త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా రెండో సెష‌న్‌లోనూ స్వ‌ల్ప లాభాల్లో మార్కెట్లు.. రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌నం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా అధికంగానే కొనసాగుతుండగా, రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతోంది. బుధవారం తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.7 మార్క్‌ను దాటిన నేపథ్యంలో మార్కెట్‌లో అప్రమత్తత కొనసాగుతోంది.

S

Business | Published On May 14, 2026, 10.16 am IST

Stock Markets | వ‌రుస‌గా రెండో సెష‌న్‌లోనూ స్వ‌ల్ప లాభాల్లో మార్కెట్లు.. రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌నం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా అధికంగానే కొనసాగుతుండగా, రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతోంది. బుధవారం తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.7 మార్క్‌ను దాటిన నేపథ్యంలో మార్కెట్‌లో అప్రమత్తత కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగిసి 75,000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ 50 కూడా 111 పాయింట్లు పెరిగి 23,523 స్థాయికి చేరింది. మార్కెట్ వోలాటిలిటీని కొలిచే ఇండియా VIX 4 శాతం పడిపోయి 18.68 వద్దకు చేరడం ఇన్వెస్టర్లలో కొంత ఊరటనిచ్చింది. సెన్సెక్స్‌లో భార‌తి ఎయిర్‌టెల్ షేర్లు అగ్రగామిగా నిలిచాయి. కంపెనీ క్యూ4 ఫలితాలు దలాల్ స్ట్రీట్ అంచనాలను మించి రావడంతో షేర్‌కు బలమైన కొనుగోళ్లు వచ్చాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జూడియో పేరెంట్ ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, జొమాటో పేరెంట్ ఎటర్నల్ తదితర షేర్లు సుమారు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఇండిగో షేర్లు సుమారు 1 శాతం నష్టపోగా, ఐటీ రంగంలోని టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

రూపాయి విలువ 100కు చేరే ప్ర‌మాదం..

మార్కెట్‌లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు 0.7 శాతం వరకు లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్ సూచీలు 1 శాతం కంటే ఎక్కువ పెరిగి టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే నిఫ్టీ ఐటీ సూచీ 1 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. కాగా ముందు ముందు పరిస్థితులపై మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపిన ప్రకారం రూపాయి నిరంతర పతనం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మాక్రో ఎకనామిక్ ముప్పుగా మారుతోంద‌న్నారు. ఈ ఏడాది ప్రారంభంలో డాలర్‌కు రూపాయి విలువ 90 వద్ద ఉండగా, ప్రస్తుతం అది 95.70 స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రూపాయి విలువ 100 వరకు బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. భారత మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరంతరం అమ్మకాలు జరపడం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆ మార్కెట్లలో అధికంగా పెట్టుబ‌డులు..

ప్రస్తుతం అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి మార్కెట్లలో పెట్టుబడులు అధికంగా వెళ్తున్నాయని, అవి భారత్ కంటే మెరుగ్గా ప్రదర్శిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీలను విక్రయించే అవకాశం కొనసాగుతుందని చెప్పారు. దాంతో రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుని క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితేనే పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఏఐ ట్రేడ్ వేగం తగ్గితే మాత్రమే పరిస్థితిలో మార్పు రావచ్చని, అయితే అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదన్నారు. రూపాయి నిరంతర పతనం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని విజయకుమార్ హెచ్చరించారు. దిగుమతి ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పెట్రోలియం ఆధారిత ముడి సరుకులపై ఆధారపడిన కంపెనీల మార్జిన్లు దెబ్బతింటాయని తెలిపారు. అయితే ఎగుమతిదారులకు ఇది లాభదాయకమని చెప్పారు.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఫార్మా రంగం సురక్షిత పెట్టుబడిగా కొనసాగుతుందని, మందుల డిమాండ్‌పై ధరల ప్రభావం తక్కువగా ఉండటంతోపాటు రూపాయి బలహీనత వల్ల ఈ రంగానికి అదనపు ప్రయోజనం ఉంటుందని అన్నారు. టెక్స్టైల్ రంగం కూడా లాభపడే అవకాశం ఉందన్నారు. ఐటీ రంగానికి రూపాయి బలహీనత సహాయపడే అవకాశం ఉన్నప్పటికీ, ఆంత్రోపిక్ షాక్ కారణంగా ఒత్తిడి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి మరో 8 పైసలు బలహీనపడి డాలర్‌కు 95.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 106 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 101 డాలర్లను దాటింది. ఇరాన్-అమెరికా ఘర్షణల‌కు పరిష్కారం కనిపించకపోవడంతో హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతోంది. పెర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌తో కలిపే ఈ 33 కిలోమీటర్ల సముద్ర మార్గం ద్వారా ప్రపంచ రోజువారీ ఆయిల్, గ్యాస్ సరఫరాలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా జరుగుతుంది.

Advertisement
Advertisement