సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందన్న ఆశలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 365.07 పాయింట్లు (0.48 శాతం) పెరిగి 75,680.11 వద్ద ట్రేడ్ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 కూడా 107.55 పాయింట్లు (0.45 శాతం) ఎగిసి 23,757.50 స్థాయికి చేరుకుంది. టెహ్రాన్‌పై ప్లాన్ చేసిన దాడిని తాను నిలిపివేశానని, ఇరాన్ శాంతి ప్రతిపాదన పంపిందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసే ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ప్రకటనల ప్రభావంతో ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ 2 శాతానికి పైగా పడిపోయి బ్యారెల్‌కు 110 డాలర్ల క‌న్నా దిగువకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.45 శాతం క్షీణించింది.

అన్ని సూచీలు బ‌లంగానే..

విస్తృత మార్కెట్ల సూచీలు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.94 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.88 శాతం లాభపడింది. మార్కెట్ భయాందోళనలు తగ్గుతున్న సంకేతంగా ఇండియా విక్స్ 4.48 శాతం పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్సుల్లో నిఫ్టీ ఐటీ టాప్ గైనర్‌గా నిలిచి 3.56 శాతం ఎగిసింది. నిఫ్టీ ఫార్మా 0.53 శాతం పెరగగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు చెరో 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.79 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.68 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 0.69 శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ మెటల్ మాత్రం 0.16 శాతం తగ్గింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ మార్కెట్‌ విశ్లేష‌కుడు వీకే విజ‌య్ కుమార్ మాట్లాడుతూ విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడం భారత్ మార్కెట్ వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారుతున్న సంకేతమని అన్నారు. ఏఐ స్టాక్స్‌లో బబుల్ వాల్యుయేషన్లపై ఆందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎఫ్‌ఐఐ కొనుగోళ్లు ట్రెండ్‌గా మారితే పెద్ద బ్యాంకులు సహా ఫైనాన్షియల్ లార్జ్‌క్యాప్స్ మంచి ప్రదర్శన వ‌చ్చే అవకాశముందని పేర్కొన్నారు.

ప‌వ‌ర్‌, డిఫెన్స్ స్టాక్స్ అయితే బెట‌ర్‌..

మ్యాక్రో స్థాయిలో వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల వంటి ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. అందువల్ల ఫార్మాస్యూటికల్స్, పవర్ సంబంధిత స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ వంటి రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ రంగాలు మందగమన ప్రభావానికి తక్కువగా గురయ్యే అవకాశం ఉందన్నారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు చాలా కంపెనీల్లో అంచనాలకు మించి వచ్చాయని తెలిపారు. గతేడాది తీసుకున్న ఫిస్కల్, మానిటరీ స్టిములస్ చర్యల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు. హోర్ముజ్ సంక్షోభం త్వరగా పరిష్కారమైతే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే అవకాశం ఉందని, ఈ ఏడాది మందగమనం ఊహించినంత తీవ్రంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా అదానీ గ్రూప్ షేర్లు 0.1 శాతం నుంచి 2.2 శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా ప్రభుత్వం గౌతమ్ అదానీపై ఉన్న ఆరోపణలను విరమించుకునే దిశగా చ‌ర్య‌లు చేపట్టడం, అలాగే గ్రూప్ కంపెనీలలో ఒకదానికి సంబంధించిన ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన కేసును సెటిల్ చేయడం ఇందుకు కారణమయ్యాయి.

Advertisement
Advertisement