త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. త‌స్మాత్‌ జాగ్రత్త!

CP Sajjanar | ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో.. అంటూ సైబ‌ర్ కేటుగాళ్లు స‌రికొత్త ఎత్తుగ‌డ వేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్ పోస్ట‌ర్ల‌తో వ‌ల వేస్తున్నారు. అయితే ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంద‌ని.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫ‌ర్ల చిక్కులో ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు.

S

Telangana | Published On Aug 8, 2026, 3.12 pm IST

CP Sajjanar | అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. త‌స్మాత్‌ జాగ్రత్త!
Advertisement
  • 50 శాతం డిస్కౌంట్ పేరిట‌ సైబ‌ర్ కేటుగాళ్ల ఎత్తుగ‌డ‌
  • అంద‌మైన అబ్బాయిల ఫొటోల‌తో నెట్టింట ప్ర‌చారం
  • యువ‌తులు, తల్లిదండ్రులు అప్ర‌మత్తంగా ఉండాలి
  • ఎక్స్ వేదిక‌గా హైద‌రాబాద్‌ సీపీ స‌జ్జ‌నార్ సూచ‌నలు

CP Sajjanar | త్రినేత్ర‌.న్యూస్‌: ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో.. అంటూ సైబ‌ర్ కేటుగాళ్లు స‌రికొత్త ఎత్తుగ‌డ వేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్ పోస్ట‌ర్ల‌తో వ‌ల వేస్తున్నారు. అయితే ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంద‌ని.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫ‌ర్ల చిక్కులో ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న‌ కొత్త డేటింగ్ ట్రాప్ ఇదేన‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు.

ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా "1st August Special- 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫొటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ.1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ కేటుగాళ్లు పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని అడుగుతారు అని సీపీ వివ‌రించారు.

ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన అంద‌మైన‌ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో మాటలు క‌లుపుతారు. ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలూ ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఫోక‌స్ పెట్టింది. వీటికి బాధ్యులైన వారిపై వేగంగా దర్యాప్తు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది అని సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు.

కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్, వారిని కలవడం వంటివి చేయొద్దు. ముందస్తుగా రూపాయి కూడా చెల్లించొద్దు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి అని స‌జ్జ‌నార్ సూచించారు.

Advertisement
Advertisement