త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ప్ర‌ధాని మోదీ పొదుపు వ్యాఖ్య‌ల ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కంటిన్యూ..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా ప‌త‌న‌మయ్యాయి. ప్ర‌జ‌లంద‌రూ ఇంధ‌నాన్ని పొదుపు చేయాల‌ని, వ‌చ్చే ఏడాది వ‌ర‌కు బంగారం కొనుగోళ్లు ఆపాల‌ని ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపు మార్కెట్ల‌పై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపించింది. మోదీ వ్యాఖ్య‌ల అనంతరం వ‌రుస‌గా రెండో రోజు సూచీలు భారీ న‌ష్టాల్లో ముగిశాయి.

S

Business | Published On May 12, 2026, 4.57 pm IST

Stock Markets | ప్ర‌ధాని మోదీ పొదుపు వ్యాఖ్య‌ల ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కంటిన్యూ..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా ప‌త‌న‌మయ్యాయి. ప్ర‌జ‌లంద‌రూ ఇంధ‌నాన్ని పొదుపు చేయాల‌ని, వ‌చ్చే ఏడాది వ‌ర‌కు బంగారం కొనుగోళ్లు ఆపాల‌ని ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపు మార్కెట్ల‌పై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపించింది. మోదీ వ్యాఖ్య‌ల అనంతరం వ‌రుస‌గా రెండో రోజు సూచీలు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు (1.92 శాతం) ప‌త‌న‌మై 74,559.24 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 436.30 పాయింట్లు (1.83 శాతం) న‌ష్ట‌పోయి 23,379.55 వ‌ద్ద స్థిర‌ప‌డింది. మార్కెట్లు గ‌త నాలుగు వ‌రుస సెష‌న్ల‌లోనూ న‌ష్టాల్లోనే ముగియ‌గా, సెన్సెక్స్ మొత్తం మీద 3,500 పాయింట్లు (4.5 శాతం) దిగువ‌కు వ‌చ్చింది. నిఫ్టీ50 సైతం 4 శాతం మేర ప‌త‌న‌మైంది. పెట్టుబ‌డిదారులు నాలుగు సెష‌న్ల వ్య‌వ‌ధిలోనే సుమారుగా రూ.17 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌ను న‌ష్ట‌పోయారు. బీఎస్ఈలో లిస్ట్ అయి ఉన్న కంపెనీల మార్కెట్ క్యాపిట‌ల్ రూ.473 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.456 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.

ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపుతో..

దేశ ప్ర‌జలంద‌రూ కొంత కాలం పాటు పొదుపు పాటించాల‌ని ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపు నేప‌థ్యంలోనే మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల ప్ర‌జ‌లతోపాటు పెట్టుబ‌డిదారుల్లోనూ ఆందోళ‌న నెల‌కొంద‌ని, భార‌త్ ఆర్థిక సంక్షోభం దిశ‌గా కొన‌సాగుతుంద‌నే భ‌యంతోనే మార్కెట్ల‌లో భారీగా అమ్మ‌కాల‌ను కొన‌సాగించార‌ని అంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ వంటి ఇంధ‌నాల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ చేసిన సూచ‌న‌లు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాట‌జిస్ట్ వీకే విజ‌య్ కుమార్ మాట్లాడుతూ ప్ర‌ధాని మోదీ చేసిన సూచ‌న‌లు చాలా రంగాల‌పై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపాయ‌ని, అందుకనే పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంద‌ని అన్నారు. ముఖ్యంగా జ్యువెల్ల‌రీ, ట్రావెల్‌, హోటల్స్ రంగాల‌పై మోదీ వ్యాఖ్య‌ల ప్ర‌భావం అధికంగా ప‌డింద‌ని, ఆయా కంపెనీల‌కు చెందిన షేర్లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయ‌ని అన్నారు.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు వ‌చ్చేందుకు అమెరికా-ఇరాన్ ఉద్రిక్త‌త‌లు కూడా కార‌ణ‌మ‌య్యాయి. ఇరాన్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ట్రంప్ తిర‌స్క‌రించ‌డంతోపాటు శాంతి ఒప్పందం లైఫ్ స‌పోర్ట్ మీద ఉంద‌ని చెప్ప‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న మొదలైంది. దీంతో యుద్ధ భ‌యాలు పెరిగి భారీగా మార్కెట్లు ప‌త‌నం అయ్యేందుకు కార‌ణ‌మ‌య్యాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం వ‌ల్ల కూడా మార్కెట్లు నెగెటివ్‌గా ప్ర‌భావితం అయ్యాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 2.55 శాతం మేర పెరిగి 107 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.59 శాతం మేర పెరిగి 98 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక రూపాయి విలువ భారీగా ప‌త‌నం అవ‌డం వ‌ల్ల విదేశీ పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున నిధుల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఇది మార్కెట్ల ప‌తనానికి కార‌ణ‌మైంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ 32 పైస‌లు ప‌త‌న‌మై 95.618 వ‌ద్ద నిలిచింది. అయితే వ‌చ్చే వారం ప‌ది రోజుల్లో మార్కెట్లు ఎలా ఉంటాయోన‌ని పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. యుద్ధం కొన‌సాగినా, శాంతి చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోయినా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు గ‌డ్డుకాల‌మే అని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement