త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rules Change July 1st | జరిమానా డబుల్‌.. పెరగనున్న పాస్‌పోర్ట్‌ ఫీజులు.. జులై 1 నుంచి జరిగే మార్పులు ఇవే..!

Rules Change July 1st | జూన్‌ ముగింపునకు చేరింది. ఈ ఆర్థిక మాసంలో మరో నెల ప్రారంభం కానుంది. బుధవారం నుంచి జూలై నెల ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వ నిర్ణయాలు, బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరల సమీక్ష తదితర మార్పుల కారణంగా ప్రజలపై నేరుగా ప్రభావంపడనుంది.

P

Business | Published On Jun 30, 2026, 9.42 am IST

Rules Change July 1st | జరిమానా డబుల్‌.. పెరగనున్న పాస్‌పోర్ట్‌ ఫీజులు.. జులై 1 నుంచి జరిగే మార్పులు ఇవే..!
Advertisement

Rules Change July 1st | జూన్‌ ముగింపునకు చేరింది. ఈ ఆర్థిక మాసంలో మరో నెల ప్రారంభం కానుంది. బుధవారం నుంచి జూలై నెల ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వ నిర్ణయాలు, బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరల సమీక్ష తదితర మార్పుల కారణంగా ప్రజలపై నేరుగా ప్రభావంపడనుంది. టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై రైల్వే విధించే జరిమానా పెరగడం, ఆధార్‌లో ఈ-మెయిల్ అప్‌డేట్‌కు తాత్కాలిక ఉచిత అవకాశం, ఎల్‌పీజీ సిలిండర్ ధరల సమీక్ష, సీఎన్‌జీ–ఏటీఎఫ్ ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. పాస్‌పోర్టు ఫీజుల పెంపు, అలాగే ప్రైవేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో సవరణలు వంటి అమలులోకి రానున్నాయి.

టికెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా..

భారతీయ రైల్వే టికెట్ నిబంధనల్లో దాదాపు 13 సంవత్సరాల తర్వాత కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై ప్రయాణ చార్జీతో పాటు రూ.250 జరిమానా విధించేవారు. అయితే, జూలై ఒకటి నుంచి ఈ జరిమానాను రూ.500 పెంచారు. అంటే ఇకపై టికెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రయాణ చార్జీతో పాటు రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైల్వేలో టికెట్ లేని ప్రయాణాలను తగ్గించేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ఇంకో కీలక నిబంధన కూడా అమల్లోకి రానుంది. మరో వ్యక్తి పేరుతో బుక్ చేసిన టికెట్‌తో ప్రయాణిస్తున్నట్లు గుర్తిస్తే ఆ టికెట్‌ను వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు ప్రయాణికుడికి పూర్తి చార్జీతో పాటు రూ.500 జరిమానా విధిస్తారు. మహిళల బోగీల్లో అనుమతి లేకుండా ప్రవేశించే పురుషులపై కూడా రైల్వే మరింత కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి సందర్భాల్లో గరిష్ఠంగా రూ.2,500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్‌కు..

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ సేవల్లో తాత్కాలిక ఉపశమనం ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం జూలై 1 నుంచి డిసెంబర్ 31 ఆధార్‌లో ఈ-మెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆధార్‌లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే సర్వీస్‌ సెంటర్లలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఆరు నెలల ప్రత్యేక కాలంలో ఈ-మెయిల్ అప్‌డేట్ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండనుంది. డిజిటల్ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల వివరాలు సరిగ్గా ఉండేలా చూసేందుకు ఉడాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎల్‌పీజీ సిలిండర్ పెరిగే ఛాన్స్‌..

ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. గృహ వినియోగ గ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు చేర్పులు చేయాలా? అని నిర్ణయిస్తారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరిగితే సామాన్య కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ధరలు తగ్గితే కొంత ఉపశమనం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు విపరీతంగా పెంచాయి. 19 కిలోల దాదాపు రూ.3వేలకుపైగా ధర పలుకుతోంది. దాంతో హోటల్స్‌, రెస్టారెంట్లపై ఇబ్బందికరంగా మారగా.. ప్రజల జేబులపై సైతం అదనపు భారం పడుతోంది. ఈ సారి చమురు కంపెనీలు ధరలను పెంచుతాయా? లేదంటే తగ్గిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

సీఎన్‌జీ, ఏటీఎఫ్ ధరల్లో మార్పులు..

రవాణా, విమానయాన రంగాలను ప్రభావితం చేసే సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), ఏటీఎఫ్ (ఎవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరల్లో కూడా జులై 1 నుంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. గత నెలలోనే ఈ రెండు ఇంధనాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈసారి కూడా పెంపు కొనసాగితే దాని ప్రభావం రవాణా ఖర్చులు, వస్తు రవాణా చార్జీలు, విమాన టికెట్ ధరలపై పడే అవకాశం ఉంది. దాంతో పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది.

పాస్‌పోర్టు ఫీజులు పెంపు..

పాస్‌పోర్టు యూజర్లకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. జులై 1, 2026 నుంచి సాధారణ (నార్మల్), తత్కాల్ పాస్‌పోర్టు ఫీజులను భారీగా పెంచింది. పాస్‌పోర్టు కొత్తగా తీసుకునే వారితో పాటు రెన్యూవల్ చేసుకునే వారు ఇకపై గతంతో పోలిస్తే అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 8-60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు 10శాతం రాయితీ కల్పించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు తాజా పాస్‌పోర్ట్ దరఖాస్తులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 36 పేజీల పాస్‌పోర్ట్ సాధారణ దరఖాస్తు ఫీజును రూ.1500 నుంచి రూ.2,500 పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500కి పెరిగింది. 36 పేజీల పాస్‌పోర్ట్ తత్కాల్ దరఖాస్తు రూ.5వేలు, 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్టు దరఖాస్తు రూ.6వేలకు పెంచింది. రెన్యువల్‌ ఫీజులను రూ.5వేలు, రూ.7500గా నిర్ణయించింది. విదేశీ విద్య, ఉద్యోగం, ప్రయాణాల కోసం ప్రణాళికలు వేసుకునే వారికి ఇది అదనపు ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు..

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొత్త రూల్స్‌ విధించింది. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ సదుపాయం సులభంగా లభించేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. గత త్రైమాసికంలో కనీసం రూ.60వేల ట్రాన్సాక్షన్‌ చేసిన యూజర్లకు మాత్రమే తర్వాతి త్రైమాసికంలో ఉచిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. లేకపోతే యూజర్లకు లాంజ్ యాక్సెస్‌పై అదనపు ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement