త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gayatri Waterfalls | గాయ‌త్రి వాట‌ర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జ‌ల‌పాతం..

Gayatri Waterfalls | మీరు ప్ర‌కృతి ప్రేమికులా..? జ‌ల‌పాతాలు( Waterfalls ) అంటే అమిత‌మైన ఇష్ట‌మా..? అది కూడా 100 అడుగుల ఎత్తులో నుంచి పాల‌పొంగులా పొంగే వాట‌ర్ ఫాల్‌ను చూడాల‌ని ఇష్ట‌ప‌డుతున్నారా..? అయితే ఆల‌స్యమెందుకు మ‌రి.. మ‌న ఆదిలాబాద్ జిల్లా( Adilabad District )లోని ఇచ్చోడ మండ‌ల( Ichoda Mandal ) ప‌రిధిలోని గాయ‌త్రి జ‌ల‌పాతం( Gayatri Waterfalls ) పిలుస్తోంది. ఈ వాట‌ర్ ఫాల్ విశేషాలివే..

S

Tourism | Published On Jul 7, 2026, 8.04 am IST

Gayatri Waterfalls | గాయ‌త్రి వాట‌ర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జ‌ల‌పాతం..
Advertisement

Gayatri Waterfalls | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప‌ర్యాట‌కానికి అద్భుత‌మైన ప్రాంతం. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంతో పాటు ప‌దుల సంఖ్య‌లో జ‌ల‌పాతాలు( Waterfalls ) క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షాకాలం కావ‌డంతో జ‌ల‌పాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఆ వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద ర‌మ‌ణీయ‌త‌తో కూడిన ప్ర‌కృతి.. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. కుంటాల‌( Kuntala ), పొచ్చెర జ‌ల‌పాతాల‌తో మ‌రో జ‌ల‌పాతం ప‌ర్యాట‌కుల కోసం ఎదురుచూస్తోంది. 100 అడుగుల ఎత్తు నుంచి పాల పొంగులా జాలువారుతున్న జ‌ల‌పాతం అందాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లు స‌రిపోవు. మ‌రి అంత‌టి ర‌మ‌ణీయ‌త‌తో కూడిన జ‌ల‌పాతం ఎక్క‌డుందంటే.. మ‌న ఆదిలాబాద్ జిల్లా( Adilabad District )లోని ఇచ్చోడ మండ‌లం( Ichoda Mandal )లో.

క‌డెం న‌ది( Kadem River ) ప్ర‌వాహంతో ఏర్ప‌డిన ఆ జ‌ల‌పాత‌మే గాయ‌త్రి జ‌ల‌పాతం( Gayatri Waterfalls ). ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో.. ముదురు వ‌ర్ణం బండ‌రాళ్ల మ‌ధ్య నుంచి సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి పాల పొంగులా ప్ర‌వ‌హిస్తున్న గాయ‌త్రి వాట‌ర్ ఫాల్ ప‌ర్యాట‌కుల‌ను మైమ‌రిపిస్తుంది. ఇక ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా గాయ‌త్రి జ‌లపాతం ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు క‌లిగిస్తుంది. నీటి ప్ర‌వాహం మ‌రింత పెర‌గ‌డంతో.. ఆ ప్రాంత‌మంతా పొగ‌మంచుతో క‌ప్పుకున్న‌ట్లుగా మారింది. జ‌ల‌పాతం దృశ్యాలు, ఆకుప‌చ్చ‌ని అట‌వీ ప్రాంతాలు.. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఓ మ‌రుపురాని అనుభూతిని క‌లిగిస్తాయి.

హైద‌రాబాద్ నుంచి ఎలా వెళ్లాంటే..?

జాతీయ ర‌హ‌దారి 44పై నిజామాబాద్, నిర్మ‌ల్ మీదుగా నేరెడిగొండ చేరుకోవాలి. అక్క‌డ్నుంచి వ‌యా కుప్టి గ్రామం మీదుగా త‌ర్నంఖుర్ద్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. నేరెడిగొండ నుంచి త‌ర్నంఖుర్ద్ వ‌ర‌కు 8 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక త‌ర్నంఖుర్ద్ ఊరులోనే ప‌ర్యాట‌కులు త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకోవాలి. అక్క‌డ్నుంచి సుమారు 5 కిలోమీట‌ర్ల మేర ట్రెక్కింగ్ చేయాలి. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో.. చిన్న చిన్న వాగులు దాటుతూ స్థానికుల సూచ‌న‌ల మేర‌కు గాయ‌త్రి జ‌ల‌పాతం చేరుకోవ‌చ్చు.

నో నెట్‌వ‌ర్క్..

అయితే గాయ‌త్రి జ‌ల‌పాతం వెళ్లాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు ఇది షాకింగ్ విష‌యం. ఎందుకంటే.. ట్రెక్కింగ్ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి మొబైల్ నెట్ వ‌ర్క్, ఇంట‌ర్నెట్ స‌దుపాయం ఉండ‌దు. క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ నిలిచిపోతుంది. కాబ‌ట్టి.. ముందుగానే కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం మంచిది.

ఏయే ప్రాంతం నుంచి ఎంత దూరం అంటే..?

ఇచ్చోడ నుంచి 11 కి.మీ., కుంటాల జ‌ల‌పాతం నుంచి 19 కి.మీ., నిర్మ‌ల్ నుంచి 38 కి.మీ., ఆదిలాబాద్ నుంచి 59 కి.మీ., హైద‌రాబాద్ నుంచి 270 కి.మీ. దూరంలో గాయత్రి జ‌ల‌పాతం ఉంది.

Advertisement
Advertisement