త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bitcoin Scam | రూ.20వేల‌కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌.. డార్విన్ ల్యాబ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు అరెస్ట్‌..!

P

Business | Published On Apr 1, 2026, 4.44 pm IST

Bitcoin Scam | రూ.20వేల‌కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌.. డార్విన్ ల్యాబ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు అరెస్ట్‌..!
Advertisement

Bitcoin Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుమారు రూ.20వేల‌కోట్ల గెయిన్ బిట్‌కాయిన్ క్రిప్టో మోసంపై సీబీఐ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డార్విన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు ఆయుష్ వర్ష్నేని అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆయుష్‌పై ఇప్ప‌టికు లుక్ అవుట్ స‌ర్క్యుల‌ర్ జారీ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముంబ‌యి విమానాశ్రయంలో సోమవారం అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అధికారికంగా అరెస్ట్ చేశారు. సీబీఐ దర్యాప్తులో గెయిన్ బిట్‌కాయిన్ మోసానికి సంబంధించిన మొత్తం సాంకేతిక వ్యవస్థను డార్విన్ ల్యాబ్స్ రూపొందించినట్లు బయటపడింది.

ఈ సంస్థతో పాటు దాని సహ వ్యవస్థాపకులు ఆయుష్ వర్ష్నే, సహిల్ బఘ్లా, నికుంజ్ జైన్ పాత్రపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం నికుంజ్ జైన్ వామి ఏఐ సంస్థలో చీఫ్ క్యాపిటల్ ఆఫీసర్‌గా ఉన్నాడు. ఈ ముగ్గురు క‌లిసి ఎంక్యాప్ అనే క్రిప్టో టోకెన్‌ను రూపొందించి, దానికి సంబంధించిన ఈఆర్‌సీ-20 స్మార్ట్ కాంట్రాక్ట్‌ను అభివృద్ధి చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ టోకెన్‌ను మోసపూరిత పాంజీ స్కీమ్‌లో ఉపయోగించినట్లు గుర్తించింది. అలాగే, GBMiners.com అనే బిట్‌కాయిన్ మైనింగ్ ప్లాట్‌ఫాం, బిట్‌కాయిన్ పేమెంట్ గేట్‌వే, కాయిన్ బ్యాంక్ వాలెట్‌, అలాగే గెయిన్ బిట్‌కాయిన్ వెబ్‌సైట్ వంటి కీలక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సైతం డార్విన్ ల్యాబ్స్ రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది.

మోసం ఎలా జరిగింది?

ఈ గెయిన్ బిట్‌కాయిన్ స్కామ్ 2015లో వెయిర‌బుల్ టెక్ (VariableTech) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభమైంది. ఈ స్కీమ్‌కు ప్రధాన సూత్రధారులు అమిత్ భ‌రద్వాజ్ (మరణించాడు), అతని సోదరుడు అజయ్ భ‌రద్వాజ్‌గా గుర్తించారు. పెట్టుబడిదారులకు 18 నెలలపాటు ప్రతి నెల 10శాతం వరకు బిట్‌కాయిన్ రాబడులు ఇస్తామని హామీ ఇచ్చి వారిని ఆకర్షించారు. పెట్టుబడిదారులు బయట మార్కెట్ నుంచి బిట్‌కాయిన్ కొనుగోలు చేసి, గెయిన్ బిట్‌కాయిన్‌లోని క్లౌడ్ మైనింగ్ కాంట్రాక్ట్‌లో పెట్టుబడి పెట్టాలని చెప్పేవారు. ఇది మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) ఆధారిత పాంజీ స్కీమ్‌గా సీబీఐ తెలిపింది. కొత్త పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డబ్బులతో పాత పెట్టుబడిదారులకు లాభాలు చెల్లించేవారని పేర్కొంది.

ప్రారంభంలో లాభాలు వచ్చినట్లు కనిపించినా.. 2017 తర్వాత కొత్త పెట్టుబడులు తగ్గిపోవడంతో బిట్‌కాయిన్ బదులుగా ఎంక్యాప్ టోకెన్‌గా చెల్లింపులు చేయడం మొద‌లుపెట్టారు. ఈ టోకెన్ విలువ చాలా తక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ భారీ మోసం వెలుగులోకి రావడంతో జమ్మూ క‌శ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకు, ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ప‌లు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కేసు విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తూ, మోసంలో పాల్గొన్న వారందరినీ గుర్తించడం, విదేశాలకు మళ్లించిన నిధులను ట్రేస్ చేయడం వంటి చర్యలు చేపడుతోంది.

Advertisement
Advertisement