త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ట్రంప్-ఇరాన్ డీల్ ఆశలు.. దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్..

Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం వచ్చే వారం కుదిరే అవకాశాలపై ఆశావహ సంకేతాలు రావడంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని కొన‌సాగించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.

S

Business | Published On Jun 12, 2026, 3.59 pm IST

Stock Markets | ట్రంప్-ఇరాన్ డీల్ ఆశలు.. దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం వచ్చే వారం కుదిరే అవకాశాలపై ఆశావహ సంకేతాలు రావడంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని కొన‌సాగించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఒత్తిడిలో ఉన్న ఐటీ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చర్చల ప్రతినిధులు అద్భుతమైన ఒప్పందానికి చేరుకున్నారని తెలిపారు. కొన్ని రోజులలో అవసరమైన పత్రాల ప్రక్రియ పూర్తవుతుందని, ఒప్పందం కుదిరిన వెంటనే హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామ‌ని చెప్పారు. అయితే అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే తుది ఒప్పందంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, వచ్చే వారం జరిగే ఎఫ్-7 సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

1695 పాయింట్లు ఎగ‌బాకిన సెన్సెక్స్‌..

ఈ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే దిగువకు రావడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడులపై ఆందోళనలు తగ్గాయి. ఈ సానుకూల వాతావరణంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు (2.30 శాతం) ఎగబాకి 75,527.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 461.30 పాయింట్లు (1.99 శాతం) లాభపడి 23,622.90 వద్ద స్థిరపడింది. స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తెలిపిన ప్రకారం, ముడి చమురు ధరల పతనం, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం, ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు భారత ఈక్విటీ మార్కెట్లకు బలమైన మద్దతు ఇచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన పరిష్కారానికి దారి తీసే అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి కనిపించడం మార్కెట్‌కు అతిపెద్ద ప్రేరణగా నిలిచింది. దీంతో జియోపొలిటికల్ రిస్క్ తగ్గి, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది. పెట్టుబడిదారులు మళ్లీ ఈక్విటీల వైపు మొగ్గు చూపారు.

భారీగా త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు..

ముడి చమురు ధరల తగ్గుదల దేశానికి ప్రత్యేకంగా ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిడులను తగ్గించడంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులపై సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు. కాగా భారీ ర్యాలీతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. గత సెషన్‌లో రూ.452.33 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్ విలువ, శుక్రవారం రూ.462.05 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.9.71 లక్షల కోట్లు పెరిగింది.

Advertisement
Advertisement