త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో భారీ పతనం.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో సోమవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో అన్ని సెగ్మెంట్లలో సెల్‌ఆఫ్ నమోదైంది. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించి 74,328 స్థాయికి చేరుకుంది.

S

Business | Published On May 18, 2026, 10.29 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో భారీ పతనం.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో సోమవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో అన్ని సెగ్మెంట్లలో సెల్‌ఆఫ్ నమోదైంది. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించి 74,328 స్థాయికి చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 50 కూడా 1 శాతానికి పైగా పడిపోయి 23,358 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతం వరకు క్షీణించాయి. ఈ భారీ పతనం కారణంగా బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.461 లక్షల కోట్ల నుంచి రూ.454 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

మార్కెట్ల‌ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై ఆదివారం జరిగిన లక్ష్యిత డ్రోన్ దాడి ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలను పెంచింది. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండగా తాజా పరిణామాలు ఇన్వెస్టర్లలో భయాందోళనలకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ త్వరగా స్పందించాల‌ని, లేకపోతే వారి వద్ద ఏమీ మిగలద‌ని, సమయం చాలా కీలకం.. అంటూ ట్రూత్ సోషల్‌లో హెచ్చ‌రించారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 111 డాలర్ల స్థాయిని తిరిగి అందుకున్నాయి. మ‌ధ్య ప్రాచ్యంలో కొత్త ఘర్షణల భయంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఎలాంటి చర్యలు లేకపోవడంతో బ్రెంట్ క్రూడ్ ధ‌ర‌ 111 డాలర్లకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అవకాశం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల‌కి అధిక ఆయిల్ ధరలు పెద్ద ప్రతికూల అంశంగా మారుతాయి. ఇవి ద్ర‌వ్య‌లోటును పెంచ‌డం, కరెన్సీ విలువ‌ను బలహీనపర‌చ‌డం, ద్రవ్యోల్బణం పెరగడం, ప్రభుత్వ ఆర్థిక భారం అధికమవడం వంటి సమస్యలకు దారితీస్తాయి.

రూపాయి ఆల్‌టైమ్ క‌నిష్టానికి పతనం..

భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే ఇంట్రాడే ట్రేడింగ్‌లో 96.23 స్థాయికి పడిపోయి కొత్త రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. అధిక క్రూడ్ ధరలు, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్ కారణంగా రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే దాదాపు 7 శాతం బలహీనపడింది. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 4.6250 శాతానికి పెరగడం, బ్రెంట్ క్రూడ్ 111 డాలర్లకు చేరుకోవడం వల్ల రూపాయి మరింత బలహీనపడుతోంద‌ని, ఆర్బీఐ ప్రస్తుతం నిర్దిష్ట ఎక్స్చేంజ్ రేట్‌ను కాపాడటంపై కాకుండా వోలాటిలిటీ నియంత్రణపై దృష్టి పెట్టింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి రూపాయి డాలర్‌కు 100 స్థాయిని తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది విదేశీ పెట్టుబడుల ఉపసంహరణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల..

అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా ఎమర్జింగ్ మార్కెట్లకు పెద్ద ప్రతికూల అంశంగా మారింది. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.62 శాతానికి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.62 శాతానికి పెరగడం ఎమర్జింగ్ మార్కెట్లకు మరో ప్రతికూల అంశమని, రూపాయి మరింత బలహీనపడితే ఎఫ్‌పీఐల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు. ఇక టెక్నికల్‌గా కూడా నిఫ్టీ 50 కీలకమైన 23,400 సపోర్ట్ స్థాయిని దిగువకు బ్రేక్ చేసింది. దీంతో మరింత పతనం వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ 23,600 దిగువకు వెళ్లితే కొత్త సెల్‌ఆఫ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని, అక్కడి నుంచి 23,400 స్థాయిని మళ్లీ టెస్ట్ చేయవచ్చ‌ని, మరింత ఒత్తిడి కొనసాగితే ఇండెక్స్ 23,200 నుంచి 22,850 వరకు పడిపోయే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement