త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Prices | ఇంకా భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు..? క్రూడ్ నిల్వ‌ల పరిస్థితేంటి..?

Fuel Prices | భార‌త్ వ‌ద్ద‌ ప్రస్తుతం 78 రోజులకు సరిపడే క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది.

S

Business | Published On May 26, 2026, 3.41 pm IST

Fuel Prices | ఇంకా భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు..? క్రూడ్ నిల్వ‌ల పరిస్థితేంటి..?
Advertisement

Fuel Prices | భార‌త్ వ‌ద్ద‌ ప్రస్తుతం 78 రోజులకు సరిపడే క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ప‌శ్చిమ‌ ఆసియా యుద్ధం తర్వాత ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్‌కు అవసరమైన ఇంధన సరఫరాలో పెద్ద భాగం గల్ఫ్, పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ట్యాంకర్ రవాణాకు హోర్ముజ్ జలసంధి అనేక వారాలుగా దాదాపు మూసి ఉండ‌డంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి.

ఇంధ‌నం ఉందంటున్న కేంద్రం..

జనతాదళ్ (యునైటెడ్) నేత సంజయ్ కుమార్ ఝా అధ్యక్షతన పనిచేస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప‌శ్చిమ‌ ఆసియా సంక్షోభం, భారత్ సముద్ర వాణిజ్యం, షిప్పింగ్ మౌలిక వసతులు, సముద్ర సిబ్బంది భద్రతపై చూపుతున్న ప్రభావం అంశంపై చ‌ర్చించింది. ఈ నేపథ్యంలోనే ఆ క‌మిటీకి కేంద్రం క్రూడ్ నిల్వ‌ల‌పై వివ‌రాల‌ను తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. ఇక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై లీటరుకు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు ప్రకటించారు. రెండు వారాల్లో ఇది నాలుగోసారి ధరల పెంపు కావడం గమనార్హం. మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తం పెరుగుదల లీటరుకు దాదాపు రూ.7.5కి చేరింది. అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటింది. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు దిశగా ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం ధరల పెంపు కొనసాగింది. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం తగిన మోతాదులో అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోందని సమాచారం.

ఇది కంపెనీల నిర్ణ‌యం: కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

ఇక మంగ‌ళ‌వారం నాడు నెల‌కొన్న అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతుండడం, తాజాగా ద‌క్షిణ ఇరాన్‌పై అమెరికా మ‌రోమారు దాడులు చేయ‌డంతో మార్కెట్ల‌లో ఆందోళ‌న‌లు పెరిగాయి. దీంతో దేశీయ సూచీలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. మ‌రోవైపు రూపాయి విలువ కూడా మళ్లీ ప‌త‌న‌మైంది. ఇక భారత ఇంధన మార్కెట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కలిసి దాదాపు 90 శాతం మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయి. రిటైల్ ఇంధన ధరల పెరుగుదలపై ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ స్పందిస్తూ, ఇవి ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల కాకుండా అంతర్జాతీయ కొనుగోలు పరిస్థితుల ప్రభావంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకుంటున్న ఆపరేషనల్ నిర్ణయాలేనని వివరించారు.

భారీగా పెర‌గ‌నున్న ఇంధ‌న ధ‌ర‌లు..?

ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో భారీ ఆర్థిక భారం భరించిందని ఆమె తెలిపారు. కేంద్ర పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1 లక్ష కోట్ల మేర ఫిస్కల్ దెబ్బ తగిలిందని వెల్లడించారు. సుమారు 75 రోజుల పాటు ప్రజలపై భారం పెరగకుండా తాము చూసుకున్నామ‌ని, ఆ సమయంలో లీటరుకు రూ.10 వరకు పెరగాల్సిన ధరలను ప్రభుత్వం భరించింద‌ని, కానీ ఇప్పుడు కొన‌సాగుతున్న పెరుగుదల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయాల వల్లే అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే సోమ‌వారం నాడు ప‌రిస్థితి ఒక‌లా ఉన్నా మంగ‌ళ‌వారం నాటికి మ‌ళ్లీ మారింది. చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం, యుద్ధ మేఘాలు మ‌ళ్లీ క‌మ్ముకుంటుండ‌డంతో క్రూడ్ ఆయిల్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశాలు ఇంకా పెర‌గ‌నున్నాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిఎల్‌, ఎల్‌పీజీ ధ‌ర‌లు ఇంకా భారీగా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement