త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EV Charging | ఈవీల‌ ఛార్జింగ్‌ల‌కు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్‌గ్రేడ్ అవసరం..

EV Charging | అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభం అవ‌క‌ముందు నుంచే దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం ఎక్కువ‌గా ఉంది. అయితే యుద్ధం వ‌ల్ల ఆ వాహ‌నాల కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

S

Technology | Published On Jul 1, 2026, 3.15 pm IST

EV Charging | ఈవీల‌ ఛార్జింగ్‌ల‌కు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్‌గ్రేడ్ అవసరం..
Advertisement

EV Charging | అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభం అవ‌క‌ముందు నుంచే దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం ఎక్కువ‌గా ఉంది. అయితే యుద్ధం వ‌ల్ల ఆ వాహ‌నాల కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసి వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే దేశంలో ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ (ఈవీ) వినియోగం వేగంగా పెరుగుతున్న‌ప్ప‌టికీ, వాటిని చార్జింగ్ చేసేందుకు ప్ర‌జ‌ల ఇళ్ల‌లో స‌రైన విద్యుత్ వ్య‌వ‌స్థ లేద‌ని, దేశ‌వ్యాప్తంగా సుమారుగా 45 శాతం మంది ఇళ్లలో విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను అప్ గ్రేడ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాజా నివేదిక వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా 80వేల‌కు పైగా నివాసాల్లోని ఈవీ చార్జ‌ర్ ఇన్‌స్టాలేష‌న్ల డేటాను విశ్లేషించి ఈ నివేదిక‌ను విడుద‌ల చేశారు. ది నెట్-జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ అట్ హోమ్: ఎనేబ్లింగ్ ఈవీ-రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన ఈ నివేదికను కాజ‌మ్, అలియ‌న్స్ ఫ‌ర్ యాన్ ఎన‌ర్జీ ఎఫిషియెంట్ ఎకాన‌మీ (ఏఈఈఈ) సంయుక్తంగా రూపొందించాయి.

45 శాతం ఇళ్ల‌కు అప్‌గ్రేడ్‌లు అవ‌సరం..

నివేదిక‌లో తెలిపిన ప్ర‌కారం దేశంలోని టియర్-1, టియర్-2, టియర్-3 నగరాలతోపాటు స్వతంత్ర ఇళ్లు, అపార్ట్‌మెంట్ సముదాయాలు, అనధికార నివాస ప్రాంతాలు, షేర్డ్ రెంటల్ హౌసింగ్ త‌దిత‌ర విభిన్న గృహాలను పరిశీలించారు. భారత్‌లో దాదాపు 45 శాతం ఇళ్లకు ఈవీలను సురక్షితంగా ఛార్జ్ చేయడానికి విద్యుత్ అప్‌గ్రేడ్‌లు అవసరం అని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి ఇంటిలో ఈవీ ఛార్జింగ్‌ను సురక్షితంగా, విశ్వసనీయంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు కనీస విద్యుత్ ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తృతంగా అభివృద్ధి చెందినప్పటికీ, నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ సౌకర్యం అందరికీ సమానంగా అందుబాటులో లేదని నివేదిక వెల్లడించింది. 2024లో దేశ విద్యుత్ డిమాండ్‌లో ఈవీల వల్ల ఏర్పడే విద్యుత్ వినియోగం కేవలం 0.2 శాతం మాత్రమే ఉండగా, 2035 నాటికి అది సుమారు 6 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో కేవలం 55 శాతం మందికే ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపింది.

ప్రమాదాలు జ‌రిగే అవ‌కాశం..

విద్యుత్ మౌలిక సదుపాయాల లోపం, గృహ పరిస్థితులు, అనుమతుల ప్రక్రియలు, ఖర్చు వంటి సమస్యల కారణంగా చాలామంది సాధారణ ప్లగ్ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్‌టెన్షన్ వైర్లు లేదా ఈవీ ఛార్జింగ్‌కు అనుకూలంగా లేని షేర్డ్ కనెక్షన్లను ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇలాంటి పద్ధతులు అగ్ని ప్రమాదాలు, విద్యుత్ భద్రతా సమస్యలకు దారితీయడమే కాకుండా, ఛార్జింగ్ విశ్వసనీయతను తగ్గిస్తాయని, ఛార్జింగ్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతోపాటు బ్యాటరీ పనితీరు కూడా వేగంగా క్షీణించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి పరిస్థితులను నివారించాలని సూచించింది. ఈవీ ఛార్జింగ్ కోసం తగిన విద్యుత్ లోడ్‌తోపాటు ప్రత్యేక ఛార్జింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అలాగే ప్రమాణాలకు అనుగుణమైన వైరింగ్, సరైన ఎర్తింగ్, అగ్నిమాప‌క‌ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఛార్జర్‌ల‌ను అమర్చాలని పేర్కొంది.

ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాలి..

అలాగే సరైన రేటింగ్ కలిగిన ఎంసీబీలు, ఎర్త్-లీకేజ్ రక్షణ వ్యవస్థ, నిరంతర ఛార్జింగ్ లోడ్ల కోసం ప్రత్యేకంగా ధ్రువీకరించిన ఈవీ సబ్-మీటర్‌ను ఉపయోగించాలని కూడా నివేదిక సూచించింది. కాజ‌మ్ సంస్థ‌ దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తుండ‌గా, అలియ‌న్స్ ఫ‌ర్ యాన్ ఎన‌ర్జీ ఎఫిషియెంట్ ఎకాన‌మీ దేశంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించే దిశగా పనిచేస్తోంది. అయితే దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈవీల య‌జ‌మానుల‌కు ఇళ్ల వ‌ద్ద స‌రైన చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసుకునేలా వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌ని, అందుకు అనుగుణంగా ప్ర‌మాణాల‌ను నిర్దారించాల‌ని, అవ‌స‌రం అయితే ఈవీల య‌జ‌మానుల‌కు ఇందుకు ప్ర‌భుత్వాలు స‌హ‌కారం అందించాల‌ని కూడా నివేదిక స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement