Gold Recycling | భారతీయుల కొత్త ట్రెండ్.. బంగారాన్ని అమ్మడం లేదు..
Gold Recycling | భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం విలువ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా పెరిగినా, దానిని నగదుగా అమ్మే వారి సంఖ్య మాత్రం తగ్గుతోంది. పాత బంగారాన్ని విక్రయించి నగదు పొందే గోల్డ్ రీసైక్లింగ్ ప్రక్రియ జూన్ త్రైమాసికంలో దాదాపు 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది.
Gold Recycling | భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం విలువ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా పెరిగినా, దానిని నగదుగా అమ్మే వారి సంఖ్య మాత్రం తగ్గుతోంది. పాత బంగారాన్ని విక్రయించి నగదు పొందే గోల్డ్ రీసైక్లింగ్ ప్రక్రియ జూన్ త్రైమాసికంలో దాదాపు 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో దేశీయంగా బంగారం ధరలు ఏడాది కాలంలో సుమారు 60 శాతం పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు భారీగా పెరిగితే ప్రజలు పాత నగలను విక్రయించి లాభాలను పొందేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే భారత్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు తమ బంగారాన్ని నేరుగా విక్రయించడానికి ఆసక్తి చూపకుండా, పాత నగలను కొత్త నగలతో మార్పిడి చేసుకోవడం, బంగారంపై రుణాలు తీసుకోవడం లేదా ధరలు ఇంకా పెరుగుతాయని భావించి వాటిని అలాగే ఉంచడాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
భారీగా తగ్గిన గోల్డ్ రీసైక్లింగ్..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపిన ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్లో నికర గోల్డ్ రీసైక్లింగ్ 19 టన్నులకు తగ్గింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 38 శాతం, గతేడాదితో పోలిస్తే 17 శాతం తగ్గుదల కావడం గమనార్హం. గత 11 త్రైమాసికాల్లో ఇదే అత్యల్ప స్థాయి. దేశీయ బంగారం ధరలు ఏడాది క్రితం కంటే సుమారు 60 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదల నమోదైంది. గోల్డ్ రీసైక్లింగ్ అంటే ఇప్పటికే బంగారం ఉన్న యజమానులు తమ పాత నగలు, బంగారు నాణేలు లేదా ఇతర బంగారు వస్తువులను నగదు కోసం జ్యువెలర్లకు, రిఫైనర్లకు లేదా ఇతర మార్కెట్ సంస్థలకు విక్రయిస్తారు. ఈ బంగారాన్ని మళ్లీ శుద్ధి చేసి బులియన్గా లేదా కొత్త నగల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఇది గోల్డ్ ఎక్స్ఛేంజ్కు భిన్నం. ఒక వినియోగదారు పాత హారాన్ని జ్యువెలర్కు ఇచ్చి దాని విలువను కొత్త హారం కొనుగోలుకు వినియోగిస్తే, దాన్ని రీసైక్లింగ్గా కాకుండా ఎక్స్ఛేంజ్గా పరిగణిస్తారు. ప్రస్తుతం కొత్త నగలు కొనుగోలు చేసే సమయంలో ఖర్చు తగ్గించుకునేందుకు ఎక్స్ఛేంజ్ పథకాలు భారతీయుల్లో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

విలువ ఇంకా పెరుగుతుందని..
ధరలు 60 శాతం పెరిగినా ప్రజలు బంగారాన్ని విక్రయించకపోవడం భవిష్యత్తులో ఇంకా విలువ పెరుగుతుందనే నమ్మకాన్ని సూచిస్తోందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ఇప్పటికే మంచి లాభం వచ్చినా, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని భావించి చాలామంది తమ బంగారాన్ని అలాగే ఉంచుతున్నారు. భారతీయ కుటుంబాలకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆర్థిక భద్రత కూడా. అందుకే నగలను అమ్మేయకుండా, వాటిని తాకట్టు పెట్టి అవసరమైన నిధులను సమకూర్చుకునే ధోరణి పెరుగుతోంది. బంగారంపై రుణాల మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మే చివరి నాటికి బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న రిటైల్ గోల్డ్ లోన్లు సుమారు రూ.5.1 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 105 శాతం పెరుగుదల కాగా అదే సమయంలో ఎన్బీఎఫ్సీల వద్ద గోల్డ్ లోన్లు సుమారు రూ.3.3 లక్షల కోట్లకు చేరుకుని 70 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
పెరుగుతున్న లోన్లు..
డబ్ల్యూజీసీ జూలై చివరలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం భారతీయ కుటుంబాలు తమ బంగారం విలువను ఉపయోగించుకునే ప్రధాన మార్గంగా మారుతోంది. మార్చి నాటికి బ్యాంకుల లోన్-టు-వాల్యూ నిష్పత్తి సుమారు 55 శాతం, ఎన్బీఎఫ్సీలది 60 శాతం ఉండటంతో బంగారం ధరలు కొంత తగ్గినా రక్షణ ఉంటుంది. అయితే ధరలు దీర్ఘకాలం తగ్గితే రుణాల చెల్లింపుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ బరువు, తక్కువ క్యారెట్ నగలను ఎంచుకుంటున్నారు. పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కొత్త నగల ఖర్చును తగ్గించుకుంటున్నారు. రిటైలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ లావాదేవీలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. కొన్ని జ్యువెలరీ దుకాణాల్లో మొత్తం విక్రయాల్లో 70 శాతం వరకు ఎక్స్ఛేంజ్ చేసిన బంగారం ద్వారానే జరుగుతున్నాయి.
ఎక్స్ఛేంజ్లే అధికం..
12 మెట్రో, టియర్ 1 నగరాల్లో 1,963 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో, తక్కువ బరువు నగలు, తక్కువ క్యారెట్ ఆభరణాలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, సేవింగ్స్ స్కీములు, ఈఎంఐల ద్వారా కొనుగోళ్లు పెరుగుతున్నట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది. కొనుగోలు చేసే ముందు ధరలు, డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, చెల్లింపు విధానాలను పోల్చి చూసే అలవాటు కూడా పెరుగుతోంది. అలాగే దేశంలో బంగారం సరఫరా కూడా తగ్గింది. రెండో త్రైమాసికంలో మొత్తం సరఫరా 120 టన్నులకు చేరి ఆరేళ్ల కనిష్ట స్థాయిలో నిలిచింది. నికర బులియన్ దిగుమతులు 98 టన్నులుగా నమోదై, గతేడాదితో పోలిస్తే 22 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 53 శాతం తగ్గాయి. అక్షయ తృతీయ డిమాండ్ కారణంగా ఏప్రిల్లో దిగుమతులు బాగానే ఉన్నప్పటికీ, దిగుమతి సుంకం పెరిగిన తర్వాత మే, జూన్ నెలల్లో అవి తగ్గాయి. అయితే తక్కువ దిగుమతులు దేశంలో బంగారం కొరతను సూచించడం కాదని డబ్ల్యూజీసీ స్పష్టం చేసింది. తగ్గిన డిమాండ్, ఇప్పటికే ఉన్న నిల్వలు, రీసైకిల్ చేసిన బంగారం వల్ల అవసరాలు తీరాయని పేర్కొంది. రెండో త్రైమాసికంలో మొత్తం సరఫరాలో 82 శాతం దిగుమతుల నుంచి, 16 శాతం రీసైక్లింగ్ నుంచి, 2 శాతం దేశీయ గనుల ఉత్పత్తి నుంచి వచ్చింది.

పెరిగిన అక్రమ దిగుమతులు..
దిగుమతి సుంకాలు పెరగడంతో అక్రమంగా బంగారం దేశంలోకి వచ్చే ప్రవాహం కూడా పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత కార్యకలాపాల సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ 15 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీల కలయికతో అధికారిక, అనధికారిక దిగుమతుల మధ్య భారీ ధర వ్యత్యాసం ఏర్పడిందని రాయిటర్స్కు తెలిపారు. ఈ ధరల తేడా అక్రమ దిగుమతులకు పెద్ద ప్రోత్సాహకంగా మారిందని చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే 13 నుంచి జూన్ 30 మధ్య నిఘా సంస్థలు 160.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, ఏప్రిల్ 1 నుంచి మే 12 మధ్య 86.16 కిలోలు మాత్రమే పట్టుబడింది. గోల్డ్ రీసైక్లింగ్ తగ్గడం వల్ల, ధరలు పెరగడం ఒక్కటే భారతీయులను బంగారం అమ్మేలా చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. నగలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం, పాత నగలను కొత్త వాటితో మార్పిడి చేసుకోవడం లేదా దీర్ఘకాల పెట్టుబడిగా బంగారాన్ని అలాగే ఉంచుకోవడం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
తగ్గిన డిమాండ్..
ఈ మార్పు మొత్తం బంగారం డిమాండ్లో కూడా కనిపిస్తోంది. రెండో త్రైమాసికంలో భారత బంగారం డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 6 శాతం తగ్గి 131 టన్నులకు చేరినా, మొత్తం ఖర్చు మాత్రం 35 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.979 లక్షల కోట్లకు చేరిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. ప్రస్తుతం భారతీయులు బంగారాన్ని నేరుగా నగదుగా విక్రయించడం కంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం, తాకట్టు పెట్టి రుణాలు పొందడం లేదా భవిష్యత్తు కోసం నిల్వగా ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..
ఆగస్టు 8, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
ఆగస్టు 7, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు పెరిగిన పసిడి ధర.. మళ్లీ రెక్కలు..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Damodar Raja Narasimha | మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభానికి సిద్ధం : మంత్రి దామోదర
- ●Ramchander Rao | 'సర్'లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు
- ●Bengaluru | ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం.. ఏడాది క్రితమే మృతి
- ●CP Sajjanar | అమ్మాయిలూ.. రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్లతో వల.. తస్మాత్ జాగ్రత్త!
- ●KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్కు ఆహ్వానం
- ●Anil Kumar Eravathri | కేటీఆర్కు హాఫ్ నాలెడ్జ్..

Damodar Raja Narasimha | మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభానికి సిద్ధం : మంత్రి దామోదర

Ramchander Rao | 'సర్'లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు

Bengaluru | ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం.. ఏడాది క్రితమే మృతి

CP Sajjanar | అమ్మాయిలూ.. రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్లతో వల.. తస్మాత్ జాగ్రత్త!



