త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BV Raghavulu | పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం : బీవీ రాఘవులు

BV Raghavulu | హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

P

Telangana | Published On May 16, 2026, 7.25 pm IST

BV Raghavulu | పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై భారం : బీవీ రాఘవులు
Advertisement

BV Raghavulu | హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. “చెబుతున్న పొదుపు మంత్రంతో దేశాభివృద్ధి ఎలా సాధ్యం?” అని ప్రశ్నించిన ఆయన.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు నేరుగా సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ధ్వ‌జ‌మెత్తారు. గ్యాస్‌ ధరల పెంపుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, ఆ యుద్ధాన్ని ఆపే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాఘవులు సూచించారు. “యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని చెబుతూ, పొదుపు పేరుతో ప్రజలపై భారం వేయడం సరైంది కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గతంలో సూచించిన పొదుపు చర్యలను కూడా ఆయన ఎద్దేవా చేశారు. “యూరియా వాడకాన్ని తగ్గించండి, విదేశీ ప్రయాణాలు ఆపండి, బంగారం కొనకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి” వంటి సూచనలు దేశ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమా అని ఆయన ప్రశ్నించారు. ఉత్పత్తి దెబ్బతిన్న తర్వాత దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన నిలదీశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గ్యాస్‌ ధరల పెంపు ఇప్పటికే హోటల్ రంగాన్ని, హాస్టళ్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని అన్నారు.

ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య, పాలడుగు భాస్కర్‌, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్‌, సీనియర్‌ నేత డీజీ నర్సింహారావు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో నాయకులు “మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నశించాలి”, “పెంచిన ఇంధన ధరలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని, ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement