త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Conditioners | ఏసీల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. త్వ‌ర‌ప‌డండి..

Air Conditioners | ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు ఏసీల‌ ధరలను 5 నుంచి 15 శాతం వరకు పెంచ‌నున్నాయి. ముడి పదార్థాల ధరలు, స‌ప్లై చెయిన్‌ ఖర్చులు నిరంతరం పెరుగుతున్న కారణంగా ఈ ధరల పెంపు చేపడుతున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. వేస‌వి కాలం సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో కంపెనీలు ఏసీల ధ‌ర‌ల‌ను పెంచాయి.

S

Business | Published On Mar 8, 2026, 2.31 pm IST

Air Conditioners | ఏసీల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.. త్వ‌ర‌ప‌డండి..
Advertisement

Air Conditioners | ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు ఏసీల‌ ధరలను 5 నుంచి 15 శాతం వరకు పెంచ‌నున్నాయి. ముడి పదార్థాల ధరలు, స‌ప్లై చెయిన్‌ ఖర్చులు నిరంతరం పెరుగుతున్న కారణంగా ఈ ధరల పెంపు చేపడుతున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. వేస‌వి కాలం సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో కంపెనీలు ఏసీల ధ‌ర‌ల‌ను పెంచాయి. ప్ర‌స్తుతం ఏసీల‌కు డిమాండ్ పెరుగుతుంది క‌నుక ధ‌ర‌ల పెంపును అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. డైకిన్, వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్‌జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఏసీ మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాపర్ వంటి కీలక ముడి పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, కొత్త ఎనర్జీ ఎఫిషియ‌న్సీ నిబంధనలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని కంపెనీలు పేర్కొన్నాయి.

కార‌ణాలు ఇవే..

ధరల సవరణ తప్పనిసరి అయినప్పటికీ ఈ సంవత్సరం అమ్మకాలు బలంగా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే వేసవి కాలంలో కొత్త స్టార్ రేటింగ్ మోడళ్ల ద్వారా విద్యుత్ పొదుపు కూడా అమ్మకాల పెరుగుదలకు తోడ్పడుతుంద‌ని వారు తెలిపారు. డైకిన్ ఇండియా ఏప్రిల్ నుంచి గరిష్టంగా 12 శాతం వరకు ధరలు పెంచనుందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్‌జీత్ జావా పీటీఐకి తెలిపారు. ఈ ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతుందని ఆయన చెప్పారు. కొత్త ఎనర్జీ నిబంధనల వల్ల ఉత్పత్తులు మరింత సమర్థవంతంగా మారాయని అన్నారు. కాపర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ చరిత్రాత్మక స్థాయికి చేరడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల దిగుమతుల ఖర్చులు పెరిగాయని తెలిపారు. అందువల్ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని, పరిశ్రమలోని ప్రతి సంస్థ కూడా ధరలను పెంచ‌నున్నాయ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఈ ధరల పెంపు వల్ల ఈ ఏడాది రూమ్ ఎయిర్ కండిషనర్ అమ్మకాలపై ప్రభావం ఉంటుందా అని అడగ్గా.. 2026లో తీవ్రమైన వేసవి ఉండే అవకాశముంది. కనీసం 2024 స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఆ ఏడాది పరిశ్రమ రికార్డు స్థాయి అమ్మకాల‌ను నమోదు చేసింది. ఈ సంవత్సరం కనీసం 15 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం.. అని ఆయన చెప్పారు.

ఇంకా పాత స్టాక్ ఉంది..

బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ మాట్లాడుతూ సంస్థ ఇప్పటికే ఫిబ్రవరి మధ్యలోనే 8 నుంచి 10 శాతం వరకు ధరలను పెంచిందని తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో పాత ధరల స్టాక్ ఇంకా అందుబాటులో ఉందని, అందువల్ల వినియోగదారులకు పెద్దగా తేడా కనిపించడంలేదని ఆయన చెప్పారు. ధరలు పెరగబోతున్నాయని ముందుగానే తెలిసినందున డీలర్లు ముందుగానే పెద్ద మొత్తంలో స్టాక్ కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు అదే పాత ధరల స్టాక్‌ను విక్రయిస్తున్నారు.. అని ఆయన పేర్కొన్నారు. కొత్త ధరలతో వచ్చిన ఉత్పత్తులు మార్కెట్‌కు చేరడానికి కొంత సమయం పడుతుందని కూడా తెలిపారు.

మారిన BEE స్టార్ రేటింగ్ విధానం..

కాగా టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ సంస్థ కూడా రూమ్ ఎయిర్ కండిషనర్ల ధరలను 5 నుంచి 15 శాతం వరకు పెంచ‌నుంది. ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్ ఇండియా త‌మ ఏసీ మోడ‌ల్స్ పై 7 నుంచి 10 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు పెంచిన‌ట్లు తెలిపింది. అలాగే హైయ‌ర్ ఇండియా కూడా 5 నుంచి 8 శాతం వ‌ర‌కు ఏసీల ధ‌ర‌ల‌ను పెంచింది. ఇక ఈ సంవత్సరం జ‌న‌వ‌రి 1 నుంచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ రూమ్ ఎయిర్ కండిషనర్లు అంత‌కు ముందు మోడళ్లతో పోలిస్తే 10 శాతం ఎక్కువ విద్యుత్ ను ఆదా చేస్తాయి.

Advertisement
Advertisement