త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget 2026 | బడ్జెట్‌ తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా..?

Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా తొమ్మిదో సారి కావడం విశేషం. బడ్జెట్‌కు సమయం దగ్గరపడుతున్నది. దేశప్రజలంతా ఆర్థిక మంత్రి ఏం ప్రకటన చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

P

Business | Published On Jan 26, 2026, 12.05 pm IST

Budget 2026 | బడ్జెట్‌ తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా..?
Advertisement

Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా తొమ్మిదో సారి కావడం విశేషం. బడ్జెట్‌కు సమయం దగ్గరపడుతున్నది. దేశప్రజలంతా ఆర్థిక మంత్రి ఏం ప్రకటన చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ బడ్జెట్‌లో తమకు ఎలాంటి ఉపశమనాలు కల్పిస్తారోనని ఎదురుచూస్తున్నాయి. అయితే, పార్లమెంట్‌లో బడ్జెట్‌ తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? మరింత పెరుగుతాయా? అని తెలుసుకునేందుకు పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారు.

దిగుమతి సుంకాలు తగ్గించేనా..?

భారత్‌ పెద్ద ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో రిటైల్‌ మార్కెట్‌లో ధరల్లో దిగుమతి సుంకాలు కీలకపాత్ర పోషిస్తాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి ధరలపై సుంకాలను తగ్గిస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సుంకాలను పెంచితే ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. భారత్‌లో వాణిజ్య దిగుమతులపై ప్రస్తుతం దిగుమతి సుంకం 6శాతంగా ఉంది. ఇందులో 5శాతం ప్రైమరీ కస్టమ్స్‌ సుంకం, ఒకశాతం ఏఐడీ (వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి) విధిస్తుంది. దీనికి అదనంగా 3శాతం జీఎస్టీ సైతం వర్తిస్తుంది. గత బడ్జెట్‌ సమయంలో కేంద్రం గోల్డ్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు, చట్టబద్ధమైన దిగుముతలను ప్రోత్సహించేందుకు బంగారు దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు సైతం బంగారు ధరల మార్పులు కీలకపాత్ర పోషిస్తాయి. అమెరికా డాలర్‌ బలపడితే.. ప్రపంచ మార్కెట్‌లో బంగారు ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ధరలు దిగి వస్తాయి. రాబోయే రోజుల్లో డాలర్‌ బలపడితే భారత మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, పెట్టుబడిదారులు కేంద్ర బడ్జెట్ 2026 కోసం ఎదురుచూస్తున్నారు. బులియన్‌పై దిగుమతి సుంకాల తగ్గింపుల కోసం నిరీక్షిస్తున్నారు.

బంగారం, వెండి సరికొత్త రికార్డులు..

బంగారం ధరలు ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాలు, గ్రీన్‌లాండ్‌ అంశం, ఇరాన్‌లో నిరసనలు, అమెరికా బెదిరింపులతో పాటు పలు దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2024 సంవత్సరం చివరి నాటికి బంగారం ధర రూ.72,219గా ఉన్నది. అదే సంవత్సరం ప్రారంభంలో రూ.70,900 పలికింది. ఇక గతేడాది డిసెంబర్‌ చివరి నాటికి బంగారం ధర రూ.లక్ష దాటింది. ప్రస్తుతం బంగారం ధర రూ.1.57లక్షల వరకు చేరింది. 2024 డిసెంబర్‌ నుంచి చూస్తే బంగారం ధర దాదాపుగా 120శాతం పెరగడం గమనార్హం. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్‌ ఉండడంతో ధర విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. ఇక వెండి పట్టపగ్గాల్లేకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. 2024 డిసెంబర్‌ చివరి నాటికి కిలోకు రూ.1.88లక్షలు పలికిన బంగారం ప్రస్తుతం రూ.3.35లక్షలకు చేరింది. ఈ ఏడాది జనవరి నాటికి రూ.2.38లక్షలుగా ఉన్న ధర.. ప్రస్తుతం కిలోకు రూ3.40లక్షల వద్ద గరిష్టానికి చేరుకుంది. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement