త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI In Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్ రంగంలో పెను సంచ‌ల‌నం.. దూసుకువ‌స్తున్న ఏఐ.. దీని స‌హాయంతో అధిక రిట‌ర్న్స్ పొంద‌వ‌చ్చు..

AI In Mutual Funds | స్టాక్ మార్కెట్ల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏయే ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలి, ఈక్విటీలు, డెట్, క‌మోడిటీల్లో ఎంత శాతం పెట్టుబ‌డుల‌ను ఉంచాలి.. వంటి విష‌యాల‌ను సాధార‌ణంగా మ్యుచువ‌ల్ ఫండ్ మేనేజ‌ర్స్ ప‌ర్య‌వేక్షిస్తుంటారు.

S

Business | Published On May 3, 2026, 11.22 am IST

AI In Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్ రంగంలో పెను సంచ‌ల‌నం.. దూసుకువ‌స్తున్న ఏఐ.. దీని స‌హాయంతో అధిక రిట‌ర్న్స్ పొంద‌వ‌చ్చు..
Advertisement

AI In Mutual Funds | స్టాక్ మార్కెట్ల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏయే ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలి, ఈక్విటీలు, డెట్, క‌మోడిటీల్లో ఎంత శాతం పెట్టుబ‌డుల‌ను ఉంచాలి.. వంటి విష‌యాల‌ను సాధార‌ణంగా మ్యుచువ‌ల్ ఫండ్ మేనేజ‌ర్స్ ప‌ర్య‌వేక్షిస్తుంటారు. అయితే మ‌నుషుల‌కు ఉండే అత్యాశ, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో కొన్ని సార్లు పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. కానీ ఏఐ అలా కాదు. అది డేటాను న‌మ్ముతుంది. మార్కెట్ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తుంది. పెట్టుబ‌డిదారుల‌కు ఏయే ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలో సూచిస్తుంది. అవ‌స‌రం అయితే మేనేజ్ చేస్తుంది కూడా. త్వ‌ర‌లోనే ఇలా ఏఐ మోడ‌ల్స్‌ మ్యుచువ‌ల్ ఫండ్స్ రంగంలోనూ సేవ‌లు అందించ‌నున్నాయి. దీని వ‌ల్ల మ‌నుషుల ప్ర‌మేయం ఉండ‌దు. అనేక వివ‌రాల‌ను, అల్గారిథ‌మ్‌ల‌ను, విశ్లేష‌ణ‌ల‌ను క్ష‌ణాల్లో పూర్తి చేసి ఏయే ఫండ్స్‌లో పెట్టాలో సూచించ‌డ‌మే కాకుండా, పెట్టుబ‌డిదారుల‌కు చెందిన ఖాతాల‌ను కూడా ఆటోమేటిగ్గా నిర్వ‌హిస్తుంది. ఈ టెక్నాల‌జీ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ, ఏఐ నిజంగానే మ్యుచువ‌ల్ ఫండ్ ఖాతాల‌ను నిర్వ‌హిస్తుందా.. అని చాలా మందికి సందేహం వ‌స్తుంది. కానీ ఇది నిజ‌మేన‌ని ఆల్ఫాగ్రెప్ అనే సంస్థ‌ చెబుతోంది. త్వర‌లోనే తాము ఈ టెక్నాల‌జీని భార‌త పెట్టుబ‌డిదారుల కోసం ప్ర‌త్యేకంగా అందుబాటులోకి తేనున్నామ‌ని వెల్ల‌డించింది.

16 సంవ‌త్స‌రాల డేటా సైన్స్ అనుభ‌వం..

గ్లోబల్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఆల్ఫాగ్రెప్ భారత మార్కెట్‌లో కీలక ముందడుగు వేసింది. సంస్థకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ ఇప్ప‌టికే అధికారికంగా లభించ‌గా, సంస్థ రిటైల్ అసెట్ మేనేజ్‌మెంట్ రంగంలో ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. 16 సంవత్సరాల డేటా సైన్స్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ అనుభవాన్ని భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆల్ఫాగ్రెప్ మ్యూచువల్ ఫండ్ పనిచేయనుంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. త్వరలోనే తన మొదటి న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) విడుదల చేయాలని భావిస్తోంది. ఇవి ముఖ్యంగా సిస్టమాటిక్ ఈక్విటీ స్ట్రాటజీలు, రూల్స్ ఆధారిత హైబ్రిడ్ ఉత్పత్తులపై దృష్టి సారించనున్నాయి.

అంద‌రికీ అందుబాటులో ఉండాలి: భౌతిక్ అంబానీ

ఈ మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి ఆల్ఫాగ్రెప్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సీఈవో భౌతిక్ అంబానీ నాయకత్వం వహించనున్నారు. దేశీయ అసెట్ మేనేజ్‌మెంట్ విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించ‌నున్న‌ట్లు సంస్థ పేర్కొంది. త‌మ‌ మ్యూచువల్ ఫండ్ ఆఫరింగ్స్ ఇన్వెస్టింగ్ ఇంజినీర్డ్ కాన్సెప్ట్‌తో ఉంటాయని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. మానవ అనుభవాన్ని యంత్రాల క‌చ్చితత్వంతో కలిపి పెట్టుబడులను రూపొందిస్తామ‌ని, సెబీ ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంఎఫ్‌డీ కమ్యూనిటీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామ‌ని, క్వాంటిటేటివ్ ఇన్వెస్టింగ్ కేవలం ఎలైట్‌కు మాత్రమే కాదు, డేటా ఆధారిత భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల‌ని భౌతిక్ అంబానీ పేర్కొన్నారు.

ఏఐతో మ్యుచువ‌ల్ ఫండ్స్ నిర్వ‌హ‌ణ‌..

ఇప్పటివరకు ప్రధానంగా సంస్థాగత పెట్టుబడిదారులు, అధిక సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆధునిక ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్‌ను రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా అందించాలని ఆల్ఫాగ్రెప్ మ్యూచువల్ ఫండ్ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. 2010లో ప్రారంభమైన ఆల్ఫాగ్రెప్ చిన్న స్థాయి క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థగా ప్రారంభమై, ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో రూ.8,500 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థగా ఎదిగింది. దేశీయ ఎక్స్చేంజ్‌లలో ట్రేడింగ్ వాల్యూమ్ పరంగా కూడా ఇది ప్రధాన భాగస్వామిగా నిలిచింది. ఆల్ఫాగ్రెప్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏజీఐఎం) కింద మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సంస్థ ఇప్పటికే స్పెషలైజ్డ్ ఏఐఎఫ్, పీఎంఎస్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రూ.2వేల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. గిఫ్ట్ సిటీ వంటి కేంద్రాల్లో కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొత్త మ్యూచువల్ ఫండ్ విభాగం క్వాంట్ ఆధారిత ఈక్విటీ, హైబ్రిడ్ స్ట్రాటజీలపై, అడ్వాన్స్‌డ్ మ్యాథమేటికల్ మోడల్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాయంతో దృష్టి సారించనుంది.

భ‌యం, ఆందోళ‌న ఉండ‌వు..

16 సంవత్సరాల క్రితం మార్కెట్లను మేథమెటిక్స్, టెక్నాలజీ ద్వారా మెరుగ్గా అర్థం చేసుకోవచ్చనే విశ్వాసంతో సంస్థ‌ను ప్రారంభించామ‌ని సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహిత్ ముత్రేజా తెలిపారు. ఈ లైసెన్స్ త‌మ‌ ప్రయాణంలో కీలక ఘట్టమ‌ని, ఇప్పుడు ఆ అవకాశాన్ని ప్రతి భారతీయ ఇన్వెస్టర్‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇది కేవలం ఫండ్ ప్రారంభం మాత్రమే కాద‌ని, సంపదను శాస్త్రీయంగా పెంచుకునే కొత్త మార్గం అని తెలిపారు. కాగా ఆల్ఫాగ్రెప్ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సంప‌న్నులు, సంస్థాగ‌త పెట్టుబ‌డిదారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న అధునాత‌న క్వాంట్ స్ట్రాట‌జీల‌ను సామాన్యుల‌కు సైతం అందుబాటులోకి తేనుంది. దీని వ‌ల్ల మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను మొత్తం ఏఐ నిర్వ‌హిస్తుంది. మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అన్ని వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి విశ్లేషించ‌డంతోపాటు ఏ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలి, ఎంత శాతం పెట్టాలి అనే వివ‌రాల‌ను పెట్టుబ‌డిదారుల‌కు స‌మగ్రంగా అందిస్తుంది. దీని వ‌ల్ల మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడితే స‌హ‌జంగానే వ‌చ్చే భ‌యాలు, ఆందోళ‌న‌లు ఉండ‌వు.

ఫండ్ లాంచింగ్‌కు ఆల్ఫాగ్రెప్ స‌న్నాహాలు..

మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడితే వాటిని ఫండ్ మేనేజ‌ర్ త‌న అనుభ‌వం లేదా న‌మ్మ‌కంతో షేర్ల‌ను కొనుగోలు చేస్తారు. కానీ ఆల్ఫాగ్రెప్ తీసుకొస్తున్న ఏఐ, క్వాంట్ విధానాల ద్వారా మ‌నుషుల అభిప్రాయాల క‌న్నా డేటా, అల్గారిథంలు, విశ్లేష‌ణ‌లే కీల‌క‌పాత్ర పోషిస్తాయి. దీని వ‌ల్ల మ‌నుషుల్లో స‌హ‌జంగానే ఉండే భ‌యం, ఆందోళ‌న‌, అత్యాశ వంటి తప్పుల‌కు ఆస్కారం ఉండ‌దు. క‌చ్చిత‌మైన గణాంకాల ఆధారంగానే పెట్టుబ‌డుల నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇక ఆల్ఫాగ్రెప్ కు ఇప్ప‌టికే సెబీ అనుమ‌తులు ఉన్నందున త్వ‌ర‌లోనే వీరు త‌మ మొద‌టి ఫండ్‌ను లాంచ్ చేయ‌నున్నారు. డైన‌మిక్ మ‌ల్టీ అసెట్ అలొకేష‌న్ ఫండ్‌ను లాంచ్ చేయాల‌ని ఆల్ఫాగ్రెప్ ఆలోచిస్తోంది. ఇది కేవ‌లం ఈక్విటీల్లోనే కాకుండా డెట్‌, క‌మోడిటీల‌లోనూ పెట్టుబ‌డులు పెడుతుంది. మార్కెట్ ఒడిదుడుకుల‌ను బ‌ట్టి ఏ స‌మ‌యంలో ఎందులో ఎంత పెట్టుబ‌డి పెట్టాలో కూడా ఏఐ మోడ‌ల్స్ నిర్ణ‌యం తీసుకుంటాయి. దీని వ‌ల్ల పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

సంప‌న్నుల‌కు మాత్ర‌మే ఉన్నాయి..

ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఇలాంటి క్వాంట్‌, ఏఐ మోడ‌ల్స్‌ను వాడుతున్న‌విగా బ్లాక్ రాక్ వంటి సంస్థ‌లు పేరుగాంచాయి. కానీ ఈ సంస్థ‌లు కేవ‌లం బిలియ‌నీర్ల‌కే సేవ‌ల‌ను అందిస్తాయి. సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌వు. అందువ‌ల్లే ఆల్ఫాగ్రెప్ ఈ రంగంలో ముందుగా త‌న తొలి అడుగు వేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక త‌మ ల‌క్ష్యం ఫండ్ డిస్ట్రిబ్యూష‌న్‌ను పెంచుకోవ‌డం కాద‌ని, ఇన్వెస్ట‌ర్ల‌కు న‌మ్మ‌కం క‌లిగించాల‌ని, అధునాత‌న ఏఐ మోడ‌ల్స్‌ను సామాన్యుల‌కు అందుబాటులోకి తేవాల‌ని చూస్తున్నామ‌ని భౌతిక్ అంబానీ తెలిపారు. ప్ర‌స్తుతం భార‌త మార్కెట్ల‌లో లిక్విడిటీ బాగుంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఫండ‌మెంట‌ల్స్ విష‌యంలో చాలా మంది జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేద‌ని, అయితే త‌మ ఏఐ మోడ‌ల్స్ ఈ విష‌యాల‌ను పెట్టుబ‌డిదారుల‌కు తెలియ‌జేస్తాయ‌ని అన్నారు.

రాబోయే 3-5 ఏళ్లు కీల‌కం..

సాధార‌ణంగా స్టాక్స్‌ను ఎంపిక చేయ‌డం లేదా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం అంటే ఎంత ఫండ్ మేనేజ‌ర్లు, ఆర్థిక నిపుణుల‌కు అయినా స‌రే కొన్ని సార్లు అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. స‌రిగ్గా అదే విష‌యంలో ఏఐ న‌మ్మ‌కంగా ప‌నిచేస్తుంది. డేటా, అల్గారిథం, విశ్లేషణ ఆధారంగా స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటుంది. దీని వ‌ల్ల పెట్టుబ‌డిదారులకు త‌మ డ‌బ్బు ప‌ట్ల ఆందోళ‌న ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే రాబోయే 3-5 ఏళ్ల‌లో భార‌త్‌లో ఏఐ మోడ‌ల్ ఆధారిత పెట్టుబ‌డులకు కూడా గ‌ణ‌నీయ‌మైన ఆద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏఐ ఆధారిత మ్యుచువ‌ల్ ఫండ్స్ గురించి పెట్టుబ‌డిదారులు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెలుసుకోవాల‌ని, ఈ విష‌యంలో అప్‌డేటెడ్‌గా ఉండాల‌ని వారు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement