త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసే వరకు పోరాటం ఆపం : శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ చేపట్టనున్న పాదయాత్రకు భయపడే ప్రభుత్వం హడావిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు.

P

Telangana | Published On May 19, 2026, 10.26 pm IST

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసే వరకు పోరాటం ఆపం : శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ చేపట్టనున్న పాదయాత్రకు భయపడే ప్రభుత్వం హడావిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ఈఎన్‌సీలు లేకుండా సమీక్షలు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటివరకు “తట్టెడు మట్టి కూడా తీయలేదని” మండిపడ్డారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినప్పటికీ పాలమూరు ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయారని అన్నారు.

కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు పనుల్లో 90 శాతం పూర్తయ్యాయని, కేవలం 10 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపారు. పంప్‌హౌస్‌ల నిర్మాణం, టన్నెలింగ్ పనులు పూర్తయ్యాయని, కాలువల టెండర్లు కూడా ఖరారు చేశామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసిందని విమర్శించారు. ఆ పనులు కొనసాగించి ఉంటే ఈరోజు ఉమ్మడి జిల్లాలోని నాలుగు రిజర్వాయర్లు నీటితో కళకళలాడేవని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది’ అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. పాదయాత్ర ప్రకటన వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించడం తమ ఉద్యమానికి వచ్చిన స్పందనకే నిదర్శనమని అన్నారు.

అయితే, ఆ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘ప్రాజెక్టు పరిస్థితిపై అవగాహన లేకుండానే సమీక్షలు నిర్వహిస్తున్నారు’ అంటూ విమర్శించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను ఒకసారి పరిశీలిస్తే ఇంజినీరింగ్ అద్భుతం ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. అక్కడికి వెళ్లి చూడకుండా సమీక్షలు చేశామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. వచ్చే నెలలో చేపట్టనున్న పాదయాత్ర ద్వారా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను చూపిస్తామని తెలిపారు. “మా లక్ష్యం రాజకీయ విమర్శలు కాదు.. ప్రాజెక్టు పూర్తి కావడమే” అని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా విమర్శలకు పరిమితం కాకుండా గత రెండున్నరేళ్లలో పాలమూరు-రంగారెడ్డి పథకంపై ఏ పనులు చేసిందో ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ద్వారా రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement