త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం టెన్ష‌న్‌.. తీవ్ర ఒత్తిడిలో దేశీయ స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు బుధ‌వారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు రావడం, అలాగే అమెరికా-ఇరాన్ పరిస్థితులపై పెరుగుతున్న అనిశ్చితి, ముఖ్యంగా హోర్ముజ్ జ‌ల‌సంధి దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబ‌డిదారుల‌పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

S

Business | Published On Apr 22, 2026, 4.16 pm IST

Stock Markets | యుద్ధం టెన్ష‌న్‌.. తీవ్ర ఒత్తిడిలో దేశీయ స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు బుధ‌వారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు రావడం, అలాగే అమెరికా-ఇరాన్ పరిస్థితులపై పెరుగుతున్న అనిశ్చితి, ముఖ్యంగా హోర్ముజ్ జ‌ల‌సంధి దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబ‌డిదారుల‌పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 756.84 పాయింట్లు (0.95 శాతం) పడిపోయి 78,516.49 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ50 సూచీ 198.50 పాయింట్లు (0.8 శాతం) నష్టపోయి 24,378.10 వద్ద స్థిర‌ప‌డింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 831 పాయింట్లు ప‌త‌న‌మై 78,442.30 వద్ద కనిష్ఠాన్ని తాకి మళ్లీ కాస్త రిక‌వ‌ర్ అయింది. ఇక నిఫ్టీ 224 పాయింట్లు ప‌త‌న‌మై 24,352.90 వద్ద దిగువ స్థాయిని నమోదు చేసి, మ‌ళ్లీ కాస్త రిక‌వ‌ర్ అయింది. అయితే అనేక కంపెనీల‌కు చెందిన నాలుగో త్రైమాసిక ఫ‌లితాలు వెలువడుతుండ‌డంతోపాటు గ్లోబ‌ల్ అనిశ్చిత ప‌రిస్థితుల వ‌ల్ల బుధ‌వారం మార్కెట్లు తీవ్రంగా వోల‌టైల్‌గా కొన‌సాగాయి.

భారీగా అమ్మ‌కాల ఒత్తిడి..

సెన్సెక్స్‌లోహిందుస్థాన్ యూనిలివ‌ర్ (హెచ్‌యూఎల్), ఎన్టీపీసీ, ఎటర్నల్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అలాగే హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, ఇన్ఫోసిస్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, టీసీఎస్ షేర్లు భారీగా పడిపోయాయి. మార్కెట్ విస్తృతి మిశ్రమంగా ఉన్నప్పటికీ డిఫెన్సివ్ ధోరణి కనిపించింది. ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, మెటల్స్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పెరిగితే, ఐటీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కాల్పుల విర‌మ‌ణను నిరవధికంగా పొడిగించినట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ పోర్ట్స్‌పై అమెరికా నౌకాదళం దిగ్బంధం కొనసాగించడం, హోర్ముజ్ జ‌ల‌సంధి ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేయడం వల్ల శాంతి చర్చలపై అనిశ్చితి మరింత పెరిగింది.

రిక‌వ‌రీ సంకేతాలు ఇచ్చినా..

అమెరికా మార్కెట్లు గ‌త సెష‌న్‌లో రికవరీ సంకేతాలు ఇచ్చాయి. కాల్పుల విర‌మ‌ణ‌ పొడిగింపు ప్రకటనతో కొంత ఊరట చెందినా, భౌగోళిక ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల‌ పెట్టుబడిదారులు వెనుకంజ వేశారు. ఇక అమెరికా ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ 0.6 శాతం పెర‌గ్గా, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.7 శాతం లాభపడ్డాయి. యూరప్‌లో స్టాక్స్ సూచీ స్వల్పంగా 0.1 శాతం పెరిగింది. అయితే ఆసియా మార్కెట్లు బలహీనంగా కనిపించాయి. జపాన్‌ను మినహాయించి ఎంఎస్‌సీఐ ఆసియా-పసిఫిక్ సూచీ 0.5 శాతం పడిపోయింది. డాలర్ సూచీ సుమారు 98.27 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో ఇప్పటివరకు 1.5 శాతం వరకు పత‌న‌మైంది. మార్చిలో ఇది దాదాపు 2.3 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి బ్యారెల్‌కు సుమారు 98.16 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అయ్యాయి, సెషన్‌లో కొంతసేపు 100 డాల‌ర్ల‌కు చేరువైనా, తరువాత కాసేప‌టికి మళ్లీ ప‌త‌న‌మైంది.

రెండో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌రిగేనా..?

కాల్పుల విర‌మ‌ణ‌ పొడిగించినప్పటికీ పెట్టుబడిదారులు ఇంకా విశ్వాసంగా లేర‌ని మార్కెట్ల ప‌రిస్థితిని చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. హోర్ముజ్ జ‌ల‌సంధి మూసివేత కారణంగా చ‌మురు సరఫరా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చలు తిరిగి ప్రారంభం కావడంపై స్పష్టత లేకపోవడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ట్రంప్ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నట్లు కనిపించడంతోపాటు, ఇరాన్ లేదా అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ నుండి వెంటనే ధ్రువీకరణ రాకపోవడం గమనార్హం. ఇప్పటికే ఇరాన్ రెండో విడత చర్చలను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. అలాగే అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్ట్స్‌పై దిగ్బంధాన్ని కొనసాగిస్తుందని ట్రంప్ ప్రకటించడం ఉద్రిక్తతలను పెంచింది. దీంతో తక్షణ యుద్ధ ప్రమాదం తగ్గినట్టైనా, విస్తృత స్థాయిలో భౌగోళిక‌ అనిశ్చితి ఇంకా కొనసాగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న మొద‌ల‌వ్వ‌గా, శాంతి చ‌ర్చ‌ల ప్ర‌క‌ట‌న కోసం వారు ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement