త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Bills | పెట్రోల్ షాక్.. ఫుడ్ డెలివరీలు, రెస్టారెంట్ బిల్లులు భారీగా పెంపు..

Food Bills | పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వచ్చే వారం నుంచి బయట భోజనం చేయడం, ఫుడ్ డెలివరీలు ఆర్డర్ చేయడం 5-10 శాతం వరకు ఖరీదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్థలపై అదనపు భారం పడింది.

S

Business | Published On May 16, 2026, 10.19 am IST

Food Bills | పెట్రోల్ షాక్.. ఫుడ్ డెలివరీలు, రెస్టారెంట్ బిల్లులు భారీగా పెంపు..
Advertisement

Food Bills | పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వచ్చే వారం నుంచి బయట భోజనం చేయడం, ఫుడ్ డెలివరీలు ఆర్డర్ చేయడం 5-10 శాతం వరకు ఖరీదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్థలపై అదనపు భారం పడింది. ఇప్పటికే పశ్చిమ ఆసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ ధరల పెరుగుదల, గ్యాస్ కొరత, కార్మికుల లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 17 నగరాల్లో 50 అవుట్‌లెట్లు నిర్వహిస్తున్న కేఫే ఢిల్లీ హైట్స్ వ్యవస్థాపకుడు విక్రాంత్ బాత్రా మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుతో రవాణా, ప్యాకేజింగ్, ముడిసరుకు ఖర్చులు పెరుగుతాయ‌న్నారు. ధరలు పెంచడం తప్ప మాకు మరో మార్గం లేద‌ని అన్నారు. అలాగే ఉద్యోగుల జీవన వ్యయాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

వ‌చ్చే వారం నుంచే మార్పులు..

కొన్ని రెస్టారెంట్ చైన్‌లు వచ్చే వారం నుంచే మెనూ ధరల్లో మార్పులు చేయనున్నాయని, మరికొన్ని జూన్ లేదా జూలై నుంచి దశలవారీగా ధరలు పెంచే యోచనలో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, వావ్! మొమో సహ వ్యవస్థాపకుడు సాగర్ దర్యాని మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు ఎల్పీజీ ఖర్చులు దాదాపు 60 శాతం పెరిగిన పరిస్థితుల్లో ఏర్ప‌డింద‌ని అన్నారు. సాధారణంగా సెప్టెంబర్‌లో ధరలు పెంచుతామ‌ని, కానీ ఈసారి జూలై 1 నుంచే ధరలు పెంచక తప్పద‌ని చెప్పారు. ఇది దాదాపు నాలుగేళ్ల తర్వాత జరిగిన తొలి పెద్ద ఇంధన ధరల పెంపు కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కి చేరగా, డీజిల్ ధర రూ.90.67కు పెరిగింది.

డిస్కౌంట్ల‌కు కోత‌..

కైలిన్ రెస్టారెంట్ చైన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ ఖనిజో మాట్లాడుతూ మార్కెట్ ఇకపై మరిన్ని షాక్‌లను తట్టుకునే స్థితిలో లేదనిపిస్తోంద‌న్నారు. ముడిసరుకు ఖర్చులు పెరగడం ఖాయం అని అన్నారు. ఇక లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఫుడ్ డెలివరీ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని, కనీస ఆర్డర్ విలువలు తగ్గించడం, డిస్కౌంట్లు తగ్గించడం వంటి మార్పులు రావచ్చని ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్క్ ఫ్రం హోమ్‌కు పిలుపునివ్వడంతో ఇంటి నుంచే ఆహారం ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, బయట భోజనం చేసే వారి సంఖ్య తగ్గుతుందని రెస్టారెంట్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ లంచ్‌లు, టీమ్ డైనింగ్‌పై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో జొమాటో, స్విగ్గీ వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఛానల్ పార్ట్‌నర్ ఫీజులను మరింత పెంచితే లాభదాయకతను కాపాడుకోవడం రెస్టారెంట్ చైన్‌లకు కష్టమవుతుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

వినియోగ‌దారులు భ‌ర్తిస్తారా..?

అయితే ధరల పెంపు వినియోగదారుల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపకూడదనే ఆందోళన కూడా కంపెనీల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొంటున్న వినియోగదారులు మరిన్ని ధరల పెరుగుదలను ఎంతవరకు భరిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మాసివ్ రెస్టారెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జొరవర్ కల్రా మాట్లాడుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే మే నెల నుంచే కొంతమేర ధరల సవరణ తప్పనిసరి అవుతుంద‌న్నారు. అయితే బాధ్యతాయుతమైన రెస్టారెంట్ బ్రాండ్‌లు ముందుగా ఖర్చుల భారం కొంతవరకు తామే భరించేందుకు ప్రయత్నిస్తాయ‌ని చెప్పారు.

రోజుకు రూ.2,650 కోట్ల న‌ష్టం..

కాగా యుద్ధం కార‌ణంగా ఏర్ప‌డిన ఎల్‌పీజీ కొర‌త‌తో ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికే తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కు ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లు, ఫుడ్ చెయిన్‌లు, రెస్టారెంట్లు జూన్ నుంచి ధ‌ర‌ల‌ను పెంచాల‌ని ఆలోచిస్తున్నాయి. వినియోగ‌దారులు ఇప్ప‌టికే పెరిగిన ధ‌ర‌ల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఈ ప‌రిశ్ర‌మ కూడా ధ‌ర‌ల‌ను పెంచితే అప్పుడు వారు ఎలా స్పందిస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎన్ఆర్ఏఐ స‌ర్వే ప్ర‌కారం ఈ ప‌రిశ్ర‌మ గ‌త కొద్ది రోజులుగా రోజుకు సుమారుగా రూ.2,650 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను ఎదుర్కొంటోంద‌ని, నెల‌కు రూ.79వేల కోట్ల మేర న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని వెల్ల‌డైంది. అయితే ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గితే ధ‌ర‌ల పెంపు ఈ ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Advertisement
Advertisement