త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gen Z | జెన్ జీ చూపు.. స్టాక్ మార్కెట్ వైపు.. భారీగా పెరుగుతున్న యువ ఇన్వెస్ట‌ర్ల సంఖ్య‌..

Gen Z | స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు అంటే ఒక‌ప్పుడు భ‌య‌ప‌డేవారు. కేవ‌లం సంప‌న్న వ‌ర్గాల‌కు చెందిన వారు మాత్రమే అందులో నిల‌బ‌డ‌గ‌లుగుతార‌ని భావించేవారు. కానీ క్ర‌మంగా ఆ భ్ర‌మ‌లు తొల‌గిపోయాయి. నైపుణ్యం, అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా స‌రే అందులో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చ‌ని త‌రువాతి త‌రం నిరూపించింది.

S

Business | Published On Apr 28, 2026, 10.28 am IST

Gen Z | జెన్ జీ చూపు.. స్టాక్ మార్కెట్ వైపు.. భారీగా పెరుగుతున్న యువ ఇన్వెస్ట‌ర్ల సంఖ్య‌..
Advertisement

Gen Z | స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు అంటే ఒక‌ప్పుడు భ‌య‌ప‌డేవారు. కేవ‌లం సంప‌న్న వ‌ర్గాల‌కు చెందిన వారు మాత్రమే అందులో నిల‌బ‌డ‌గ‌లుగుతార‌ని భావించేవారు. కానీ క్ర‌మంగా ఆ భ్ర‌మ‌లు తొల‌గిపోయాయి. నైపుణ్యం, అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా స‌రే అందులో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చ‌ని త‌రువాతి త‌రం నిరూపించింది. ముఖ్యంగా మిల్లెనియ‌ల్స్ భారీ ఎత్తున స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డంతోపాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నార‌ని ఆర్‌బీఐ గణాంకాల్లో వెల్ల‌డైంది. అయితే ఇక మిల్లెనియ‌ల్స్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న జెన్ జీ (Gen-Z) త‌రం ప్ర‌స్తుతం స్టాక్ మార్కెట్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లు తేలింది. త‌మ ముందు త‌రం వారి క‌న్నా వీరు ఇంకా ఎక్కువ సంఖ్య‌లో డీమ్యాట్ ఖాతాల‌ను ఓపెన్ చేయ‌డంతోపాటు ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నార‌ని వెల్ల‌డ‌వుతోంది. అయితే ఇందుకు ప‌లు కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్టార్ మార్కెట్ల‌లో చురుగ్గా జెన్ జీ..

భార‌త్‌లో ఇన్వెస్ట‌ర్లు, ట్రేడ‌ర్లు అంటే గ‌తంలో ఎక్కువ‌గా వ‌య‌స్సు పైబ‌డిన వారు చేసేవారు. సంపాద‌న కాస్త స్థిరంగా ఉన్నా లేక ఆస్తులు ఉన్నా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు. అయితే ప్ర‌స్తుతం మిల్లెనియ‌ల్స్‌తోపాటు జెన్ జీ త‌రం స్టాక్ మార్కెట్ల‌లో చురుగ్గా ఉంటున్నారు. ప్ర‌స్తుత భార‌త పెట్టుబ‌డిదారుడి స‌గ‌టు వ‌య‌స్సు 30ల‌లో ఉండ‌గా, దాదాపు స‌గం మంది 30 సంవ‌త్స‌రాల‌లోపు వారే కావడం విశేషం. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం స్టాక్ మార్కెట్ల‌లో జెన్ జీ సెగ్మెంట్ కీల‌క శ‌క్తిగా ఎదిగింది. వీరు ఎన్‌ఎస్‌ఈలో నమోదైన ఇన్వెస్టర్లలో ఎఫ్‌వై20లో సుమారు 25 శాతం ఉండగా, ఎఫ్‌వై25 నాటికి 40 శాతానికి పెరిగారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డేటా కూడా ఈ ధోరణిని నిర్ధారించింది. 30 ఏళ్ల లోపు ఇన్వెస్టర్ల వాటా మార్చి 2019లో 22.6 శాతం ఉండ‌గా అది జూలై 2025 నాటికి 38.9 శాతానికి పెరిగింది. దీంతో స‌గ‌టు ఇన్వెస్ట‌ర్‌ వయస్సు 38 నుంచి 33కి తగ్గింది.

70 శాతం అకౌంట్లు వారివే..

భారత్‌లో 25 ఏళ్ల లోపు జ‌నాభా సుమారు 60 కోట్ల మంది ఉన్నారు. వీరి మార్కెట్ భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. ఎన్ఎస్ఈ 2022లో కొత్త డీమాట్ అకౌంట్లలో 43 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇందులో 18-30 ఏళ్ల వయస్సు గలవారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా జీరోధా, గ్రో, పేటీఎం మ‌నీ వంటి ట్రేడింగ్ యాప్స్‌లో కొత్త యూజర్లలో 70 శాతానికి పైగా ఈ వయస్సు వర్గానికి చెందినవారే కావ‌డం విశేషం. మొబైల్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు సుల‌భంగా అందుబాటులో ఉండ‌డ‌మే ఈ పెరుగుద‌లకు కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆయా ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడుల్లోనూ ఆధిపత్యం సాగిస్తున్నాయి. యాప్ ఆధారిత బ్రోకర్లు ప్రస్తుతం రిటైల్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నారు. కొత్తగా నమోదవుతున్న సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్) అకౌంట్లలో 55-60 శాతం వరకు టాప్ 30 నగరాల వెలుపల నుంచే వస్తున్న‌ట్లు వెల్ల‌డైంది.

మిల్లెనియ‌ల్స్‌, జెన్ జీ చేతుల్లో మ్యుచువ‌ల్ ఫండ్స్‌..

2025 నాటికి మిల్లెనియల్స్ , జెన్ జీ కలిసి మొత్తం మ్యుచువల్ ఫండ్ ఆస్తుల్లో దాదాపు 48 శాతం వ‌ర‌కు నియంత్రిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. వారి ఖాతాల్లో రూ. 75.35 లక్షల కోట్లు ఉన్నాయి. అదే సంవత్సరం 35 ఏళ్ల లోపు వారు సుమారు 40 శాతం కొత్త సిప్ అకౌంట్లు ప్రారంభించారు. భారత డిజిటల్ ఇన్వెస్టింగ్ రంగంలో ఏడు ప్రధాన ఇన్వెస్టర్ సెగ్మెంట్లు కనిపిస్తున్నాయి. మెట్రో నగరాల్లోని జీతభత్యాల మిల్లెనియల్స్ ఎక్కువగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. చిన్న నగరాల్లోని మిల్లెనియల్స్ ఇంకా అనుభవం పెంచుకుంటున్నారు. జెన్ జీ యువ ఉద్యోగులు సిప్‌లపై ఆసక్తి చూపుతున్నారు. జెన్ ఎక్స్ స్థిరమైన ఇన్వెస్టర్లు కాగా, స్వయం ఉపాధి నిపుణులు సమతుల్య రిస్క్ తీసుకుంటున్నారు. జెన్ జీ త‌రం మార్కెట్ ట్రెండ్స్‌కు వేగంగా స్పందిస్తున్నారు. వ్యాపారవేత్తలు ఎక్కువ రిస్క్ తీసుకునే వర్గంగా నిలుస్తున్నారు. ఇవన్నీ కలిసి భారత యువ ఇన్వెస్టర్ బేస్ పెరుగుతున్న విష‌యాన్ని సూచిస్తున్నాయి.

పూర్తిగా డిజిట‌ల్ మార్గాల్లోనే..

కొత్త తరానికి చెందిన వారు పెట్టుబడుల‌ను పూర్తిగా డిజిటల్ మార్గాల్లోనే చేస్తున్నారు. ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తోనే పెట్టుబడి పెట్టడం సులభమైంది. అయితే నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియలో 35 శాతం మంది కొత్త ఇన్వెస్టర్లు మధ్యలోనే బయటకు వెళ్లిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. వేగంగా, సులభంగా ఆన్‌బోర్డింగ్ లేకపోతే యువత వెంటనే ప్లాట్‌ఫామ్ మార్చేస్తున్నార‌ని తేలింది. ఇందుకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌లు సైతం మార్పుల‌ను తీసుకొస్తున్నాయి. డిజిటల్ కేవైసీ, ఈ-సిగ్నేచర్ విధానాలు పెరిగాయి. అప్ స్టాక్స్ వంటి యాప్ ఆధారిత బ్రోకర్లు ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నారు. మొబైల్ వినియోగం వల్ల చిన్న పట్టణాల నుంచి కూడా కొత్త ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.

దీర్ఘ‌కాలిక పెట్టుడుల‌కు ప్రాధాన్యం..

కొత్త భారతీయ ఇన్వెస్టర్ కేవలం యువకుడే కాదు, దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి సారిస్తున్నాడు. 2025లో 35 ఏళ్ల లోపు వారు 40 శాతం సిప్ అకౌంట్లు ప్రారంభించారు. జెన్ జీ 19 శాతం మంది సిప్‌లలో పెట్టుబడి పెడుతుండగా, మిల్లెనియల్స్‌లో ఇది 14 శాతంగా ఉంది. వీరిలో 84 శాతం మంది ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తం మ్యుచువల్ ఫండ్ ఫోలియోల్లో సగం 30 ఏళ్ల లోపు వారివే కావ‌డం విశేషం. ఇక స్టాక్ మార్కెట్‌లో యువత వేగంగా మార్పులు తీసుకొస్తోంది. త్వరిత లాభాల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తోంది. బెయిన్ అండ్ గ్రోవ్ విశ్లేషణ తెలిపిన ప్రకారం యువ ఉద్యోగులు తమ ఆస్తుల్లో 55-65 శాతం వ‌ర‌కు మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. మొదట సిప్‌తో ప్రారంభించి, తర్వాత లంప్‌సమ్ పెట్టుబడులకు మారుతున్నారు. గత రెండేళ్లలో లంప్‌సమ్ ఇన్‌ఫ్లోలు 11 శాతం పెరిగాయి. వ్యాపారవేత్తల సెగ్మెంట్‌లో లంప్‌సమ్ పెట్టుబడులు ఐదు రెట్లు పెరిగాయి.

గోల్డ్ వ‌ద్దు.. ఈక్విటీలే ముద్దు..

జెన్ జీ ఇన్వెస్టర్లలో 58 శాతం పెట్టుబడులు స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లోకి వెళ్తున్నాయి. గోల్డ్ వంటి సంప్రదాయ ఆస్తులతో పోలిస్తే ఇవే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. ఒక సర్వే ప్రకారం 45 శాతం జెన్ జీ యువ‌త‌ గోల్డ్ కంటే స్టాక్స్ లేదా సిప్‌ల‌కే అధిక‌ ప్రాధాన్యత‌ ఇస్తున్న‌ట్లు తేలింది.18-21 ఏళ్ల వయస్సు గలవారిలో 72 శాతం మంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చిన్న, మధ్య తరహా ఫండ్స్‌లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. యువ ఇన్వెస్టర్ల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపుతోంది. రిటైల్ పెట్టుబడులు చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు నిధులు అందిస్తున్నాయి. నాన్-మెట్రో ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడులు మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుతున్నాయి. దేశ ఆర్థిక నిపుణులు దీన్ని సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. రిటైల్ భాగస్వామ్యం పెరుగుతుంటే, భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాల‌ర్ల లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో యువ ఇన్వెస్టర్లు మార్కెట్‌ను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ యాక్సెస్, ఫైనాన్షియల్ అవగాహన పెరుగుతున్న కొద్దీ వారి భాగస్వామ్యం విస్తరిస్తోంది. మొబైల్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌లు, కొత్త పెట్టుబడి ఉత్పత్తులు అభివృద్ధి చెందనున్నాయి. భారత పెట్టుబడిదారుల ప్రపంచం ఇప్పటివరకు ఎన్న‌డూ లేనంతగా యువత‌తో నిండిపోయి ప్ర‌స్తుతం ముందుకు సాగుతోంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement