త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Coal Power | వేస‌వి ఎండల ఎఫెక్ట్‌.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తే దిక్కు..

India Coal Power | గ‌తేడాది క‌న్నా ఈసారి వేస‌వి కాలం సుదీర్ఘంగా ఉండ‌డంతో దేశ‌వ్యాప్తంగా గ‌త 4 నెల‌ల నుంచి విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది. దీంతో జూన్ నెల‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి 2023 నవంబ‌ర్ త‌రువాత అత్య‌ధిక స్థాయికి చేరుకున్న‌ట్లు గ‌ణాంకాల్లో తేలింది.

S

Business | Published On Jul 3, 2026, 12.57 pm IST

India Coal Power | వేస‌వి ఎండల ఎఫెక్ట్‌.. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తే దిక్కు..
Advertisement

India Coal Power | గ‌తేడాది క‌న్నా ఈసారి వేస‌వి కాలం సుదీర్ఘంగా ఉండ‌డంతో దేశ‌వ్యాప్తంగా గ‌త 4 నెల‌ల నుంచి విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది. దీంతో జూన్ నెల‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి 2023 నవంబ‌ర్ త‌రువాత అత్య‌ధిక స్థాయికి చేరుకున్న‌ట్లు గ‌ణాంకాల్లో తేలింది. దీర్ఘకాలం కొనసాగిన తీవ్ర ఎండలు, సాధారణం కంటే తక్కువగా నమోదైన నైరుతి రుతుపవనాల వర్షపాతం కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషనర్లు నిరంతరం వినియోగంలో ఉండటంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గ‌ణాంకాల‌పై రాయిట‌ర్స్ విశ్లేష‌ణ చేసింది. జూన్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 14 శాతం పెరిగి 120.2 బిలియన్ కిలోవాట్-గంటలకు చేరుకుంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 10.4 శాతం పెరిగి 178.31 బిలియన్ కిలోవాట్-గంటలకు చేరింది.

బొగ్గుపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డి..

వేస‌విలో దేశంలో విద్యుత్ అవ‌స‌రాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే ఆ అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో భార‌త్ ఇప్ప‌టికీ బొగ్గుపైనే ఎంత‌గానో ఆధార‌ప‌డుతోంది. పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పూర్తిగా తీర్చడానికి భారత్ మరోసారి శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా భారీ జనాభా ఉన్న క్ర‌మంలో విద్యుత్ వినియోగం పెరగడంతో బొగ్గు విద్యుత్ కేంద్రాల పాత్ర మరింత కీలకంగా మారింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా జూన్ నెల అత్యంత పొడి జూన్‌ నెలగా నిలిచిన నేప‌థ్యంలో ఈ రికార్డు స్థాయిలో విద్యుత్ అవ‌స‌రాల పెరుగుద‌ల చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపిన ప్రకారం 1901 నుంచి 126 ఏళ్ల కాలంలో తాజా జూన్ నెల‌నే అత్యంత పొడి జూన్ నెల‌గా న‌మోదైంది. బ‌ల‌మైన ఎల్‌నినో ప్ర‌భావం కార‌ణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాల పురోగ‌తి ఆల‌స్య‌మైంది. దీంతో ఇప్ప‌టికే నెల‌లుగా కొన‌సాగుతున్న తీవ్ర ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత కాలంపాటు కొన‌సాగ‌నున్నాయి.

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం..

వ‌ర్షాలు ఆల‌స్యంగా వ‌స్తుండడంతో దేశంలో ఉష్ణోగ్ర‌త‌లు ఇంకా చాలా చోట్ల ఎక్కువ‌గానే ఉన్నాయి. దీంతో చాలా మంది ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థ‌ల్లో ఎయిర్ కండిష‌న‌ర్ల‌ను గ‌ణ‌నీయంగా వినియోగిస్తున్నారు. ఫ‌లితంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగి డిమాండ్ ఏర్ప‌డింది. భార‌త్‌లో విద్యుత్ ఉత్ప‌త్తిలో ఇప్ప‌టికీ బొగ్గే ప్ర‌ధాన వ‌న‌రుగా ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు రోజుకు 24 గంట‌లూ నిరంత‌రాయంగా విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తుండ‌డంతో ఎక్కువ‌గా విద్యుత్ కోసం వీటిపైనే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తి వేగంగా పెరుగుతున్న‌ప్ప‌టికీ, సూర్యాస్త‌మ‌యం త‌రువాత సౌర విద్యుత్ ఉత్ప‌త్తి నిలిచిపోతుంది. పెద్ద స్థాయిలో బ్యాట‌రీ నిల్వ వ్య‌వ‌స్థ‌లు ఇంకా ప‌రిమితంగానే ఉన్నాయి. అందువ‌ల్ల సౌర విద్యుత్ వినియోగంలో ప‌రిమితులు ఎదుర‌వుతున్నాయి.

సాయంత్రం త‌రువాత ఎలా..

సాయంత్రం స‌మ‌యంలో సౌర విద్యుత్ త‌గ్గిన త‌రువాత ఏర్ప‌డుతున్న విద్యుత్ అవ‌స‌రాల‌ను ప్ర‌ధానంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే తీర్చుతున్నాయి. జూన్ నెల‌లో విద్యుత్ మిశ్ర‌మంలో పున‌రుత్పాద‌క ఇంధ‌నాల వాటా రికార్డు స్థాయిలో 19 శాతానికి చేరింది. అయిన‌ప్ప‌టికీ గ‌రిష్ట డిమాండ్ స‌మ‌యంలో బొగ్గును పూర్తిగా భ‌ర్తీ చేసే స్థాయికి ఆ ఉత్ప‌త్తి ఇంకా చేర‌లేదు. మొత్తం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఏడాది క్రితంతో పోలిస్తే 23 శాతం పెరిగి 33.81 బిలియన్ కిలోవాట్-గంటలకు చేరినా, బొగ్గు ఆధిపత్యం మాత్రం కొనసాగుతోంది. శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించాలంటే భారత్ మరింత భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ వివ‌రాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక సాధారణం కంటే తక్కువ వర్షపాతం జలవిద్యుత్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 24.4 శాతం పడిపోయి 14 బిలియన్ కిలోవాట్-గంటలకు చేరింది. ఇది 2024 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యంత ఎక్కువ త‌గ్గుద‌ల‌గా నిలిచింది.

త‌గ్గిన స‌హ‌య వాయువు విద్యుత్ ఉత్ప‌త్తి..

సహజ వాయువు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కూడా జూన్ నెలలో 30.1 శాతం తగ్గింది. ఇంధన రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దేశంలో విద్యుత్ డిమాండ్ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కూడా బొగ్గే భారత్‌కు ప్రధాన విద్యుత్ వనరుగా కొనసాగే అవకాశం ఉంద‌ని అంటున్నారు. క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసీఆర్‌ఏ ఉపాధ్యక్షుడు అంకిత్ జైన్ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ గరిష్ఠ వినియోగ సమయాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement