త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | లాభాల్లో మొద‌లై ఫ్లాట్ గా ట్రేడ‌వుతున్న సూచీలు.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశ‌య స్టాక్ మార్కెట్లు సోమ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో స్వ‌ల్ప లాభాల‌తో మొద‌లై ఫ్లాట్‌గా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం నాడు హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరిచిన‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించ‌గానే అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ప‌లు దేశాల‌కు చెందిన సూచీలు భారీగా పైకి ఎగ‌బాకాయి.

S

Business | Published On Apr 20, 2026, 10.38 am IST

Stock Markets | లాభాల్లో మొద‌లై ఫ్లాట్ గా ట్రేడ‌వుతున్న సూచీలు.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశ‌య స్టాక్ మార్కెట్లు సోమ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో స్వ‌ల్ప లాభాల‌తో మొద‌లై ఫ్లాట్‌గా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం నాడు హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరిచిన‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించ‌గానే అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ప‌లు దేశాల‌కు చెందిన సూచీలు భారీగా పైకి ఎగ‌బాకాయి. దీంతో సోమ‌వారం నాడు భార‌త స్టాక్ మార్కెట్లు కూడా అదే స్థాయిలో పుంజుకుంటాయ‌ని భావించారు. కానీ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హార శైలితో ఇరాన్ మ‌ళ్లీ హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇరాన్ స‌ముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అమెరికా నౌకా నిర్బంధాల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు జ‌ల‌సంధి మూసే ఉంటుంద‌ని ఇరాన్ స్ప‌ష్టం చేసింది. దీంతో సోమ‌వారం నాడు ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. లేదంటే ఇవాళ భారీ ర్యాలీ వ‌చ్చి ఉండేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

పాజిటివ్ న్యూస్ వ‌స్తేనే..

ఇక ఇవాళ్టి సెష‌న్‌లో సెన్సెక్స్ 150 పాయింట్లు (0.20 శాతం) పెరిగి 78,661 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, నిఫ్టీ50 సూచీ 35 పాయింట్లు (0.15 శాతం) లాభ‌ప‌డి 24,388 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇరాన్‌తో అమెరికా రెండో ద‌ఫా చ‌ర్చ‌ల‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతుండ‌డంతో మార్కెట్లు వేచి చూస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఆ చ‌ర్చ‌ల‌పై పాజిటివ్ న్యూస్ వ‌స్తే ఇక్క‌డి నుంచి సూచీలు ర్యాలీ కొన‌సాగిస్తాయ‌ని, లేదంటే మ‌ళ్లీ ప‌త‌నం త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇక విస్త్ర‌త మార్కెట్ల సూచీలు నిఫ్టీ స్మాల్ క్యాప్‌100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఒక్కోటి 0.5 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో రంగాలు లాభాల్లో ఉండ‌గా, నిఫ్టీ ఫార్మా, మెట‌ల్స్ రంగాలు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఆసియా మార్కెట్ల‌లో సూచీలు సోమ‌వారం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఇక అమెరికా స్టాక్ ఫ్యూచ‌ర్స్ ప‌త‌న‌మ‌య్యాయి. జ‌పాన్ నిక్కీ225 సూచీ 451 పాయింట్లు పెరిగి లాభాల్లో ఉండ‌గా, ద‌క్షిణ కొరియా కోస్పి 67 పాయింట్లు లాభ‌ప‌డింది. షాంఘై ఇండెక్స్ 27 పాయింట్లు పెర‌గ్గా, హాంగ్ సెంగ్ 210 పాయింట్లు పెరిగింది. అయితే ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 500, ఏఎస్ఎక్స్200 సూచీ ఫ్లాట్‌గా కొన‌సాగుతోంది. ఇక ఈక్విటీ మార్కెట్లు అంత‌ర్జాతీయంగా మిశ్ర‌మ స్పంద‌న‌తో ట్రేడ్ అవుతుండ‌డంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 6.10 శాతం పెరిగి 95 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 7.49 శాతం పెరిగి 90 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ త‌గ్గింది. సోమ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో అమెరికా డాల‌ర్ తో పోలిస్తే భార‌త రూపాయి విలువ 24 పైసలు త‌గ్గి 92.82 వ‌ద్ద నిలిచింది. అయితే పెట్టుబ‌డిదారులు ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నార‌ని, కొనుగోళ్లా, అమ్మ‌కాలా అనే విష‌యం యుద్ధం వార్తల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement