త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinders | మెట్రో న‌గ‌రాల్లో హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు క‌ష్ట‌కాలం.. వంట గ్యాస్ సిలిండ‌ర్ల కొర‌త‌..

LPG Cylinders | మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఏర్పడడంతో బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్ర‌ధాన‌ నగరాల్లో హోటల్, రెస్టారెంట్ రంగ సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆయిల్ రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది.

S

Business | Published On Mar 10, 2026, 9.34 am IST

LPG Cylinders | మెట్రో న‌గ‌రాల్లో హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు క‌ష్ట‌కాలం.. వంట గ్యాస్ సిలిండ‌ర్ల కొర‌త‌..
Advertisement

LPG Cylinders | మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఏర్పడడంతో బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్ర‌ధాన‌ నగరాల్లో హోటల్, రెస్టారెంట్ రంగ సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆయిల్ రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో కీలక ఇంధన రవాణా మార్గాల‌కు అంతరాయం ఏర్ప‌డ‌డంతో గత శనివారం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. గృహ వంట గ్యాస్ ధరలను రూ.60 పెంచగా, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.115 పెంచారు.

బెంగ‌ళూరులో హోట‌ల్స్ మూసేయాల్సిన ప‌రిస్థితి..

బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో.. నగరంలోని హోటల్, రెస్టారెంట్ కార్యకలాపాలు మార్చి 10 నుంచి ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. గ్యాస్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మంగ‌ళ‌వారం నుంచి హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అని అసోసియేషన్ తన ప్రకటనలో పేర్కొంది. హోటల్ పరిశ్రమ ఒక అత్యవసర సేవగా ఉండడంతో రోజువారీ భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే సాధారణ ప్రజలు, విద్యార్థులు, వైద్య రంగానికి చెందినవారు తీవ్రంగా ప్రభావితమవుతారు.. అని తెలిపింది. ఇదికాకుండా గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మా హోటల్ పరిశ్రమ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. అని పేర్కొంది. గ్యాస్ సరఫరా 70 రోజుల పాటు అంతరాయం లేకుండా ఉంటుందని ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా సరఫరా ఆగిపోవడం హోటల్ పరిశ్రమకు పెద్ద దెబ్బగా మారిందని అసోసియేషన్ పేర్కొంది. కాబట్టి ఈ విషయంలో సంబంధిత కేంద్ర మంత్రులు తక్షణ చర్యలు తీసుకుని వాణిజ్య గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి హోటల్ పరిశ్రమకు సహకారం అందించాలని మేం ఆశిస్తున్నాం.. అని ప్రకటనలో తెలిపింది.

చెన్నైలోనూ ప‌రిస్థితి తీవ్ర‌త‌రం..

ఇక చెన్నైలో పరిస్థితి మరింత తీవ్రత‌ర‌మైందని స్థానిక‌ హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో.. ఆహార పరిశ్రమ 24 గంటలూ పనిచేస్తూ అనేక ఆసుపత్రులకు సమయానికి ఆహారం సరఫరా చేస్తుంది. అదనంగా ఐటీ పార్కులు, కాలేజీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, రైలు ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులు కూడా వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోతే తీవ్రంగా ప్రభావితమవుతారు.. అని పేర్కొన్నారు. అలాగే అనేక స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించే బాంకెట్ బుకింగ్స్ కూడా ప్రభావితమవుతాయి. ఆహార పరిశ్రమకు వాణిజ్య ఎల్‌పీజీ తక్కువగా అందితే తమిళనాడులో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధారపడే సేవలు కూడా దెబ్బతింటాయి.. అని ఆయన తెలిపారు. ఆహార పరిశ్రమకు నిరంతర వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా కల్పించాలని ప్రధాని మోదీని కోరారు.

ముంబైలో 20 శాతం కార్య‌క‌లాపాల‌కు బ్రేక్‌..

ముంబైలో కూడా అతిథ్య రంగం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్ర‌త‌ర‌మైన‌ కారణంగా సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదర్, అంధేరి, మటుంగా వంటి ప్రాంతాల్లోని ప్రసిద్ధ హోటళ్లు ఇప్పటికే తమ మెనూలను తగ్గించడం ప్రారంభించాయి. దాల్ మఖానీ, రవ్వ‌ దోశ‌ వంటి ఎక్కువ సమయం పట్టే వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. మిగిలిన గ్యాస్ నిల్వలను ఆదా చేయడానికి హోటళ్లు తమ పని గంటలను కూడా తగ్గించాయి. ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) కూడా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది.

హాస్పిట‌ళ్లు, విద్యాసంస్థ‌ల‌కు ప్రాధాన్య‌త‌: పెట్రోలియం మంత్రిత్వ శాఖ

ఇక ఎల్‌పీజీ సరఫరాలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. అదనంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను గృహ వినియోగానికి మళ్లిస్తున్నామని పేర్కొంది. అలాగే నిల్వలు సేకరించడం, బ్లాక్ మార్కెట్‌ను నివారించేందుకు 25 రోజుల ఇంటర్-బుకింగ్ వ్యవధిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దిగుమతి చేసే ఎల్‌పీజీ నుంచి వచ్చే వాణిజ్య సరఫరాను ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యతగా అందిస్తున్నాం.. అని ఆ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో తెలిపింది. కాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. భారత్ ప్రస్తుతం సౌకర్యవంతమైన స్థితిలో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Advertisement
Advertisement