త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో మంగళవారం లిస్ట్ కానున్నాయి. దీపా జ్యువెలర్స్ ఐపీవో షేర్ అలాట్‌మెంట్ ప్రక్రియ శుక్రవారం సెప్టెంబర్ 4న పూర్తయింది. షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో సోమవారం షేర్లు జమ కానున్నాయి. షేర్లు అలాట్ కాని ఇన్వెస్టర్లకు కూడా ఇవాళే రీఫండ్ అందే అవకాశం ఉంది.

S

Business | Published On Sep 7, 2026, 5.34 pm IST

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు రేపే లిస్టింగ్.. ఐపీవోకు అదిరిపోయే స్పందన..
Advertisement

Deepa Jewellers IPO | దీపా జ్యువెలర్స్ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో మంగళవారం లిస్ట్ కానున్నాయి. దీపా జ్యువెలర్స్ ఐపీవో షేర్ అలాట్‌మెంట్ ప్రక్రియ శుక్రవారం సెప్టెంబర్ 4న పూర్తయింది. షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో సోమవారం షేర్లు జమ కానున్నాయి. షేర్లు అలాట్ కాని ఇన్వెస్టర్లకు కూడా ఇవాళే రీఫండ్ అందే అవకాశం ఉంది. ఆర్గనైజ్డ్ బీ2బీ డిజైనర్, ప్రాసెసర్, హాల్‌మార్క్ బంగారు ఆభరణాల సరఫరాదారు దీపా జ్యువెలర్స్ ఐపీవోను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచింది. బిడ్డింగ్ ముగిసే సమయానికి ఐపీవోకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం ఏకంగా 105.96 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోటా 37 రెట్లు బుక్ అయింది.

43 రెట్ల సబ్‌స్క్రిప్షన్..

రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 18.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీవో మూడో రోజు ముగిసే సమయానికి దీపా జ్యువెలర్స్ ఐపీవో మొత్తం సబ్‌స్క్రిప్షన్ 43 రెట్లుగా నమోదైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది. పబ్లిక్ ఇష్యూలో 50 శాతానికి మించకుండా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు, కనీసం 15 శాతం నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, కనీసం 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించారు. దీపా జ్యువెలర్స్ ఐపీవో ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.168 నుంచి రూ.177గా నిర్ణయించారు. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.2గా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 84 ఈక్విటీ షేర్లతో ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఆ తర్వాత 84 షేర్ల గుణిజాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. లిస్టింగ్‌కు ముందు దీపా జ్యువెలర్స్ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం బలమైన లిస్టింగ్‌కు సంకేతాలు ఇస్తోంది.

13 శాతం లాభం..

ప్రస్తుతం దీపా జ్యువెలర్స్ ఐపీవో జీఎంపీ రూ.23.50గా ఉంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్‌లోని గరిష్ఠ ధర రూ.177ను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియంతో అంచనా వేసిన లిస్టింగ్ ధర ఒక్కో షేరుకు రూ.200.50గా ఉంది. అంటే ఐపీవో ధరతో పోలిస్తే సుమారు 13.28 శాతం ప్రీమియంతో షేర్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. గత 13 సెషన్లలో నమోదైన గ్రే మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే ప్రస్తుత జీఎంపీ రూ.23.50గా ఉంది. ఈ సమయంలో జీఎంపీ కనిష్ఠంగా రూ.0 వద్ద, గరిష్ఠంగా రూ.55 వద్ద నమోదైంది. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా మాత్రమే లిస్టింగ్ పనితీరును అంచనా వేయడం సరికాదని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.250 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూతో పాటు 1.18 కోట్లకు పైగా షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంది.

రూ.177 గ‌రిష్ట ధ‌ర అయితే..

ఐపీవోలో షేర్లను గరిష్ఠ ధర రూ.177 వద్ద విక్రయించినట్లయితే, ఇష్యూ అనంతరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.1,700 కోట్లుగా ఉండనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనుంది. ఇందులో ఇన్వెంటరీ కొనుగోలు, నిర్వహణ, విస్తరణకు నిధులు కేటాయించనుంది. మిగిలిన మొత్తంలో కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఐపీవోకు బుక్‌-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది.

2016లో స్థాపించిన దీపా జ్యువెలర్స్ ఆర్గనైజ్డ్ బీ2బీ డిజైనర్, ప్రాసెసర్, హాల్‌మార్క్ బంగారు ఆభరణాల సరఫరాదారుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కంపెనీకి వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. కంపెనీ విభిన్న రకాల ఆభరణాలను అందిస్తోంది. వీటి డిజైన్, ప్రాసెసింగ్, విక్రయ కార్యకలాపాలకు ఔట్‌సోర్స్‌డ్ తయారీ విధానాన్ని ఉపయోగిస్తోంది. ఇందుకోసం నైపుణ్యం కలిగిన కళాకారులు, కారిగర్ల నెట్‌వర్క్‌పై కంపెనీ ఆధారపడుతోంది.

Advertisement
Advertisement