త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా 3వ‌ వారం కూడా మార్కెట్లు లాభాల్లోనే.. పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లోనే ముగిశాయి. యుద్ధం ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా 5 వారాల పాటు భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు వ‌రుస‌గా మూడో వారం లాభాల్లో కొన‌సాగాయి. శుక్ర‌వారం పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల‌కు ఆస‌క్తిని చూపించ‌డంతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ50, సెన్సెక్స్ పైకి ఎగ‌బాకాయి.

S

Business | Published On Apr 17, 2026, 4.10 pm IST

Stock Markets | వ‌రుస‌గా 3వ‌ వారం కూడా మార్కెట్లు లాభాల్లోనే.. పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లోనే ముగిశాయి. యుద్ధం ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా 5 వారాల పాటు భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు వ‌రుస‌గా మూడో వారం లాభాల్లో కొన‌సాగాయి. శుక్ర‌వారం పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల‌కు ఆస‌క్తిని చూపించ‌డంతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ50, సెన్సెక్స్ పైకి ఎగ‌బాకాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు మ‌ళ్లీ కొన‌సాగుతాయ‌న్న ఆశ‌లు పెర‌గ‌డం, ఈసారి అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ఇస్లామాబాద్‌కు వెళ్లి ఇరాన్ తో చ‌ర్చ‌ల్లో పాల్గొంటార‌ని వార్త‌లు వ‌స్తుండ‌డంతో మార్కెట్లు ఆశావ‌హ దృక్ఫ‌థంతో ముందుకు సాగాయి. ఇక సెన్సెక్స్ 504.86 పాయింట్లు (0.65 శాతం) పెరిగి 78,493.54 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ50 కూడా 156.80 పాయింట్లు (0.65 శాతం) పెరిగి 24,353.55 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు మరింత మెరుగైన ప్రదర్శన చూపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.27 శాతం పెర‌గ్గా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.48 శాతం పెరిగింది.

టాప్ గెయినర్లు, లూజ‌ర్లు..

నిఫ్టీ 50లో మొత్తం 40 షేర్లు లాభాల్లో ముగిశాయి. అందులో హిందుస్థాన్ యూనిలీవర్ (4.75 శాతం పెరుగుదల), నెస్లే ఇండియా (2.24 శాతం), జేఎస్ డ‌బ్ల్యూ స్టీల్ (2.09 శాతం), అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ (1.93 శాతం) టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలో విప్రో (2.83 శాతం ప‌త‌నం), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (2.38 శాతం), సన్ ఫార్మా (1.04 శాతం) ఉన్నాయి. ఒకే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు సుమారు రూ.5 లక్షల కోట్లు సంపాదించారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.461 లక్షల కోట్లు ఉండ‌గా అది శుక్ర‌వారం ముగింపు వ‌ర‌కు రూ.466 లక్షల కోట్లకు పెరిగింది.

అంత‌ర్జాతీయంగా పాజిటివ్ సంకేతాలు..

అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్తత‌లు త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌డం, గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి వ‌స్తున్న పాజిటివ్ సంకేతాలు, చ‌మురు ధ‌ర‌ల‌కు 3 శాతానికి పైగా ప‌త‌న‌మ‌వ‌డం త‌దిత‌ర అంశాలు మార్కెట్ల లాభాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. అందువ‌ల్లే పెట్టుబ‌డిదారులు వ‌రుస‌గా మూడో వారం కూడా కొనుగోళ్ల‌కు ఆస‌క్తిని చూపించారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ ట్రంప్ తాజాగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఇరాన్ అణ్వాయుధాల‌ను విర‌మించుకోవ‌డానికి సిద్ధంగా ఉంద‌ని, అందుకు ఆ దేశం అంగీక‌రించింద‌ని, అలాగే శుద్ధి చేసిన యురేనియంను త‌మ‌కు ఇచ్చేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఇది మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావాన్ని క‌న‌బ‌రిచింది. ఇక ఇజ్రాయెల్‌, లెబ‌నాన్‌ల మ‌ధ్య 10 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుద‌ర‌గా ఈ వార్త కూడా పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ను త‌గ్గించింది.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం కీల‌కం..

జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ మధ్యప్రాచ్య సమస్య పరిష్కారం దిశగా సానుకూల సంకేతాలు రావడం, అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) నెట్ కొనుగోళ్లు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లు బలపడ్డాయ‌న్నారు. ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ కారణంగా క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు దిగువకు రావడం దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థలకు ఉపశమనం కలిగించింద‌న్నారు. అలాగే ఆర్‌బీఐ చర్యలు చేప‌ట్ట‌డం, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో రూపాయి బలపడింద‌ని, ధరల పెంపులు, వ్యాపార ప్రదర్శనలో మెరుగుదల, ఆకర్షణీయ విలువల కారణంగా ఎఫ్‌ఎంసీజీ రంగం లాభాల్లో ముందంజలో నిలిచింద‌ని అన్నారు. క్వార్టర్-4 ఫలితాల సీజన్ వేగం అందుకోవడంతో, భవిష్యత్ FY27 అంచనాలకు ఇవి కీలక పరీక్షగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement