త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | శనివారం కొండగట్టుకి పవన్ కళ్యాణ్.. ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధులు మంజూరు

టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

J

Andhra pradesh | Published On Jan 2, 2026, 4.48 pm IST

Pawan Kalyan | శనివారం కొండగట్టుకి పవన్ కళ్యాణ్.. ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధులు మంజూరు
Advertisement

Pawan Kalyan | ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 3, 2026 శనివారం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ క్షేత్రానికి రానున్నారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కొండగట్టు అంజన్న ఆలయం డెవలప్‌మెంట్ కోసం టీటీడీ నుంచి మంజూరు చేసిన రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయమై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడుతో చర్చించారు. టీటీడీ బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు.

జనసేన కార్యకర్తలతో సమావేశం

ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement