త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM E-Drive | ఈవీ టూవీల‌ర్ల‌కు మళ్లీ సబ్సిడీ.. కేంద్రం కొత్త ప్లాన్..

PM E-Drive | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మరింత ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలను కొనసాగించే దిశగా కొత్త నిధుల కేటాయింపుపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

S

Automobiles | Published On May 25, 2026, 3.18 pm IST

PM E-Drive | ఈవీ టూవీల‌ర్ల‌కు మళ్లీ సబ్సిడీ.. కేంద్రం కొత్త ప్లాన్..
Advertisement

PM E-Drive | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మరింత ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం గడువు ముగియనున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలను కొనసాగించే దిశగా కొత్త నిధుల కేటాయింపుపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేశంలో క్లీన్ మొబిలిటీ వేగాన్ని కొనసాగించడంతోపాటు దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్‌పై ఆధార ప‌డ‌డాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ పీఎం ఈ-డ్రైవ్ ప్రోగ్రామ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీలను పొడిగించేందుకు అదనపు బడ్జెట్ కేటాయింపులు కోరేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలపై సమగ్ర సమీక్ష జరుగుతున్న సమయంలో ఈ చర్చలు తెర‌పైకి వ‌చ్చాయి.

ల‌క్ష్యానికి చాలా చేరువ‌లో ఉన్న ప‌థ‌కం..

2024లో ప్రారంభించిన రూ.10,900 కోట్ల పీఎం ఈ-డ్రైవ్ పథకంలో, ఎలక్ట్రిక్ టూ-వీలర్ల సబ్సిడీల కోసం మొదటగా రూ.1,772 కోట్లు కేటాయించారు. ఈ సబ్సిడీలు 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అమల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో పథకాన్ని జూలై చివరి వరకు పొడిగించారు. ఇప్పుడు తాజా నిధులతో మరింత కాలం పొడిగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదిక తెలిపింది. పాలసీలో మార్పులు చేసే దిశగా పని జరుగుతోంద‌ని, అయితే ఎంత మొత్తం కేటాయించాలనే విషయం ఇంకా నిర్ణయించలేద‌ని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా మొత్తం 24.7 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. మే 24 నాటికి ఇప్పటికే 23.5 లక్షల వాహనాలకు సబ్సిడీలు అందించినట్లు అధికారిక డ్యాష్‌బోర్డ్ డేటా వెల్లడించింది. దీంతో పథకం లక్ష్యానికి చాలా దగ్గరగా చేరినట్లు తెలుస్తోంది.

ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ మార్కెట్ గ‌ణ‌నీయంగా వృద్ధి..

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, మొదటి సంవత్సరంలో బ్యాటరీ సామర్థ్యానికి ప్రతి కిలోవాట్-అవర్‌కు రూ.5వేల ప్రోత్సాహకం ఇస్తున్నారు. రెండో సంవత్సరంలో అది రూ.2,500కు తగ్గుతుంది. మార్కెట్ పరిపక్వత దిశగా వెళ్తున్నందున ప్రభుత్వ మద్దతును క్రమంగా తగ్గించే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన కేంద్ర ప్రోత్సాహక పథకాలపై సమీక్ష కొనసాగుతోంది. డిమాండ్, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏ పథకాలను కొనసాగించాలి, వేటిని విస్తరించాలి అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.52 లక్షల యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, 2025-26 నాటికి దాదాపు 14.6 లక్షల యూనిట్లకు పెరిగాయి. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు మాత్రం 1.32 కోట్ల యూనిట్ల నుంచి సుమారు 1.1 కోట్ల యూనిట్లకు తగ్గాయి.

కేటాయింపులు పెంచాలి..

అయితే పథకాన్ని మరింత విస్తరించాలంటే బడ్జెట్ ప్రాధాన్యతల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరానికి పీఎం ఈ-డ్రైవ్ కోసం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులను ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వినియోగించాలని భావించారు. ఎందుకంటే టూ-వీలర్లు, ఎల్5 త్రీ-వీలర్ల సబ్సిడీలు తగ్గుతాయని ముందుగా అంచనా వేశారు. ఇప్పుడు ప్రతిపాదిత మార్పులతో, ఇంధన వినియోగంలో కీలక పాత్ర పోషించే టూ-వీలర్ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆర్థిక పరిమితులు, దీర్ఘకాలిక ఎనర్జీ ట్రాన్సిషన్ లక్ష్యాల మధ్య సమతౌల్యం పాటించే ప్రయత్నం కూడా కొనసాగుతోంది.

Advertisement
Advertisement