త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices Today | యుద్ధం, ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా.. కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

Gold Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన అనంతరం వారపు తొలి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ బులియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ భారత్‌లో బంగారం ధరలు భారీ స్థాయిలో లాభాల బుకింగ్‌కు గుర‌య్యాయి.

S

Business | Published On Mar 3, 2026, 9.50 am IST

Gold Prices Today | యుద్ధం, ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నా.. కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold Prices Today | మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన అనంతరం వారపు తొలి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ బులియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ భారత్‌లో బంగారం ధరలు భారీ స్థాయిలో లాభాల బుకింగ్‌కు గుర‌య్యాయి. 24 క్యారెట్ బంగారం (24K) ఒక్కరోజులోనే రూ.25,800 పతనమై 100 గ్రాములకు రూ.17,05,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు రికార్డు స్థాయికి పెరిగిన‌ సమయంలోనే ఈ అనూహ్య‌ పతనం చోటుచేసుకుంది. ఇక భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధరలు గత సెషన్‌తో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.17,051గా ఉంది. సోమ‌వారం నాటి రూ.17,309తో పోలిస్తే ఇది రూ.258 తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

మంగ‌ళ‌వారం (మార్చి 3, 2026) బంగారం ధ‌ర‌లు..

బల్క్ కొనుగోళ్లలో 8 గ్రాముల 24K బంగారం ధర రూ.1,36,408గా ఉంది, ఇది రూ.2,064 త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,70,510గా ఉండి క్రితం రోజుతో పోలిస్తే రూ.2,580 తగ్గింది. 100 గ్రాముల బంగారం ధర రూ.17,05,100గా ఉండి, గత ముగింపు ధరతో పోలిస్తే రూ.25,800 భారీ పతనం నమోదు చేసింది.

మార్చి 3, 2026న 22 క్యారెట్ల‌ బంగారం ధ‌ర‌ గ్రాముకు రూ.15,630గా ఉంది. ఇది క్రితం రోజు ధ‌ర‌ రూ.15,865తో పోలిస్తే రూ.235 తగ్గింది. 8 గ్రాముల ధర రూ.1,25,040గా ఉండి రూ.1,880 తగ్గింది. 10 గ్రాముల ధర రూ.1,56,300గా ఉండి రూ.2,350 తగ్గింది. 100 గ్రాముల 22K బంగారం ధర రూ.15,63,000గా ఉండి రూ.23,500 తగ్గుదల నమోదు చేసింది.

18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.12,788గా ఉంది. ఇది గత ధర రూ.12,981తో పోలిస్తే రూ.193 తగ్గింది. 8 గ్రాముల ధర రూ.1,02,304గా ఉండి రూ.1,544 తగ్గింది. 10 గ్రాముల ధర రూ.1,27,880గా ఉండి రూ.1,930 తగ్గింది. 100 గ్రాముల ధర ప్రస్తుతం రూ.12,78,800గా ఉండి, గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే రూ.19,300 తగ్గింది.

సేఫ్ హేవెన్ ఆస్తుల వైపు ప‌రుగులు..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరగడంతో, గ్లోబల్ మార్కెట్లు ఆ పరిస్థితిని జీర్ణించుకుంటున్న వేళ, తదుపరి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు తీవ్ర అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటికే బులియన్ ధరలు చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. సోమవారం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు $5,400 దాటి రికార్డు స్థాయిని టెస్ట్ చేసింది. దీర్ఘకాలిక ప్రాంతీయ ఘర్షణ భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్ ఆస్తులవైపు పరుగులు తీశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ మరణించ‌డంతో ఇరాన్‌తో శత్రుత్వం తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామాల ప్రభావంగా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వెళ్లే కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి ప్రభావితమైంది. దీంతో క్రూడ్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ భయాలు పుట్టుకొచ్చాయి.

వీటీ మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ ఆపరేషన్స్ లీడ్ రాస్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే లేదా విస్తృత ప్రాంతీయ యుద్ధంగా మారితే భారత్‌లో బంగారం ధరలు కొత్త గరిష్టాలను చేర‌వచ్చు. ముఖ్యంగా క్రూడ్ ధరలు పెరుగుతూ, రూపాయి ఒత్తిడిలో ఉంటే, బంగారం దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. అయితే ఉద్రిక్తతలు తగ్గితే లేదా అమెరికన్ డాలర్ బలపడితే, తాత్కాలికంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడే అవ‌కాశం ఉంది.. అని తెలిపారు.

Advertisement
Advertisement