త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adani Group | గూగుల్‌కు పోటీగా అదానీ భారీ ప్లాన్.. ఒడిశాలో రూ.1 లక్ష కోట్ల ఏఐ డేటా సెంటర్..

Adani Group | దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మౌలిక సదుపాయాల విస్తరణ వేగంగా జరుగుతున్న వేళ, అదానీ గ్రూప్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒడిశాలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

S

Business | Published On Aug 5, 2026, 2.19 pm IST

Adani Group | గూగుల్‌కు పోటీగా అదానీ భారీ ప్లాన్.. ఒడిశాలో రూ.1 లక్ష కోట్ల ఏఐ డేటా సెంటర్..
Advertisement

Adani Group | దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మౌలిక సదుపాయాల విస్తరణ వేగంగా జరుగుతున్న వేళ, అదానీ గ్రూప్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒడిశాలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, దేశంలో ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒడిశా కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ప్రతిపాదించిన 1 గిగావాట్ (జీడబ్ల్యూ) ఏఐ డేటా సెంటర్ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది.

ప‌రిశీలిస్తున్న ఒడిశా ప్ర‌భుత్వం..

ప్రస్తుతం అదానీ గ్రూప్ ప్రతిపాదనను ఒడిశా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోంది. భూమి లభ్యత, విద్యుత్ సరఫరా, నీటి వనరులు, రవాణా, కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కటక్ (కటక) ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పటికీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. అదానీ గ్రూప్ ఇప్పటికే 2035 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ డేటా సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం స్వీడన్‌కు చెందిన ఈక్యూటీ యాజమాన్యంలోని ఎడ్జ్‌కానెక్స్‌తో సంయుక్త భాగస్వామ్యంలో చెన్నైలో ఒక డేటా సెంటర్‌ను నిర్వహిస్తుండగా, ముంబై, పుణె, హైదరాబాద్‌లలో కూడా కొత్త కేంద్రాలను అభివృద్ధి చేస్తోంది. అయితే ఒడిశాలో ప్రతిపాదించిన ఏఐ డేటా సెంటర్‌ను సంయుక్త భాగస్వామ్యం కాకుండా పూర్తిగా అదానీ గ్రూప్ స్వతంత్రంగా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలు కూడా కోరినట్లు సమాచారం. అన్ని అంశాల‌ను పరిశీలించి, ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి క్లియరెన్స్ అథారిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచనున్నారు.

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్న ఒడిశా..

ఏఐ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. గతంలో ప్రధానంగా లోహాలు, ఖనిజాలు, గనుల రంగాల్లో పెట్టుబడులను పొందిన ఒడిశా, ఇప్పుడు డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. భూమి లభ్యత, విద్యుత్ సామర్థ్యం, తూర్పు తీర ప్రాంత కనెక్టివిటీ, అనుకూల ప్రభుత్వ విధానాలను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఒడిశాలో ఇప్పటికే పలు డేటా సెంటర్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.169 కోట్లతో నిర్మిస్తున్న డేటా సెంటర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.266.48 కోట్లతో కొత్త తరం డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. అదానీ గ్రూప్ ఇప్పటికే రూ.800 కోట్ల పెట్టుబడితో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జోహో కార్పొరేషన్ తూర్పు భారత్‌లో తన తొలి ప్రధాన డేటా సెంటర్‌ను ఖోర్దాలో రూ.306 కోట్లతో నిర్మిస్తోంది.

ఏఐ డేటా సెంట‌ర్ల నిర్మాణంలో పోటీ..

ఇటీవల హెచ్‌సీఎల్‌టెక్, స‌ర్వమ్ సంస్థ, ఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న సావరిన్ ఏఐ పార్క్‌లో రూ.14,257 కోట్ల వ్యయంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదానీ తాజా ప్రతిపాదన దేశంలో హైపర్‌స్కేల్ ఏఐ కంప్యూటింగ్ రంగంలో పోటీ మరింత పెరుగుతున్నట్లు సూచిస్తోంది. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు, డేటా ఆధారిత పరిశ్రమలకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారతీయ కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల అంచనా పెట్టుబడితో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ను నిర్మిస్తోంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడితో గిగాస్కేల్ ఏఐ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనుండగా, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 856 ఎకరాల భూమిని కేటాయించింది.

Advertisement
Advertisement