త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO 3.0 | ఈపీఎఫ్‌వో 3.0 సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చేస్తున్నాయి.. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఎంత తీసుకోవ‌చ్చంటే..?

EPFO 3.0 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలను వేగవంతంగా, మరింత మంది వినియోగదారులకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న EPFO 3.0 సంస్కరణలను అమలు చేయడం ప్రారంభించింది.

S

Business | Published On Apr 6, 2026, 3.52 pm IST

EPFO 3.0 | ఈపీఎఫ్‌వో 3.0 సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చేస్తున్నాయి.. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఎంత తీసుకోవ‌చ్చంటే..?
Advertisement

EPFO 3.0 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలను వేగవంతంగా, మరింత మంది వినియోగదారులకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న EPFO 3.0 సంస్కరణలను అమలు చేయడం ప్రారంభించింది. EPFO 3.0లో భాగంగా UMANG యాప్ ద్వారా సేవలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్నవారికి కీలక EPFO సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. EPFO 3.0లోని అన్ని ముఖ్యమైన అప్‌డేట్లు దశలవారీగా అమలవుతాయని, కొన్ని మీడియా నివేదికల ప్రకారం 2026 మధ్య నాటికి పూర్తి స్థాయిలో అమల‌య్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులు ఈ సంస్కరణల కోసం ఎదురుచూస్తుండగా, అత్యంత ఆసక్తికరమైన మార్పుల్లో ఒకటిగా UPI లేదా ATM ద్వారా తక్షణ PF ఉపసంహరణ సౌకర్యం నిలిచింది. సభ్యులు EPFO పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా తమ PF మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అభ్యర్థన పెట్టుకోవ‌చ్చు.

ఎంత తీసుకోవ‌చ్చు..?

ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఎంత పీఎఫ్‌ తీసుకోవచ్చు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. కానీ నివేదిక‌ల ప్ర‌కారం పొదుపులు కొనసాగేందుకు యూపీఐ, ఏటీఎం ద్వారా ఉపసంహరణల‌ను మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు పరిమితం చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మందావియా గతేడాది ఈ పరిమితి 75 శాతం వరకు ఉండొచ్చని సూచించారు. యూపీఐ ద్వారా ఒక్క ట్రాన్సాక్షన్‌కు సుమారు రూ.25వేల వరకు పరిమితి ఉండే అవకాశమూ పరిశీలనలో ఉంది. గ‌తంలో ఓ మీడియా చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మందావియా మాట్లాడుతూ ఉద్యోగులు త‌మ ఈపీఎఫ్‌లో 75 శాతం వ‌ర‌కు మొత్తాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవ‌చ్చ‌ని, 2026 మార్చి ముందు ఈపీఎఫ్ మొత్తాన్ని ఏటీఎం ద్వారా తీసుకునే సౌక‌ర్యాన్ని తీసుకురానున్నాం. అలాగే ఈపీఎఫ్ ఉప సంహ‌ర‌ణ‌ను యూపీఐతో అనుసంధానించ‌నున్నాం.. అని తెలిపారు. అయితే క‌చ్చితమైన ఉపసంహరణ పరిమితులు ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తాయి.

ప్ర‌త్యేక ఏటీఎం కార్డులు కూడా..

పీఎఫ్‌ ఖాతాలకు నేరుగా అనుసంధానమైన ప్రత్యేక ఏటీఎం కార్డులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కార్డుల ద్వారా సభ్యులు సాధారణ బ్యాంక్ లావాదేవీల మాదిరిగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు మద్దతుగా ఈపీఎఫ్‌వో పబ్లిక్,ప్రైవేట్ రంగాలకు చెందిన 32 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఉన్నాయి. అదనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇందులో భాగమయ్యాయి.

వివ‌రాల‌న్నీ వెరిఫై అయి ఉండాలి..

ఇంకా ఫెడరల్ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఈపీఎఫ్‌వో ద్వారా డ‌బ్బును విత్ డ్రా చేయాలంటే స‌భ్యుల‌కు చెల్లుబాటు అయ్యే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉండాలి. దానికి మొబైల్ నంబ‌ర్ లింక్ అయి ఉండాలి. ఓటీపీలు రావాలి. ఆధార్‌, పాన్‌, బ్యాంకు ఖాతా వంటి కేవైసీ వివ‌రాల‌ను ధ్రువీక‌రించి ఉండాలి.

ఏడాదికి 5 కోట్ల క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌..

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యులు పీఎఫ్‌ ఉపసంహరణ కోసం క్లెయిమ్‌లు దాఖలు చేయాలి, ఇవి మాన్యువల్ ప్రాసెసింగ్ వల్ల కొంత సమయం తీసుకుంటాయి. కొత్త వ్యవస్థలో ఎలక్ట్రానిక్ విధానంతో మూడు రోజుల్లో క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పరిష్కరించబడతాయి. ఈ ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని ఇప్పటికే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ప్రతి సంవత్సరం ఈపీఎఫ్‌వో 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తుండగా, వీటిలో ఎక్కువ భాగం పీఎఫ్‌ ఉపసంహరణలే కావ‌డం విశేషం. కొత్త వ్యవస్థతో ఉపసంహరణలు వేగంగా జరిగి ఈపీఎఫ్‌వోపై ఉన్న భారాన్ని కూడా తగ్గించనుంది.

Advertisement
Advertisement