త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మ‌ళ్లీ లాభాల్లోకి వ‌చ్చిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల‌కు మాత్రం న‌ష్ట‌మే..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 20, 2026) రోజువారి కనిష్ఠ స్థాయిల నుంచి బలంగా కోలుకున్నాయి. ఐటీ రంగాన్ని మినహాయిస్తే, అన్ని విభాగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు కనిపించాయి. మధ్యాహ్న సెషన్‌లో సెన్సెక్స్ ఇంట్రా డే-లో నుంచి దాదాపు 900 పాయింట్లు ఎగబాక‌గా, నిఫ్టీ 25,650 స్థాయికి చేరుకుంది.

S

Business | Published On Feb 20, 2026, 1.14 pm IST

Stock Markets | మ‌ళ్లీ లాభాల్లోకి వ‌చ్చిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల‌కు మాత్రం న‌ష్ట‌మే..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 20, 2026) రోజువారి కనిష్ఠ స్థాయిల నుంచి బలంగా కోలుకున్నాయి. ఐటీ రంగాన్ని మినహాయిస్తే, అన్ని విభాగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు కనిపించాయి. మధ్యాహ్న సెషన్‌లో సెన్సెక్స్ ఇంట్రా డే-లో నుంచి దాదాపు 900 పాయింట్లు ఎగబాక‌గా, నిఫ్టీ 25,650 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 12:27 గంటల వ‌ర‌కు సెన్సెక్స్‌ 614.33 పాయింట్లు (0.74 శాతం) పెరిగి 83,112.47 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 199.25 పాయింట్ల‌ (0.78 శాతం) లాభంతో 25,653.60 వద్ద కొన‌సాగుతోంది. మొత్తం 1,895 షేర్లు లాభాల్లో ఉండ‌గా 1,750 షేర్లు నష్టాల్లో, 174 షేర్లు మార్పుల్లేకుండా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే-లో 82,206 కాగా, నిఫ్టీ కనిష్ఠం 25,379.75గా నమోదైంది.

న‌ష్టపోయిన ఐటీ షేర్లు..

గురువారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సుమారు 1.5 శాతం పడిపోవడంతో వ్యాల్యూ బ‌యింగ్‌ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు లాభాలకు బాట‌లు వేశాయి. నిఫ్టీ 50లో కోల్‌ ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ సుమారు 2 శాతం చొప్పున పెరిగాయి. టైటాన్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ దాదాపు 1 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 0.4 నుంచి 1 శాతం వరకు నష్టపోయాయి. టీసీఎస్‌ ప్రారంభంలో నెగెటివ్‌గా ట్రేడ్‌ అయినప్పటికీ, తర్వాత నష్టాలను భ‌ర్తీ చేసి 0.4 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.

ఇరాన్-అమెరికా ఉద్రిక్త‌త‌లు..

నిఫ్టీ 200లో ఏబీబీ ఇండియా 4 శాతం పైగా పెరిగి టాప్‌ గైనర్‌గా నిలిచింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 6 శాతం పెరిగి రూ.3,560 కోట్లకు చేరినప్పటికీ, లాభం 18 శాతం తగ్గి రూ.433 కోట్లకు పడిపోవడంతో ఈ షేర్‌పై ఆసక్తి కనిపించింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా మాత్రం 4 శాతం పైగా పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు 10 నుంచి 15 రోజుల గడువు విధించినప్పటికీ, వాల్‌స్ట్రీట్‌ ఫ్యూచర్లు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే హోర్ముజ్‌ సముద్రసంధిలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇది భారత్‌కు ప్రతికూలంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement