త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Act 2025 | రూ.2 లక్షల నగదు తీసుకుంటే జాగ్రత్త.. కొత్త ఆదాయ పన్ను చట్టంలో కఠిన నిబంధనలు..

Income Tax Act 2025 | దేశంలో పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా ఆదాయ పన్ను చట్టం-2025లో నగదు లావాదేవీలపై కఠిన పరిమితులను అమలు చేశారు. నగదు స్వీకరణ, రుణాల లావాదేవీలు, వ్యాపార చెల్లింపులు, విరాళాలు, ఆస్తుల కొనుగోలు వంటి అనేక అంశాల్లో నిర్ణయించిన పరిమితులను మించితే పన్ను పరమైన ఇబ్బందులు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

S

Business | Published On Jul 9, 2026, 12.10 pm IST

Income Tax Act 2025 | రూ.2 లక్షల నగదు తీసుకుంటే జాగ్రత్త.. కొత్త ఆదాయ పన్ను చట్టంలో కఠిన నిబంధనలు..
Advertisement

Income Tax Act 2025 | దేశంలో పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా ఆదాయ పన్ను చట్టం-2025లో నగదు లావాదేవీలపై కఠిన పరిమితులను అమలు చేశారు. నగదు స్వీకరణ, రుణాల లావాదేవీలు, వ్యాపార చెల్లింపులు, విరాళాలు, ఆస్తుల కొనుగోలు వంటి అనేక అంశాల్లో నిర్ణయించిన పరిమితులను మించితే పన్ను పరమైన ఇబ్బందులు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో, ఒకే లావాదేవీకి లేదా ఒకే ఈవెంట్‌కు సంబంధించిన బహుళ లావాదేవీల రూపంలో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు స్వీకరించడాన్ని సెక్షన్ 269ఎస్‌టీ నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సెక్షన్ 271డీఏ ప్రకారం స్వీకరించిన మొత్తం విలువకు సమానమైన జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రుణాలు, డిపాజిట్ల విషయంలో కూడా ప్రత్యేక పరిమితులు ఉన్నాయి. సెక్షన్ 269ఎస్ఎస్‌ ప్రకారం రూ.20వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో రుణం, డిపాజిట్ లేదా ఆస్తికి సంబంధించిన అడ్వాన్స్‌ను స్వీకరించడాన్ని అనుమతించరు.

రుణాన్ని న‌గ‌దు రూపంలో చెల్లిస్తే..

అలాగే సెక్షన్ 269టి ప్రకారం రూ.20వేలు లేదా అంతకంటే ఎక్కువ రుణం లేదా డిపాజిట్‌ను నగదు రూపంలో తిరిగి చెల్లించకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్లు 271డి, 271ఇ కింద లావాదేవీ మొత్తం విలువకు సమానమైన జరిమానా విధించే అవకాశం ఉంటుంది. వ్యాపార సంస్థలు పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు చేసే సందర్భంలో కూడా జాగ్రత్త అవసరం. ఒక వ్యక్తికి ఒకే రోజులో రూ.10వేల కంటే ఎక్కువ నగదు చెల్లిస్తే ఆ వ్యయంపై పన్ను మినహాయింపు లభించదు. అయితే రవాణా రంగానికి చెందిన ఆపరేటర్ల విషయంలో ఈ పరిమితిని రూ.35వేలుగా నిర్ణయించారు. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన నగదు లావాదేవీలపైనా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం స్థిరాస్తి బదిలీకి సంబంధించిన రూ.20వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదు అడ్వాన్స్ లేదా చెల్లింపుల‌ను అనుమతించరు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు ఆదాయ పన్ను శాఖ పరిశీలనకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది.

విరాళాల విష‌యంలోనూ..

విరాళాల విషయంలో కూడా నగదు చెల్లింపులకు పరిమితి ఉంది. సెక్షన్ 80జి కింద రూ.2వేలు అంత కంటే ఎక్కువ నగదు విరాళాలకు పన్ను మినహాయింపు లభించదు. పన్ను ప్రయోజనం పొందాలంటే విరాళాలను బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. తమ సొంత బ్యాంకు ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు చట్టపరంగా ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకపోయినా, భారీ మొత్తాల ఉపసంహరణలు ఆదాయ పన్ను శాఖ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది. నిర్ణయించిన పరిమితిని మించిన నగదు ఉపసంహరణలపై సెక్షన్ 194ఎన్ ప్రకారం టీడీఎస్ కూడా వర్తిస్తుంది. ఒక పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న నగదు చెల్లింపులుగా విభజించి చెల్లించడం ద్వారా నిబంధనలను తప్పించుకోవచ్చని భావించడం సరైంది కాదు. ఒకే ఒప్పందం, ఒకే ఈవెంట్ లేదా ఒకే సందర్భానికి సంబంధించిన చెల్లింపులు అయితే వాటిని ఒకే లావాదేవీగా పరిగణించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా జరిమానాల‌ను విధించే అవకాశాలు ఉంటాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement