త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold ETF | ఏడాదిలోనే ఏకంగా 61 శాతం రాబ‌డుల‌ను అందించిన గోల్డ్ ETFలు.. ఇప్పుడు పెట్ట‌బడి పెట్ట‌వ‌చ్చా..?

Gold ETF | భారత్‌లో బంగారం కొనుగోలు చేయ‌డం అంటే.. కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అది సంప్రదాయంతో ముడిపడి ఉన్న అంశం. శుభం, ఐశ్వర్యం, దీర్ఘకాల సంపదకు ప్రతీకగా భావించి పండుగల సమయంలో ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ కూడా అలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒకటి, ఈ రోజున బంగారం కొనడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు.

S

Business | Published On Apr 17, 2026, 2.23 pm IST

Gold ETF | ఏడాదిలోనే ఏకంగా 61 శాతం రాబ‌డుల‌ను అందించిన గోల్డ్ ETFలు.. ఇప్పుడు పెట్ట‌బడి పెట్ట‌వ‌చ్చా..?
Advertisement

Gold ETF | భారత్‌లో బంగారం కొనుగోలు చేయ‌డం అంటే.. కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అది సంప్రదాయంతో ముడిపడి ఉన్న అంశం. శుభం, ఐశ్వర్యం, దీర్ఘకాల సంపదకు ప్రతీకగా భావించి పండుగల సమయంలో ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ కూడా అలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒకటి, ఈ రోజున బంగారం కొనడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంప్రదాయ నేపథ్యంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) కూడా బంగారంలో పెట్టుబడికి ఆధునిక ప్రత్యామ్నాయంగా మారాయి, గత అక్షయ తృతీయ నుంచి గోల్డ్ ETFలు 61 శాతం వరకు అద్భుత రాబడులు అందించినట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే మార్కెట్ నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తున్నారు. అసెట్ అలొకేషన్ క్రమశిక్షణ అత్యంత కీలకమ‌ని, లక్ష్యాన్ని మించినప్పుడు కొంత లాభాలను బుక్ చేయాల‌ని, తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

ల‌క్ష్యాన్ని మించితే కాస్త విక్ర‌యించాలి..

చాయిస్ వెల్త్ సంస్థ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ హెడ్ అక్షత్ గార్గ్ మాట్లాడుతూ గోల్డ్‌లో పెట్టుబడి లక్ష్యం 5-15 శాతం అయితే అది 20-30 శాతానికి పెరిగితే కొంత భాగాన్ని విక్రయించి ఈక్విటీ లేదా డెట్ వంటి ఇతర ఆస్తుల్లో మళ్లీ పెట్టుబడి పెట్టాలని సూచించారు. అదే విధంగా ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో విశాల్ ధావన్ మాట్లాడుతూ ధరలపై ఉత్సాహం కాకుండా పోర్ట్‌ఫోలియో క్రమశిక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. గోల్డ్ ధరలు భారీగా పెరిగినప్పుడు కొంత లాభాలు బుక్ చేయడం సబబేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాల పెట్టుబడిదారుల దృష్టిలో గోల్డ్ ఒక డైవర్సిఫికేషన్ సాధనం. కేవలం అధిక రాబడుల కారణంగా పూర్తిగా బయటకు రావడం పోర్ట్‌ఫోలియోకు నష్టం కలిగించవచ్చని ధావన్ హెచ్చరించారు.

గ్లోబ‌ల్ స్థాయి అంశాలే కార‌ణం..

గోల్డ్ ETFల ర్యాలీకి ప్రధాన కారణాలు గ్లోబల్ స్థాయి అంశాలే. భౌగోళిక ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, తక్కువ వడ్డీ రేట్ల అంచనాలు, ఆర్థిక అనిశ్చితులు గోల్డ్‌కు సేఫ్ హేవెన్ డిమాండ్‌ను పెంచాయి. పెట్టుబడిదారులు ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో అస్థిరత నుంచి రక్షణ కోసం గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. విశాల్ ధావన్ ప్రకారం ఈ ర్యాలీకి సేఫ్ హేవెన్ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ బలహీనత, రియల్ ఈల్డ్స్ తగ్గుదల వంటి అంశాలు కారణమయ్యాయి. అక్షత్ గార్గ్ అభిప్రాయం ప్రకారం ETFలలో భారీ ఇన్‌ఫ్లో లు, అమెరికా టారిఫ్‌ల వల్ల వచ్చిన ద్రవ్యోల్బణ భయాలు, గ్లోబల్ డెట్ ఒత్తిళ్లు కూడా ఈ పెరుగుదలకు దోహదపడ్డాయ‌ని తెలిపారు. గతేడాది ఏప్రిల్ 30, 2025 నుంచి ఏప్రిల్ 16, 2026 వరకు గోల్డ్ ETFలు సగటున 59.63 శాతం రాబడి ఇచ్చాయి. మొత్తం 20 ETFల్లో టాటా గోల్డ్ ETF 60.59 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అదిత్య బిర్లా SL గోల్డ్ ETF 60.27 శాతం, ఐసీఐసీఐ ప్రూ గోల్డ్ ETF 60.22 శాతం, జెరోధా గోల్డ్ ETF 60.12 శాతం, కోటక్ గోల్డ్ ETF 60.06 శాతం రాబడులను ఇచ్చాయి. క్వాంటమ్ గోల్డ్ ఫండ్ ETF 58.55 శాతంతో చివరిస్థానంలో నిలిచింది.

ర్యాలీ కొన‌సాగుతుందా..?

ఈ ర్యాలీ కొనసాగుతుందా అన్న సందేహం కూడా పెట్టుబడిదారుల్లో ఉంది. నిపుణుల ప్రకారం తక్షణ కాలంలో ధరలు కొంత ఎక్కువగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలిక కారణాలు గోల్డ్‌కు మద్దతుగా ఉన్నాయి. గార్గ్ ప్రకారం ఆసియా దేశాల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, మాక్రో హెడ్జింగ్ లక్షణాలు దీర్ఘకాలంలో గోల్డ్‌కు బలం ఇస్తాయి. ధావన్ అభిప్రాయం ప్రకారం ETFలలో ఇన్ ఫ్లోలు బలంగానే ఉన్నప్పటికీ, ఇటీవల కొంత మార్పులు, అస్థిరత కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల ప్రవర్తన ధరలపై మరింత సున్నితంగా మారుతున్నదనే సంకేతాన్ని ఇస్తుంద‌ని తెలిపారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా అనే ప్రశ్నకు నిపుణులు మిశ్రమ సమాధానాలు ఇస్తున్నారు. టాటా మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం, యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం వల్ల కొన్ని దేశాలకు గోల్డ్ కొనుగోలు పరిమితమైంది. టర్కీ వంటి దేశాలు తమ కరెన్సీ స్థిరీకరణ కోసం గోల్డ్ నిల్వలను విక్రయించాయి.

ద‌శ‌ల‌వారీగా పెట్ట‌డం ఉత్త‌మం..

ధావన్ ప్రకారం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని చెప్పారు. గోల్డ్ ర్యాలీలు సాధారణంగా ఊహించలేని ఘటనలపై ఆధారపడతాయని ఆయన తెలిపారు. గార్గ్ సూచన ప్రకారం 5-10 శాతం వరకు పడిపోయినప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిదని, మొత్తం పోర్ట్‌ఫోలియోలో 7-12 శాతం గోల్డ్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. గత ఆరు నెలల్లో గోల్డ్ ETFలు 21.19 శాతం వరకు పెరిగాయి. తొమ్మిది నెలల్లో 55 శాతం వరకు లాభాలు వచ్చాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 16 శాతం వరకు రాబడులు నమోదయ్యాయి. LIC MF గోల్డ్ ETF 15.50 శాతంతో ముందంజలో ఉంది. 2026 ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. జనవరి 29 నాటికి గోల్డ్ ధరలు ఎంసీఎక్స్‌లో రికార్డు స్థాయికి చేరుకుని 10 గ్రాములకు రూ.1.80 లక్షలకు చేరువయ్యాయి. అయితే నెల చివర్లో లాభాల బుకింగ్ కారణంగా ఒక్కరోజులోనే 12 శాతం వరకు పతనం నమోదైంది.

తదుపరి 12-18 నెలలపై నిపుణులు ఆశావహ దృక్ప‌థం వ్యక్తం చేస్తున్నారు. గార్గ్ ప్రకారం గోల్డ్ ధరలు 4,000-5,000 డాల‌ర్ల‌ మధ్య స్థిరపడే అవకాశం ఉంద‌న్నారు. ధావన్ ప్రకారం భౌగోళిక పరిస్థితులు, డాలర్, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. గోల్డ్‌లో పెట్టుబడి అవకాశాలు కొనసాగుతున్నప్పటికీ, తక్షణ కాలంలో ఒడిదుడుకులు తప్పవు. కాబట్టి పెట్టుబడిదారులు క్రమశిక్షణతో, సరైన‌ ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

Advertisement
Advertisement